● నగరంలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ● జూడో క్రీడ కేటాయింపు ● జాతీయ క్రీడాపటంలో మరో మైలురాయి
కరీంనగర్స్పోర్ట్స్: జిల్లా క్రీడాకారుల ప్రతిభకు నిలయంగా ఉన్న కరీంనగర్ ప్రస్తుతం దేశ నలుమూలల నుంచి వచ్చే యువ క్రీడాకారులకు వేదిక కానుంది. ప్రతిష్టాత్మక 8వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్– 2026లో భాగంగా జూడో క్రీడను కరీంనగర్కు కేటాయించడంతో జిల్లా కీర్తి జాతీయ స్థాయికి చేరింది. జాతీయ, రాష్ట్రస్థాయి పోటీల నిర్వహణలో సత్తా చాటిన కరీంనగర్.. ఇప్పుడు ఖేలో ఇండియా క్రీడా సంబరానికి ఆతిథ్యమివ్వడం ద్వారా క్రీడా చరిత్రలో మరో అధ్యాయాన్ని లిఖించనుంది.
దేశం దృష్టి కరీంనగర్పై..
ఖేలో ఇండియా యూత్ గేమ్స్ జూడో క్రీడను కరీంనగర్కు కేటాయించడం జిల్లాకు దక్కిన అరుదైన గౌరవం. ప్రాంతీయ క్రీడా పాఠశాలలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన వసతులు, అత్యుత్తమ సౌకర్యాలు, గతంలో మానేరు విద్యాసంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ, 20కిపైగా రాష్ట్రస్థాయి పోటీలు, కరీంనగర్లో ఉన్న ఖేలో ఇండియా జూడో సెంటర్.. ఈ విజయానికి బలమైన కారణాలుగా నిలిచాయి. ఇక దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి ప్రతిభావంతులైన యువ క్రీడాకారులు కరీంనగర్ గడ్డపై తలపడనుండటంతో జిల్లాకు జాతీయ క్రీడా పటంలో మరింత బలంగా ముద్రపడనుంది.


