పంచాయతీ ఉప ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్‌సీపీ విజయకేతనం | - | Sakshi
Sakshi News home page

పంచాయతీ ఉప ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్‌సీపీ విజయకేతనం

Aug 21 2023 2:10 AM | Updated on Aug 21 2023 12:54 PM

దాచరంలో విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్న ప్రజలు, వైఎస్సార్‌సీపీ శ్రేణులు - Sakshi

దాచరంలో విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్న ప్రజలు, వైఎస్సార్‌సీపీ శ్రేణులు

సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఉమ్మడి కృష్ణా జిల్లాలో పంచాయతీ ఉప ఎన్నికల ఫలితాల్లో అధికార వైఎస్సార్‌ సీపీ సత్తా చాటింది. ఎన్నికలు జరిగిన ఐదు సర్పంచ్‌ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు విజయం సాధించారు. వార్డు స్థానాల్లోనూ సైతం అత్యధికం వైఎస్సార్‌సీపీ మద్దతు దారులే గెలుపొందారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమానికి ఫుల్‌ మార్కులు వేస్తూ భారీ విజయాన్ని అందించారు. సార్వత్రిక ఎన్నికల నుంచి, ఇప్పటివరకు జరిగిన పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కార్పొరేషన్‌, మునిసిపాలిటీ ఎన్నికల్లో నమోదు చేసిన విజయాలే, జిల్లాలో జరిగిన పంచాయతీ ఉప ఎన్నికల్లో పునరావృతం అయ్యాయి. టీడీపీ, జనసేన పార్టీలు బలపరచిన అభ్యర్థులు ఐదు సర్పంచ్‌ స్థానాల్లో ఓటమి పాలయ్యారు. వార్డు ఎన్నికల్లో సైతం కొద్ది స్థానాలకే పరిమితం అయ్యారు.

► కృష్ణా జిల్లాలో రెండు సర్పంచ్‌, 31 వార్డులకు ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఇందులో ఒక సర్పంచ్‌ స్థానం కోకనారాయణ పాలెం సర్పంచ్‌గా ఇండి అంజలీదేవి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 21 వార్డులు సైతం ఏకగ్రీవం అయ్యాయి. బంటుమల్లి మండలం చిన్నతమ్ముడి, ఉంగుటూరులోని గారపాడుల్లో వార్డులకు ఎవరూ నామినేషన్లు వేయలేదు. దీంతో ఓ సర్పంచ్‌ స్థానంతో పాటు 8వార్డులకు ఎన్నికలు జరిగాయి. ఇందులో టీడీపీ ఏడు వార్డు స్థానాలు కై వసం చేసుకోగా, ఒక వార్డు స్థానంలో ఓ ఇండిపెండెంట్‌ అభ్యర్థి గెలుపొందారు.

► ఎన్టీఆర్‌ జిల్లాలో మొత్తం మూడు సర్పంచ్‌, 12 వార్డులకు నోటిఫికేషన్‌ ఇవ్వగా, ఇందులో ఓ సర్పంచ్‌ స్థానం జగ్గయ్యపేట మండలం మల్కాపురానికి సర్పంచ్‌గా వైఎస్సార్‌ సీపీ మద్దతుదారుడు అంబోజి పుల్లారావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో పాటు 9 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన రెండు సర్పంచ్‌ స్థానాలను వైఎస్సార్‌ సీపీ మద్దతుదారులు కై వసం చేసుకున్నారు. మూడు వార్డు స్థానాలోనూ విజయం సాధించారు.

జగన్‌ సంక్షేమ పాలనకు దన్నుగా..
తాజా పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు టీడీపీ మద్దతు దారులను ఓడించారు. సీఎం జగన్‌ సంక్షేమ పాలనకు ఓటేసిన ప్రజలు ఎన్నికలు ఏవైనా వైఎస్సార్‌ సీపీ ప్రజా మద్దతుకు తిరుగులేదని మరోసారి నిరూపించారు. పామర్రు నియోజక వర్గంలో ఎన్నికలు జరిగిన మూడు వార్డుల్లో వైఎస్సార్‌ సీపీ మద్దతు దారులు గెలుపొందారు. గెలిచిన వార్డు మెంబర్లకు ఎన్నికల్లో సహకరించిన నాయకులకు ప్రజలకు ఎమ్మెల్యే కై లే అనిల్‌కుమార్‌ అభినందనలు తెలిపారు. నందిగామ, పెడన, జగ్గయ్యపేట, తిరువూరు, పెనమలూరు నియోజకవర్గాల్లో గెలిచిన సర్పంచ్‌, వార్డు సభ్యులకు ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ మద్దతుదారులను ఆశీర్వదించినందుకు మంత్రి జోగి రమేష్‌, ప్రభుత్వ విప్‌ ఉదయభాను, ఎమ్మెల్యేలు పార్థసారథి మొండితోక జగన్‌మోహనరావు, రక్షణనిధి కృతజ్ఞతలు తెలిపారు.

సర్పంచ్‌ స్థానాలకు ఎన్నికై న అభ్యర్థులు వీరే..

జిల్లా నియోజకవర్గం మండలం పంచాయతీ గెలిచిన అభ్యర్థి పేరు మద్దతు పార్టీ మెజార్టీ ఓట్లు

కృష్ణా పెడన గూడూరు కోకనారాయణపాలెం బండి అంజలిదేవి వైఎస్సార్‌ సీపీ ఏకగ్రీవం

కృష్ణా పెడన పెడన కొంగంచర్ల లోయ ఊహ వైఎస్సార్‌ సీపీ 22

ఎన్టీఆర్‌ జగ్గయ్యపేట జగ్గయ్యపేట మల్కాపురం అంబోజి పుల్లారావు వైఎస్సార్‌ సీపీ ఏకగ్రీవం

ఎన్టీఆర్‌ జగ్గయ్యపేట వత్సవాయి పెదమోదుగపల్లి కల్యాణం విజయలక్ష్మి వైఎస్సార్‌ సీపీ 38

ఎన్టీఆర్‌ నందిగామ వీరులపాడు దాచవరం గద్దె వెంకటేశ్వర్లు వైఎస్సార్‌సీపీ 29

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement