నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మండలకేంద్రం గోపాల్పేటలో గత నెల 31న వృద్ధులతో మాయమాటలు చెప్పి, దోపిడీకి పాల్పడిన నిందితులను పట్టుకున్నట్లు నాగిరెడ్డిపేట పోలీసులు తెలిపారు. వివరాలు ఇలా.. మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలం పోచమ్మరాల్ తండాకు చెందిన మూడ్ కేస్లీ, సక్రియ దంపతులు ఆగస్టు 31న గోపాల్పేటలోని ఓ హాస్పిటల్ వద్దకు వచ్చారు. అదే సమయంలో ముగ్గురు వ్యక్తులు వారి వద్దకు వచ్చి మాయమాటలు చెప్పి, వారిని బెదిరించి వారి నుంచి వెండిగొలుసు, నగదును అపహరించుకొని అక్కడి నుంచి స్కూటీపై మెదక్ వైపు పారిపోయారు. బాధితులు వెంటనే నాగిరెడ్డిపేట పోలీసులను ఆశ్రయించగా వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. నహవేలీ ఘనపూర్ మండలం బూర్గుపల్లికి చెందిన శివాజీ చవాన్, అతని బంధువులైన మహారాష్ట్రలోని పర్భాణి జిల్లా శివాజీనగర్ తండాకు చెందిన ధర్మశంకర్ చవాన్, కౌటంవాడికి చెందిన రమేష్ చంద్రసింగ్ను నిందితులుగా గుర్తించారు. గురువారం వారిని పట్టుకొని, వారి నుంచి 12తులాల వెండిగొలుసుతోపాటు రూ.15వేల నగదును, స్కూటీని, మూడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులను మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. కాగా ఘటన జరిగిన 36 గంటల్లోనే కేసును చేధించినట్లు వివరించారు.


