వంద మందిని తీసుకురండి.. బీజేపీకి అఖిలేష్ యాద‌వ్ చుర‌క‌లు | a | Sakshi
Sakshi News home page

వంద మందిని తీసుకురండి.. బీజేపీకి అఖిలేష్ వ‌ర్షాకాల ఆఫ‌ర్‌

Jul 18 2024 2:55 PM | Updated on Jul 18 2024 3:09 PM

a

ఉత్త‌ర ప్ర‌దేశ్‌లో రాజ‌కీయాలు ఆస‌క్తిక‌రంగా మారాయి. గ‌త లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో అధికార బీజేపీకి భంగపాటు ఎదురవడంతో ఎన్నికల ఫలితాలపై కాషాయ పార్టీ మేథోమథనం నిర్వహించింది.

సార్వత్రిక ఎన్నికల తర్వాత పార్టీ నాయ‌క‌త్వంలో లుకలుకలు మొదలైనట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, డిప్యూటీ సీఎం కేశవ్‌ ప్రసాద్‌ మౌర్యకు భేదాభిప్రాయాలు బయటపడుతున్న‌ వేళ ప్ర‌తిప‌క్ష ఎస్పీఅధినేత అఖిలేష్ యాద‌వ్‌ బీజేపీపై సెటైర్లతో విరుచుకుప‌డ్డారు.

బీజేపీకి ‘మాన్‌సూన్‌ ఆఫర్‌’ ఇచ్చారు. ‘‘మాన్‌సూన్‌ ఆఫర్‌: వందమందిని తీసుకొచ్చి.. ప్రభుత్వం ఏర్పాటు చేయండి’’ అంటూ ‘ఎక్స్‌’ వేదికగా పోస్టు చేశారు. డిప్యూటీ సీఎం కేశవ్‌ ప్రసాద్‌ను ఉద్దేశిస్తూ ఈ పోస్టు చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని బీజేపీ పార్టీ యూనిట్‌లో అంతర్గత పోరు ప్రజల సంక్షేమాన్ని దెబ్బతీస్తుందని విమర్శలు గుప్పించారు. రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించేవారు ఈ ప్రభుత్వంలో ఎవరూ లేరని ఆరోపించారు.

 కాగా..  ఇటీవ‌ల జ‌రిగిన లోక్‌స‌భ‌ ఎన్నికల్లో యూపీలో 80 సీట్లకు గాను బీజేపీ 33 మాత్రమే గెలుచుకున్న సంగతి తెలిసిందే. దీనికితోడు కేశవ్‌ పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో దిల్లీలో ఒంటరిగా భేటీ కావడంతో చర్చనీయాంశంగా మారింది. దీంతో పార్టీ అధినాయకత్వం రాష్ట్ర శాఖలో సమూల మార్పులకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అందుకే యూపీకి చెందిన ముఖ్య నేతలను ఒక్కొక్కర్నీ ఢిల్లీకి పిలిచి పార్టీ పెద్దలు మాట్లాడుతున్నట్లు సమాచారం.

ఇక లోక్‌స‌భ‌ ఎన్నికల్లో మెరుగైన సీట్లు రాకపోవడానికి అగ్నిపథ్‌ స్కీమ్‌, పేపర్‌ లీక్స్‌, రాజ్‌పుత్‌లలో అసంతృప్తి వంటి పది కారణాలను పార్టీ గుర్తించింది. యూపీలో లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఆశించిన ఫలితాలు రాబట్టలేకపోవడానికి దారితీసిన పలు అంశాలను 15 పేజీల నివేదికలో రాష్ట్ర పార్టీ చీఫ్‌ భూపేంద్ర చౌధరి వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement