కానిస్టేబుల్కు బ్రాంజ్ మెడల్
విజయనగరం క్రైమ్ : జాతీయ స్థాయి తైక్వాండో చాంపియన్ షిప్లో బ్రాంజ్ మెడల్ సాధించిన విజయనగరం ట్రాఫిక్ పోలీస్స్టేసన్ కానిస్టేబుల్ బీఎస్ఎన్ మూర్తిని ఎస్పీ దామోదర్ తన చాంబర్లో మంగళవారం అభినందించారు. వివరాల్లోకి వెళ్తే.. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో ఈ నెల 12 నుంచి 14 వరకు 14 జాతీయ స్థాయి సీనియర్ పూమ్సే తైక్వాండో చాంపియన్షిప్ పోటీలు జరిగాయి. ఇందులో మూర్తి జిల్లా పోలీసు విభాగం తరఫున పాల్గొన్నారు. మూర్తిని అభినందించిన ఎస్పీ భవిష్యత్లో మరింతగా ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ట్రాఫిక్ సీఐ సూరినాయుడు, ఎస్బీ సీఐ ఏవీ లీలారావు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
రాష్ట్ర స్థాయి జూడో పోటీల్లో జిల్లాకు పతకాలు
విజయనగరం: రాష్ట్ర స్థాయిలో జరిగిన క్యాడిట్, జూనియర్స్ జూడో పోటీల్లో జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించిన క్రీడాకారులు సత్తా చాటారు. ఈ నెల 19 నుంచి 21వ తేదీ వరకు కర్నూలు జిల్లాలో జరిగిన పోటీల్లో జిల్లా క్రీడాకారులు మొత్తంగా పది పతకాలు సాధించారు. మూడు రోజుల పాటు జరిగిన పోటీల్లో దుర్గ బంగారు పతకం దక్కించుకోగా... ప్రవల్లిక, ప్రణిత, యశస్విప్రియ, మహమ్మద్ మున్నా, హేమంత్, సిద్విక్, ప్రణీత్, తేజ వికాస్, నితీష్ కాంస్య పతకాలు చేజిక్కించుకున్నారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారి ఎస్.వెంకటేశ్వరరావు, జిల్లా కో ఆర్డినేటర్ రామకృష్ణ, కోచ్లు బంగారునాయుడు, ఆనంద్ తదితరులు అభినందించారు.
అటవీ ఉత్పత్తులకు అడ్వాన్స్ టెండర్లు
సీతంపేట: అటవీ ఉత్పత్తులకు అడ్వాన్స్ టెండర్లు నిర్వహించనున్నట్టు పాలకొండ సబ్కలెక్టర్, ఐటీడీఏ ఇన్చార్జ్ పీవో పవార్ స్వప్నిల్ ఒక ప్రకటనలో తెలిపారు. గిరిజన సహకార సంస్థతో సేకరించబడే కొండచీపుర్లు, పసుపుకొమ్ములు, కుంకుడు కాయలు, చింతపండు వంటి వాటికి అడ్వాన్స్ టెండర్లు నిర్వహిస్తామన్నారు. ప్రతీ పక్షం రోజులకొకమారు ఈ టెండర్లు ఉంటాయన్నారు. వ్యాపారులు ఈ టెండర్లలో పాల్గొనవచ్చన్నారు. టెండర్లు ఎప్పుడు నిర్వహిస్తామనేది ముందస్తుగా తెలియజేయనున్నామని తెలిపారు.
పుస్తెలతాడు చోరీ
సీతానగరం: మండలంలోని కొత్తవలస – వీరభధ్రాపురం గ్రామాల మధ్య మహిళ మెడలో ఉన్న పుస్తెలతాడును గుర్తు తెలియని వ్యక్తి తెంపుకుని పారిపోయిన వైనమిది. స్థానిక పోలీసులు అందించిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. మక్కువ మండలం శంబర గ్రామానికి చెందిన తీళ్ళ భూలక్ష్మి మంగళవారం సాయంత్రం శంబర నుంచి కొత్తవలస మీదుగా కాలినడన కన్నవారిల్లు అయిన వీరభధ్రపురం వెళ్తుంది. అదే సమయంలోమోటారు సైకిల్తో గుర్తు తెలియని వ్యక్తి వెనుక నుంచి వచ్చి తన మెడలో ఉన్న రెండు పుస్తెల తాడును తెంపుకుని వెళ్లిపోయాడు. ఈ మేరకు బాధితురాలు భూలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ ఎం.రాజేష్ తెలిపారు.
బస్తా దించుతూ..
బతుకు చాలించి...
పార్వతీపురం రూరల్: పశువుల దాణా ఆ కూలి పాలిట మృత్యుపాశమైంది. బస్తాలు దించే క్రమంలో లారీ పైనుంచి జారిపడి ఓ కార్మికుడు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. మంగళవారం ఉదయం మండలంలోని హిందూపురం కూడలి వద్ద ఈ విషాదం చోటుచేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాలు.. శ్రీకాకుళం నుంచి విశాఖ డెయిరీకి చెందిన పశువుల దాణా లోడ్తో వచ్చిన లారీ పార్వతీపురం చేరుకుంది. మండలంలోని గంగాపురం వైపు వెళ్తూ హిందూపురం కూడలి వద్ద బస్తాలు దించుతుండగా, లారీపై ఉన్న ఆమదాలవలసకు చెందిన తారకేశ్వరరావు (35) ప్రమాదవశాత్తు అదుపుతప్పి కింద పడ్డాడు. తలకు బలమైన గాయం కావడంతో ప్రాణాలు కోల్పోయాడు. రూరల్ ఎస్ఐ సంతోషి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు.
కానిస్టేబుల్కు బ్రాంజ్ మెడల్
కానిస్టేబుల్కు బ్రాంజ్ మెడల్


