న్యూఢిల్లీ: రాజధాని ఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్ వెలుపల ఏర్పాటు చేసిన భద్రతా బారికేడ్లను అధికారులు తొలగించారు. జమ్ముకశ్మీర్పై అమెరికా ప్రతినిధి చేసిన వ్యాఖ్యలపై పాకిస్థాన్ అభ్యంతరం వ్యక్తం చేసిన మరుసటి రోజే ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. పాక్ దౌత్య కార్యాలయానికి చెందిన వీసా విభాగం సమీపంలోని లైన్లలో, నిర్ణీత ప్రాంగణ పరిధికి వెలుపల ఉన్న క్యూ లైనర్లు, బారికేడ్లను అధికారులు తొలగించినట్లు తెలుస్తోంది.
పాకిస్థాన్ హైకమిషన్ వెలుపల తొలగించిన బారికేడ్లు, దెబ్బతిన్న గోడల సమీపంలో భద్రతా సిబ్బంది ఉన్న దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. అయితే, అమెరికా రాయబారి వ్యాఖ్యలపై పాక్ వ్యక్తం చేసిన నిరసనకు, ఈ బారికేడ్ల తొలగింపునకు సంబంధం ఉందా లేదా అనే విషయంపై అధికారికంగా ఎలాంటి స్పష్టత రాలేదు. ఈ నిర్మాణాలను ఎందుకు తొలగించారనే దానిపై అధికారులు ఇంకా ఎటువంటి బహిరంగ ప్రకటన చేయలేదు.
ఇటీవల అమెరికా ప్రతినిధి జమ్ముకశ్మీర్ను ‘భారత్లో అంతర్భాగం’గా పేర్కొనడంపై పాకిస్థాన్ తీవ్ర నిరసన తెలిపింది. ఇస్లామాబాద్లోని అమెరికా రాయబార కార్యాలయ ప్రతినిధి నటాలీ బేకర్కు సమన్లు జారీ చేసి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కశ్మీర్ అంశం భారత్, పాకిస్థాన్ ద్వైపాక్షికంగా పరిష్కరించుకోవాల్సిన విషయమని అమెరికా స్పష్టం చేయగా, మూడో పక్షం జోక్యాన్ని భారత్ ఎప్పటినుంచో వ్యతిరేకిస్తోంది. ఇదే సమయంలో ఆరేళ్ల తర్వాత కశ్మీర్లో పర్యటించిన అమెరికా ప్రతినిధితో స్థానిక నేతలు ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ భేటీ అయి ట్రావెల్ అడ్వైజరీ సమీక్షతో పాటు పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు.
ఇది కూడా చదవండి: చైనా 60 కి.మీ చొరబడిందా?.. క్లారిటీ ఇచ్చిన కిరణ్ రిజిజు


