4 కోట్ల ప్రజలకు డబ్బిస్తే నలుగురు దోచుకుంటున్నారు 

Bandi Sanjay Fires On KCR - Sakshi

సీఎం కేసీఆర్‌ ఆ నలుగురికే పంపకాలు చేస్తున్నారు.. బండి సంజయ్‌ ఆరోపణలు

తెలంగాణ సమాజాన్ని గాలికొదిలేశారు.. 

రాష్ట్రంలో ఏ వర్గాన్ని కదిలించినా కష్టాలు, కన్నీళ్లే.. 

ప్రజలు అంతోఇంతో బాగున్నారంటే కేంద్ర నిధులు, మోదీ చలవే.. 

బీజేపీ కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు 

సాక్షి, హైదరాబాద్‌: కేంద్రం గత తొమ్మిదేళ్లలో తెలంగాణ అభివృద్ధికి, 4 కోట్ల ప్రజల కోసం రూ.4 లక్షల కోట్లు కేటాయిస్తే, ఆ డబ్బును నలుగురు మాత్రమే దోచుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. సీఎం కేసీఆర్‌ డబ్బును ఆ నలుగురికే పంచుతూ తెలంగాణ సమాజాన్ని గాలికొదిలేశారని అన్నారు. కొట్లాడి సాధించిన రాష్ట్రం వారి చెరలో బందీ అయ్యిందంటూ తీవ్ర విమర్శలు చేశారు.

తెలంగాణలో అంతో ఇంతో అభివృద్ధి జరిగిందంటే, ప్రజలు బాగున్నారంటే కేంద్ర నిధులు, మోదీ అమలు చేస్తున్న పథకాలే కారణమని పేర్కొన్నారు. శుక్రవారం రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని పార్టీ కార్యాలయంలో సంజయ్‌ జాతీయ జెండా ఎగురవేసి ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ కోసం ఎంతోమంది యువకులు ఆత్మ బలిదానాలు చేసుకుంటుంటే.. ‘మీరు ఆత్మహత్య చేసుకోవద్దు. తెలంగాణ కల సాకారం చేస్తాం..’అంటూ సుష్మా స్వరాజ్‌ పార్లమెంట్‌ వేదికగా చెప్పడమే కాకుండా, తెలంగాణ బిల్లుకు మద్దతు ప్రకటించారని చెప్పారు. 

బీజేపీ ధాటికి తట్టుకోలేక దేశమ్మీద పడ్డారు.. 
దేశాభివృద్ధికి మోదీ ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుంటే, తెలంగాణలో మాత్రం మూర్ఖపు పాలన సాగుతోందని బండి విమర్శించారు. తెలంగాణలో సంపద సృష్టికి కేంద్రం లక్షల కోట్లు కేటాయిస్తుంటే.. రాష్ట్ర ప్రభుత్వం సహకరించపోగా కేంద్ర పథకాలను అమలు కూడా చేయడం లేదన్నారు. తెలంగాణకు ఇచ్చిన కేంద్ర నిధులతో పాటు, చేసిన అభివృద్ధిపై చర్చకు రమ్మంటే కేసీఆర్‌ పారిపోతున్నాడని, బీజేపీ ధాటికి తట్టుకోలేక టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చుకుని దేశమ్మీద పడ్డారని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ మూర్ఖపాలనలో తెలంగాణ అధోగతి పాలైందని, ఏ వర్గాన్ని కదిలించినా కష్టాలు, కన్నీళ్లే అని అన్నారు.  

ఉద్యమకారులు కలిసి రావాలి.. 
తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేదలపై భారం పడకుండా ఉచితంగా విద్య, వైద్యాన్ని అందిస్తామని, నిలువనీడలేని పేదలందరికీ ఇండ్లు కట్టిస్తామని సంజయ్‌ హామీ ఇచ్చారు. ఫసల్‌ బీమా అమలు చేయడంతో పాటు 25 వేల టీచర్‌ పోస్టులు సహా ఉద్యోగ ఖాళీలన్నిటినీ భర్తీ చేస్తామని అన్నారు. బీజేపీని దెబ్బతీసేందుకు, వివిధ ఎన్నికల్లో డిపాజిట్లు రాని కాంగ్రెస్‌ను లేపేందుకు బీఆర్‌ఎస్‌ కుట్రలు చేస్తోందని ఆరోపించారు.

బీఆర్‌ఎస్‌ సర్కార్‌ ఓటమి లక్ష్యంగా గతంలో చేసిన మిలియన్‌ మార్చ్, వంటావార్పు, సకల జనుల సమ్మె స్ఫూర్తితో కలిసి పోరాడదామని, బీజేపీ చేసే పోరాటాలకు ఉద్యమకారులందరూ కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. పార్టీ నేతలు నల్లు ఇంద్రసేనారెడ్డి, జి.వివేక్, పొంగులేటి సుధాకర్‌ రెడ్డి, మర్రి శశిధర్‌ రెడ్డి, బూర నర్సయ్యగౌడ్, రవీంద్రనాయక్‌ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

అధికారంలోకి వచ్చాక దారుస్సలాం స్వాదీనం 
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో ఒవైసీ పాల్గొనకపోవడంపై బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ సమాధానం చెప్పాలని సంజయ్‌ డిమాండ్‌ చేశారు. శుక్రవారం రాష్ట్ర కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో ఆయన ఇష్టాగోష్టిగా మాట్లాడారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన జెండా ఎగురవేయని వారికి రాష్ట్రంలో పోటీ చేసే అర్హత లేదన్నారు. అక్కడ జెండా ఎగరవేయనందుకు కేసీఆర్‌కు దమ్ముంటే దారుస్సలాంకు తాళం వేయాలన్నారు. ఆర్నెల్లలో తాము అధికారంలోకి వచ్చాక దారుస్సలాంను స్వాధీనం చేసుకుని పేద ముస్లింలకు ఇచ్చేస్తామని చెప్పారు.  

రేవంత్‌లా పార్టీలు మారడం నాకు చేతకాదు 
తనకు రేవంత్‌రెడ్డి మాదిరిగా పార్టీలు మారడం చేతకాదని బండి వ్యాఖ్యానించారు. ఆయనలాగా ఓటుకు నోటు కేసులో మాదిరి డబ్బులు పంచడం కూడా రాదన్నారు. తనకు పార్టీ నడపడం రాదని చెబుతున్న రేవంత్‌.. ఏ విధంగా పార్టీని నడిపిస్తున్నారో జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, కోమటిరెడ్డి, జగ్గారెడ్డి వంటి నేతలను అడిగితే తెలుస్తుందని చెప్పారు. తమది కుటుంబ పార్టీ కాదని, అయ్య పేరు చెప్పి కూతురు, కొడుకు సీఎంలు అయ్యే పార్టీ కాదని, అలాగే అయ్య లేకుంటే బిడ్డ, బిడ్డ లేకుంటే కొడుకు సీఎం అయ్యే పార్టీ కూడా కాదని చెప్పారు.     

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top