ర్యాపిడ్‌ రైలు కారిడార్‌పై వర్క్‌ స్పేస్‌.. ప్రయోజనమిదే.. | Work Spaces Built on Rapid Rail Corridor | Sakshi
Sakshi News home page

ర్యాపిడ్‌ రైలు కారిడార్‌పై వర్క్‌ స్పేస్‌.. ప్రయోజనమిదే..

Mar 16 2025 12:29 PM | Updated on Mar 16 2025 12:45 PM

Work Spaces Built on Rapid Rail Corridor

న్యూఢిల్లీ: నమో భారత్ ద్వారా ప్రయాణికులకు మెరుగైన కనెక్టివిటీని, సౌకర్యాలను అందించేందుకు నేషనల్‌ క్యాపిటల్‌ రీజియన్‌ ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్‌(ఎన్‌సీఆర్టీసీ)(National Capital Region Transport Corporation) ముమ్మర ప్రయత్నాలు సాగిస్తోంది. ఇప్పుడు ఈ దిశగా మరో ముందడుగు వేస్తూ ఎన్‌సీఆర్టీసీ ఘజియాబాద్ నమో భారత్ స్టేషన్‌లో కో-వర్కింగ్ స్పేస్ ‘మెట్రో డెస్క్’ను ప్రారంభించాలని యోచిస్తోంది. ఈ అత్యాధునిక కార్యస్థలం ఘజియాబాద్‌తో పాటు చుట్టుపక్కల ఉన్న నిపుణులు, వ్యవస్థాపకులు చిన్న వ్యాపారులకు ఉపయుక్తమవుతుంది.

ఈ కో-వర్కింగ్ స్పేస్‌(Co-working space)లో 42 ఓపెన్ వర్క్‌స్టేషన్‌లు, 11 ప్రైవేట్ క్యాబిన్‌లు, రెండు సమావేశ గదులు ఉంటాయి. ఒకేసారి 42 మంది కూర్చొనేందుకు అవకాశం ఉంటుంది. అలాగే 11 కంపెనీలకు ఆఫీసు వసతి  అందనుంది. ఘజియాబాద్ .. మీరట్ మార్గంలో ఉన్న ప్రముఖ స్టేషన్. ఢిల్లీ మెట్రోకు ఇక్కడి నుంచి కనెక్టివిటీ ఉంది. పెద్ద సంఖ్యలో ప్రయాణీకులు ఘజియాబాద్‌కు వస్తుంటారు. ఈ కో-వర్కింగ్ స్పేస్‌ను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తీర్చిదిద్దనున్నారు. బయోమెట్రిక్ ఎంట్రీ, డిజిటల్ కీ కార్డుల ద్వారా స్మార్ట్ యాక్సెస్ కల్పించనున్నారు.

ఈ కార్యాలయాల్లో వీడియో కాన్ఫరెన్సింగ్ సెటప్, వైర్‌లెస్ స్క్రీన్ షేరింగ్, అధునాతన చర్చా వేదికలు కూడా అందుబాటులో ఉండనున్నాయి. దీనితో పాటు, హాట్ డెస్క్‌లు, వెండింగ్ మెషీన్‌లు, ఫీడ్‌బ్యాక్ సేకరణ కోసం క్యూఆర్‌-ఆధారిత స్కాన్-అండ్-యూజ్ ఎంపికలు కూడా అందుబాటులో ఉండనున్నాయి. సాంప్రదాయ కార్యాలయాలతో పోలిస్తే కో-వర్కింగ్ స్పేస్‌లు  మంచి ఎంపిక అని నిపుణులు చెబుతుంటారు. ఖరీదైన వాణిజ్య స్థలాలను అద్దెకు తీసుకునే బదులు ప్రొఫెషనల్ వాతావరణంలో పని చేయడానికి ఇవి వీలు కల్పిస్తాయని చెబుతుంటారు. 

ఇది  కూడా చదవండి: లీలావతి ఎవరు? ఆమె పేరుతో ఉన్న ఆస్పత్రి ఎందుకు చిక్కుల్లో పడింది?
 

Advertisement
 
Advertisement
Advertisement