ప్రధాని మోదీ నాపై కుట్ర పన్నారు: కేజ్రీవాల్‌ | Arvind Kejriwal says PM conspired to prove me corrupt | Sakshi
Sakshi News home page

ప్రధాని మోదీ నాపై కుట్ర పన్నారు: కేజ్రీవాల్‌

Sep 22 2024 1:02 PM | Updated on Sep 22 2024 1:19 PM

Arvind Kejriwal says PM conspired to prove me corrupt

ఢిల్లీ: తనను అవినీతిపరుడిగా నిరూపించుకునేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కుట్ర పన్నారని ఆమ్ ఆద్మీ పార్టీ చీప్‌, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ మండిపడ్డారు. ఆదివారం ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో జరిగిన ‘జంతాకీ అదాలత్‌’ కార్యక్రమంలో కేజ్రీవాల్‌ పాల్గొని మాట్లాడారు.

‘‘ప్రధాని నరేంద్ర మోదీ మాపై కుట్ర పన్నారు. నన్ను, ఆప్‌ నేత మనీష్‌ సిసోడియా అవినీతిపరుడని నిరూపించేందుకు కుట్ర పన్నారు. ఆప్‌ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నించారు. ముఖ్యమంత్రి కుర్చీపై దాహం లేకపోవడం వల్లే రాజీనామా చేశా. డబ్బు సంపాదించడానికి కాదు రాజకీయాల్లో వచ్చింది. దేశ రాజకీయాలను మార్చేందుకు వచ్చాను.

...మేము జాతీయవాదులుము, దేశభక్తులమని ఆర్‌ఎస్‌ఎస్‌ వాళ్లు అంటున్నారు. మోహన్ భగవత్‌ గారికి నేను గౌరవంగా ఐదు ప్రశ్నలు అడగాలనుకుంటున్నా. మోదీ పార్టీలను విచ్ఛిన్నం చేయడం, నేతలను ప్రలోభపెట్టడం, ఈడీ, సీబీఐలతో బెదిరించడం ద్వారా దేశవ్యాప్తంగా ప్రభుత్వాలను పడగొట్టడం సరైనదేనా?. మోదీ బీజేపీలో అత్యంత అవినీతి నాయకులను చేర్చుకున్నారు. వారిని అవినీతిపరులని ఆయనే స్వయంగా పిలిచారు. అలాంటి రాజకీయాలను మీరు అంగీకరిస్తారా?. 

...ఆర్‌ఎస్‌ఎస్ నుంచి బీజేపీ పుట్టింది. బీజేపీ దారితప్పకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆర్‌ఎస్‌ఎస్‌పై ఉంది. మోదీ తప్పుడు పనులు చేయకుండా మీరు ఎప్పుడైనా ఆపారా?. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా లోక్‌సభ ఎన్నికల సమయంలో తనకు ఆర్‌ఎస్‌ఎస్ అవసరం లేదని అన్నారు. బీజేపీ అంతగా ఎదిగిపోయిందా? మాతృసంస్థపై తన అసహనాన్ని ప్రదర్శించాడు. ఆయన చేసిన వ్యాఖ్యలు మీకు బాధ కలగలేదా?. 75 ఏళ్ల తర్వాత నేతలు రిటైర్ అవుతారని మీరే చట్టం చేశారు. ఈ రూల్ ప్రధాని మోదీకి వర్తించదని కేంద్రమంత్రి అమిత్ షా చెబుతున్నారు. పార్టీ నేత అద్వానీకి వర్తించిన రూల్‌.. మోదీకి ఎందుకు వర్తించదు?’’అని అన్నారు.
 

చదవండి: సీఎం పీఠంపై మహిళా శక్తి

Advertisement
 
Advertisement
Advertisement