కమ్మర్పల్లి: కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ ద్వారా బీడీ కార్మికుల పిల్లలకు అందిస్తున్న ఉపకార వేతనాల దరఖాస్తు గడువును పొడిగించినట్లు బీడీ కార్మికుల సంక్షేమ శాఖ భీమ్గల్ డివిజన్ అధికారి గంగాధర్ ఒక ప్రకటనలో తెలిపారు. 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు ప్రీమెట్రిక్ ఉపకార వేతనాలకు సెప్టెంబర్ 30లోగా, ఇంటర్, డిగ్రీ విద్యార్థులు పోస్ట్మెట్రిక్ ఉపకార వేతనాలకు అక్టోబర్ 31 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. బీడీ కార్మిక కుటుంబాల వార్షిక ఆదాయ పరిమితిని రూ.2.52లక్షలుగా నిర్ణయించినట్లు పేర్కొన్నారు. అర్హులైన విద్యార్థులు నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
బోధన్టౌన్(బోధన్): పట్టణంలోని స్కానింగ్ సెంటర్లను డీఎంహెచ్వో రాజశ్రీ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భ్రూణ లింగ నిర్ధారణ, లింగ ఎంపికకు సంబంధించిన కార్యకలాపాలు చట్టవిరుద్ధమని, ప్రతీ స్కానింగ్ కేంద్రంలో పీసీపీ ఎన్డీటీ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఉప వైద్యాధికారి విద్య, సిబ్బంది తదిత రులు పాల్గొన్నారు.
పెర్కిట్(ఆర్మూర్): ఆర్మూర్ మండలం అంకా పూర్ గ్రామాన్ని నైజీరియా దేశం ఓగున్ రాష్ట్రం అభికుచ్ అనే గ్రామానికి చెందిన మైకేల్, బిసో ల అనే రైతులు గురువారం సందర్శించారు. నైజీరియాలో వ్యవసాయం చేస్తున్న మైకేల్, బిసోల అధిక దిగుబడులను సాధించడానికి అంకాపూర్ను సందర్శించారు. ఈసందర్భంగా వారు అంకాపూర్లో సాగవుతున్న పసుపు పంట, విత్తన శుద్ధి ప్లాంట్లను పరిశీలించారు. అనంతరం అంకాపూర్ సర్పంచ్ అంక్సాపురం దేవేందర్ రెడ్డితో సమావేశమై పసుపు పంటలో అధిక దిగుబడులు సాధించడానికి తీసుకోవాల్సిన సస్యరక్షణ చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. తిరుపతిరెడ్డి, కేకే భాజన్న, శేష సాయి తదితరులు పాల్గొన్నారు.
తెయూ(డిచ్పల్లి): రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్ సీహెచ్ పార్థసారథి గురువారం డిచ్పల్లి మండలంలోని తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీస్ ఏడవ బెటాలియన్ను సందర్శించారు. గతంలో తెయూ వైస్చాన్స్లర్గా పార్థసారధి సేవలందించారు. ఈసందర్భంగా ఆయనను తెయూ రిజిస్ట్రార్ యాదగిరి మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. వర్సిటీ అభివృద్ధిపై రిజిస్ట్రార్తో ఆయన చర్చించారు. వర్సిటీ అభివృద్ధికి భవిష్యత్తులో తనవంతు పాత్ర ఉంటుందని హామీ ఇచ్చారు.


