15– 20 గంటల కరెంట్‌ నిరూపిస్తే రాజీనామా |  Komatireddy Venkat Reddy Challenge To CM KCR | Sakshi
Sakshi News home page

15– 20 గంటల కరెంట్‌ నిరూపిస్తే రాజీనామా

Sep 9 2023 5:11 AM | Updated on Sep 9 2023 5:11 AM

 Komatireddy Venkat Reddy Challenge To CM KCR - Sakshi

 మాట్లాడుతున్న ఎంపీ కోమటిరెడ్డి  

ప్రశాంత్‌నగర్‌ (సిద్దిపేట): రాష్ట్రమంతటా విద్యుత్‌ కోతలు ఉన్నాయని, ఎక్కడైనా 15–20 గంటల నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేస్తున్నట్లు నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సవాల్‌ చేశారు. విద్యుత్‌ కోతలపై వివరాలు తెలుసుకునేందుకు తాము భువనగిరి పరిధిలోని ఓ సబ్‌స్టేషన్‌లో లాగ్‌బుక్‌ను తీసుకుంటే, ప్రభుత్వం వెంటనే రాష్ట్రంలో ఉన్న అన్ని సబ్‌స్టేషన్లలోని లాగ్‌ బుక్‌లను తీసేసుకుందని విమర్శించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ డబ్బులను నమ్ముకున్నారని, తాము మాత్రం ప్రజలను నమ్ముకున్నామని చెప్పారు.

శుక్రవారం సిద్దిపేటలో ఆయన విలేకరులతో మాట్లాడారు. గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేట నియోజకవర్గాలలో రహదారులు మాత్రమే అభివృద్ధి చెందాయని, ప్రజలు మాత్రం అభివృద్ధి చెందలేదని కోమటిరెడ్డి విమర్శించారు. బంగారు తెలంగాణ పేరుతో రాష్ట్రాన్ని బతకలేని తెలంగాణగా మార్చారన్నారు. ఎన్నికల కోసం దళితబంధు, బీసీ బంధులను ప్రకటిస్తూ సొంత పారీ్టకి చెందిన వారి కుటుంబసభ్యులకే లబ్ధి చేకూరుస్తున్నారని, ఈ బంధులతో కేసీఆర్‌ దుకాణం బంద్‌ అవుతుందని చెప్పారు. హోంగార్డు రవీందర్‌ మృతి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని ఆరోపించారు.  

కాంగ్రెస్‌లో అసంతృప్తి లేదు 
కాంగ్రెస్‌లో ఎలాంటి అసంతృప్తి లేదని కోమటిరెడ్డి అన్నారు. పదవులు తనకు కొత్తకాదని వ్యాఖ్యానించారు. 17న కొంగరకలాన్‌లో జరిగే కాంగ్రెస్‌ సభలో కర్ణాటక తరహాలో ఐదు గ్యారంటీ పథకాలను సోనియాగాంధీ ప్రకటించనున్నట్లు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement