● కల్లెడి, చిన్నాపూర్ అటవీ ప్రాంతాల్లో కదలికలు
మాక్లూర్: మండలంలోని గాలిబ్నగర్ నుంచి కల్లెడి వెళ్లే రహదారి పక్కన అటవీ ప్రాంతంలో గుత్ప నీటి ఎత్తిపోతల పథకం వద్ద గత నెల 31వ తేదీన స్థానికులకు రెండు చిరుతలు కనిపించాయి. ఓ వాహనదారుడు చిరుత కదలికలను తన సెల్ఫోన్లో బంధించాడు. వీడియో వైరల్ కావడంతో రైతులు, పశువుల, గొర్రెల కాపరులు భయాందోళనకు గురవుతున్నారు. దీంతో ఫారెస్ట్ అధికారులు స్పందించి మంగళవారం కల్లెడిలో సర్పంచ్ గంగ్గోల్ల సుస్మిత ప్రళయ్తేజ్ అధ్యక్షతన వన్యప్రాణులపై ఆవగాహన సదస్సు నిర్వహించారు. చిన్నాపూర్, కల్లెడి, అడవి మామిడిపల్లి, గుత్ప శివారుల వ్యాప్తంగా విస్తరించి ఉన్న అడవిలో చిరుత పులులు తరుచుగా కన్పిస్తున్నాయని ఫారెస్ట్ రేంజ్ అధికారి అరుణ్కుమార్, డిప్యూటీ రేంజ్ అధికారి ఎస్ అశోక్కుమార్ తెలిపారు. సుమారు ఏడు నుంచి ఎనిమిది చిరుతలు అటవీ ప్రాంతంలో సంచరిస్తున్నాయన్నారు. అనుకోకుండా కనిపించిన చిరుతలను రాళ్లతో కొట్టి తరమవద్దని, వెంటనే తమకు సమాచారం అందించాలని కోరారు. అటవీ ప్రాంతంలోని పంట పొలాల్లోకి రైతులు ఒంటరిగా వెళ్లొద్దని సూచించారు. చిరుతల నుంచి రక్షణ కోసం త్వరలో తగిన చర్యలు తీసుకుంటామన్నారు.


