మహిళా సాధికారతకు... 11 ఏళ్లుగా కృషి: మోదీ | Women empowerment is a hallmark of Modi government | Sakshi
Sakshi News home page

మహిళా సాధికారతకు... 11 ఏళ్లుగా కృషి: మోదీ

Jun 9 2025 5:12 AM | Updated on Jun 9 2025 5:41 AM

Women empowerment is a hallmark of Modi government

ప్రభుత్వ అండతో వారి కలలు సాకారం: మోదీ

న్యూఢిల్లీ: దేశంలో మహిళల అభివృద్ధి, సాధికారతకు తమ ప్రభుత్వం 11 ఏళ్లుగా అవిశ్రాంతంగా కృషి చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ‘మహిళల నేతృత్వంలో అభివృద్ధి’కి ప్రభుత్వం కొత్త నిర్వచనం ఇచ్చిందన్నారు. సైన్స్, విద్య, క్రీడలు, స్టార్టప్స్, సైనిక దళాలు సహా అన్ని రంగాల్లో నారీమణులు అద్భుతాలు సృష్టిస్తున్నారని, ఇతరులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారని ప్రశంసించారు.

 ఈ మేరకు ఆదివారం ‘ఎక్స్‌’లో ఆయన పోస్టు చేశారు. మహిళల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలను ప్రస్తావించారు. వాటితో నారీమణులు ఎంతో ప్రయోజనం పొందుతున్నారని హర్షం వ్యక్తం చేశారు. స్వచ్ఛభారత్, జన్‌ధన్‌ యోజన వంటి కార్యక్రమాలతో మన అడపడుచుల గౌరవం పెంచామని తెలిపారు. 

పేద గృహిణులకు ఉజ్వల యోజన కింద 10 కోట్లకు పైగా వంట గ్యాస్‌ కనెక్షన్లు ఇచ్చామని, మహిళా వ్యాపారవేత్తలకు ముద్రా రుణాలు అందజేశామని గుర్తుచేశారు. పీఎం ఆవాస్‌ యోజన కింద మహిళల పేరిటే ఇళ్లు ఇస్తున్నామని ఉద్ఘాటించారు. మహిళా సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పని చేస్తోందన్నారు. ప్రభుత్వ అండతో సోదరీమణులు వారి కలలు సాకారం చేసుకుంటున్నారని, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్నారని వెల్లడించారు. వికసిత్‌ భారత్‌ నిర్మాణంలో వారు చురుగ్గా పాల్గొంటున్నారని కొనియాడారు. 

గర్భిణుల ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యం 
ఆడ శిశువులను కాపాడుకోవాలన్న లక్ష్యంతో తీసుకొచ్చిన ‘బేటీ బచావో, బేటీ పడావో’ కార్యక్రమంతో అద్భుత ఫలితాలు వస్తున్నాయని, ఇదొక ఉద్యమంగా మారిందని మోదీ వివరించారు. గర్భిణుల ఆరోగ్య సంరక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. 

2011–13లో ప్రతి లక్ష మందిలో 167 మంది గర్భిణులు ప్రసవాల సమయంలో మరణించేవారని, 2019–21 నాటికి అది 93కు తగ్గిందని పేర్కొన్నారు. 2019లో దేశంలో మంచినీటి కనెక్షన్‌ ఉన్న ఇళ్లు 3.23 కోట్లు కాగా 2025 మే నాటికి 15.64 కోట్లకు పెరిగాయన్నారు. సమాజంలో అన్ని వర్గాల మహిళల సంపూర్ణ అభివృద్ధే తమ ధ్యేయమని ప్రధాని స్పష్టం చేశారు.

మోదీ పాలనకు నేటితో పదకొండేళ్లు  
ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ సోమవారం 11 ఏళ్లు పూర్తి చేసుకోబోతున్నారు. ప్రధానిగా మూడో టర్ములో ఆయన పదవీ కాలానికి సోమవారంతో ఏడాది పూర్తవనుంది. 2024 జూన్‌ 9న మోదీ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన నేతృత్వంలో కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం వరుసగా మూడోసారి అధికారంలోకి రావడం తెలిసిందే. 

తొలి రెండు దఫాలకు భిన్నంగా మూడోసారి బీజేపీ సంపూర్ణ మెజార్టీకి కాస్త దూరంలోనే ఆగిపోయింది. దాంతో జేడీ(యూ), టీడీపీ తదితర పారీ్టల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేశారు. మూడో టర్మ్‌లో తొలి వార్షికోత్సవ వేడుకలకు బీజేపీ శ్రేణులు సిద్ధమయ్యాయి. తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ 16 ఏళ్ల 286 రోజుల పాటు పదవిలో కొనసాగారు. ఇందిరా గాంధీ 11 ఏళ్ల 59 రోజులతో రెండో స్థానంలో ఉన్నారు. మరో రెండు నెలల్లో ఆమె రికార్డును మోదీ అధిగమించనున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement