
సాక్షి, విజయవాడ: ప్రతిపక్ష హోదా కల్పించాలని వైఎస్సార్సీపీ అధినేత, ఆ పార్టీ శాసన సభాపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిటిషన్పై ఏపీ హైకోర్టు మంగళవారం విచారణ జరిపింది. కక్షపూరితంగా ప్రతిపక్ష నేత హోదా ఇవ్వటం లేదని వైఎస్ జగన్ తరఫున న్యాయవాది తన వాదనను వినిపించారు.
ప్రతిపక్ష నేతగా గుర్తించాలని స్పీకర్కు వైఎస్ జగన్ రిప్రజెంటేషన్ ఇచ్చారా అని న్యాయమూర్తి ప్రశ్నించగా, గత నెల 24న ఇచ్చారని కోర్టుకు వైఎస్ జగన్ తరఫున న్యాయవాది తెలిపారు. అసెంబ్లీ సెక్రటరీ, స్పీకర్ కార్యదర్శికి కోర్టు నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ మూడు వారాలకు విచారణను కోర్టు వాయిదా వేసింది.
కాగా, శాసనసభ ఎన్నికల్లో తమ పార్టీకి 11 సీట్లు వచ్చాయన్న కారణంతో తమ పార్టీకి ప్రతిపక్ష హోదా, తనకు ప్రతిపక్ష పార్టీ నేత హోదా ఇచ్చే విషయంలో స్పీకర్ నాన్చుడు ధోరణి ప్రదర్శిస్తున్నారని, ప్రతిపక్ష హోదా ఇచ్చే ఉద్దేశం లేనందునే ఇలా చేస్తున్నారంటూ వైఎస్ జగన్ ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.