
తిరుపతి తొక్కిసలాటలో గాయపడి, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పరామర్శించిన సందర్భంగా..
సాక్షి, తిరుపతి: తిరుపతి తొక్కిసలాట(tirupati stampede)లో గాయపడి, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పరామర్శించిన సందర్భంగా.. మంత్రి ఆనం రామనారాయణరెడ్డి(Anam Ramanarayana Reddy) చేసిన అర్థం లేని ఆరోపణలపై వైఎస్సార్సీపీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి(Bhumana Karunakar Reddy) వీడియో ద్వారా ధీటుగా బదులిచ్చారు.
భూమన కరుణాకర్రెడ్డి ఏమన్నారంటే..:
‘మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మాపై చేసిన ఆరోపణలు దారుణంగా ఉన్నాయి. నిజానికి మీ నిర్వాకం వల్ల ఆరుగురు మరణిస్తే, నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాల్సింది పోయి, జగన్పై ఆరోపణలు చేశారు. ఇది కచ్చితంగా మీరు స్థాయి దిగజారి మాట్లాడటమే. ఇంత హీనంగా మాట్లాడగలనని మీకు మీరు నిరూపించుకున్నారు. మీ మాటలతో తొక్కిసలాటలో మరణించిన వారి బంధువులు, క్షతగాత్రులను దారుణంగా అవమానించారు’.
‘తొక్కిసలాట బాధితులపై సానుభూతి చూపాల్సింది పోయి, పరామర్శించి ఆర్థిక సాయం చేయాల్సింది పోయి.. మేం డబ్బులిచ్చి మిమ్మల్ని తిట్టించడానికి వాడుకున్నామనడం రాజకీయం కాదా?. దీన్ని బట్టే ఎవరు రాజకీయం చేస్తున్నారో తేటతెల్లం అవుతోంది. మీకు క్షతగ్రాత్రుల మీద కూడా సదభిప్రాయం లేదని అర్థమవుతోంది. వారు మీ గురించి మాట్లాడలేదని మీరు ఇలా మాట్లాడుతారా? మీ అస్తిత్వానికి ఇబ్బంది వస్తుందని ఇలా ఆరోపణలు చేస్తారా?’.
‘మాజీ ముఖ్యమంత్రి వస్తుంటే ట్రాక్టర్లు అడ్డుపెట్టి అడ్డుకోవాలనుకోవడం దారుణం కాదా?. కనీస భధ్రత ఇవ్వాలని కూడా తెలియదా?. జగన్ ఆస్పత్రికి వస్తున్నారని తెలిసి కూడా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అంతసేపు అక్కడెందుకు ఉన్నారు?. అది కావాలనే ఉద్దేశపూర్వకంగా చేసింది కాదా?. జగన్ ఆసుపత్రికి రాకుండా కుట్ర చేసిన మాట నిజం కాదా?’.

ఇదీ చదవండి: బాబు డ్రామాలో పవన్ బకరా!
‘మిమ్మల్ని తిట్టించడం కోసం మేం ఆస్పత్రిలో డబ్బులిచ్చామన్నది సీసీ కెమెరాలో రికార్డయిందని అంటున్నారు కదా?. ఆనం రామనారాయణ రెడ్డికి సవాల్ చేస్తున్నాం. తొక్కిసలాట క్షతగాత్రులతో మిమ్మల్ని తిట్టించడం కోసమే మేము వారికి డబ్బులు ఇచ్చామంటున్నారు కదా!. ఒకవేళ అది నిజమైతే, మీకు నిజంగా దేవుడిపై భక్తి కలిగి ఉంటే మేం కేవలం మిమ్మల్ని తిట్టించడం కోసమే తొక్కిసలాట క్షతగాత్రులకు డబ్బులిచ్చినట్లు మీరు నిరూపించాలి. ఆ పని చేయలేకపోతే వెంటనే మీ పదవికి రాజీనామా చేయాలి’.
‘నిజానికి జగన్ వచ్చేవరకు మమ్మల్ని ఆసుపత్రి వైపు మీ పోలీసులు, అధికార గణం వెళ్లనీయలేదు. ఆ విషయం గుర్తుంచుకొండి. చంద్రబాబు పాలనపై ప్రజలకు ఏ అభిప్రాయం ఉందో ఇప్పటికే అందరికీ అర్థమవుతోంది. మీరు దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నా.. మీ పార్టీలో ఎవరూ గుర్తించడం లేదనే మీరు, ఇలా ఆరోపణలు చేశారనేది స్పష్టంగా అర్థమవుతోంది’’ అని భూమన పేర్కొన్నారు.