ఇలాంటి యువనేతలు ఇక పనికిరారా? ఈ రాష్ట్రాల్లో ఇదే జరిగింది.. | The Battle for Succession Who Will Lead Next | Sakshi
Sakshi News home page

ఇలాంటి యువనేతలు ఇక పనికిరారా? ఈ రాష్ట్రాల్లో ఇదే జరిగింది..

Jun 17 2026 9:20 PM | Updated on Jun 17 2026 9:36 PM

 The Battle for Succession Who Will Lead Next

భారత రాజకీయాల్లో వారసత్వం ఒక్కటే నాయకత్వాన్ని తెచ్చిపెట్టదని కొన్నేళ్లుగా చోటుచేసుకుంటున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రజల ఆమోదం, పార్టీ శ్రేణుల విశ్వాసం, వ్యక్తిగత రాజకీయ సామర్థ్యమే అసలైన బలమని తాజా రాజకీయ పరిణామాలు సూచిస్తున్నాయి. 

ప్రాంతీయ పార్టీల్లో వారసత్వ రాజకీయాలపై పెరుగుతున్న ప్రశ్నలు, నాయకత్వ మార్పుల చుట్టూ నెలకొంటున్న విభేదాలు పార్టీలను కుదిపేస్తున్నాయి. కేవలం నాయకుడి కుటుంబ సభ్యుడు కావడం వల్ల యువనేతకు నాయకత్వం ఇవ్వకూడదని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. ఇందుకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి.

పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్‌లో నెలకొన్న సంక్షోభాన్ని ఉదాహరణగా తీసుకుంటే.. భారతీయ రాజకీయాల్లో వారసత్వ రాజకీయాల భవిష్యత్తుపై అ‍క్కడి పరిణామాలే సాక్షాలుగా నిలుస్తున్నాయి.

నమ్మకాన‍్ని స్వయంగా సంపాదించుకోవాలి.. 
ప్రాంతీయ పార్టీల వ్యవస్థాపక నాయకులు తమ కష్టంతో పార్టీని నిర్మిస్తారు. కానీ వారి వారసులు అదే స్థాయి పాపులారిటీని, ప్రజామోదాన్ని, ముఖ్యంగా పార్టీ శ్రేణుల నమ్మకాన‍్ని స్వయంగా సంపాదించుకోవాల్సి ఉంటుంది. కేవలం రాజకీయ కుటుంబ సంబంధాలు సరిపోవు.

మమతా బెనర్జీ తర్వాత పార్టీ నాయకత్వం ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీ చేతిలోకి వెళ్లాలని భావించడం పార్టీలోని వారికి నచ్చలేదని ఇ‍ప్పటికే స్పష్టమవుతోంది. "మమతా తర్వాత అభిషేకే వారసుడు" అనే భావనను పార్టీలోని కొందరు నేతలు అంగీకరించలేదు. అధికారం కోల్పోయిన తర్వాత ఈ అసంతృప్తి బహిర్గతమైంది. ఇదే సమస్య గతంలో శివసేన, ఎన్సీపీ, సమాజ్‌వాదీ పార్టీల్లో కూడా కనిపించింది.

యువ ఓటర్లు ఇప్పుడు కుటుంబ వారసత్వాన్ని మాత్రమే చూసి నాయకులను అంగీకరించడం లేదని, పనితీరు ఆధారంగా నాయకత్వాన్ని అంచనా వేస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భారతదేశంలో వేల సంఖ్యలో నమోదైన చిన్న రాజకీయ పార్టీలు తిరుగుబాటు నేతలకు ఆశ్రయం కల్పించే వేదికలుగా మారుతున్నాయి. టీఎంసీ తిరుగుబాటు నేతలు ఎన్‌సీపీఐ వైపు వెళ్లడం దీనికి ఉదాహరణ.

వారసత్వం అనేది రాజకీయాల్లోకి రావడానికి ప్రవేశ ద్వారాన్ని తెరవవచ్చు. కానీ పార్టీని నిలబెట్టేది నాయకుడి వ్యక్తిగత సామర్థ్యం, పార్టీ కార్యకర్తల విశ్వాసం, సంస్థాగత బలం మాత్రమే.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement