ఖలీల్వాడి: హైదరాబాద్లోని ప్రభుత్వ పరీక్షల విభాగము సంచాలకుల ఆదేశాల మేరకు ఆగస్టులో టెక్నికల్ టీచర్స్ సర్టిఫికేట్ (లోయర్ గ్రేడ్) థియరీ పరీక్షలు నిర్వహించగా, పరీక్ష ఫలితాలను గురువారం విడుదల చేసినట్లు డీఈవో పార్శి అశోక్ ఒక ప్రకటనలో తెలిపా రు. పరీక్ష రాసిన అభ్యర్థుల ఫలితాలను www. bse. telangana. gov. in వెబ్సైట్లో ఉంచినట్లు ఆయన తెలిపారు. అభ్యర్థులు హాల్ టికెట్, పుట్టిన తేదీతో వెబ్ మెమోలను తీసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు డీఈవో కార్యాలయంలో సంప్రదించాలన్నారు.
ఖలీల్వాడి: నగరంలోని నిశిత డిగ్రీ కాలేజీ, టాస్క్ ఆధ్వర్యంలో ఈనెల 9న టీసీఎస్ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు డైరెక్టర్ రాజు ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం పదిగంటల నుంచి కార్యక్రమం కొనసాగుతుందన్నారు. పదవ తరగతి, ఇంటర్, డిప్లొమా, డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి, 50 శాతం మార్కులు వచ్చిన విద్యార్థులు ఆర్హులని ఆయన తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు జాబ్మేళాకు తరలిరావాలని కోరారు.
భిక్కనూరులో వృద్ధుడి ఆత్మహత్య
భిక్కనూరు: మండలకేంద్రంలో ఓ వృద్ధుడు ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై అనిల్ గురువారం తెలిపారు. వివరాలు ఇలా.. మండల కేంద్రానికి చెందిన నీల రాజయ్య(66) అనే వృద్ధుడు కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. గత ఏడాది ఆయన భార్య మృతి చెందింది. బుధవారం రాత్రి అతడు మద్యం తాగి ఇంటికి వెళ్లగా కుమారుడు మందలించాడు. దీంతో మనస్తాపం చెందిన అతడు గురువారం వేకువజామున ఇంటి నుంచి వెళ్లిపోయాడు. కుటుంబసభ్యులు ఎంత వెతికినా అతడి ఆచూకీ లభించలేదు. బొబ్బిలి చెరువులో సాయంత్రం ఓ వ్యక్తి మృతదేహం తేలడంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహన్ని ఒడ్డుకు తీసుకవచ్చి, విచారించగా, మృతుడిని నీల రాజయ్యగా గుర్తించి, కుటుంబీకుల సమాచారం అందించారు. వారి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై వివరించారు.


