breaking news
Restless struggle
-
మహిళా సాధికారతకు... 11 ఏళ్లుగా కృషి: మోదీ
న్యూఢిల్లీ: దేశంలో మహిళల అభివృద్ధి, సాధికారతకు తమ ప్రభుత్వం 11 ఏళ్లుగా అవిశ్రాంతంగా కృషి చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ‘మహిళల నేతృత్వంలో అభివృద్ధి’కి ప్రభుత్వం కొత్త నిర్వచనం ఇచ్చిందన్నారు. సైన్స్, విద్య, క్రీడలు, స్టార్టప్స్, సైనిక దళాలు సహా అన్ని రంగాల్లో నారీమణులు అద్భుతాలు సృష్టిస్తున్నారని, ఇతరులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారని ప్రశంసించారు. ఈ మేరకు ఆదివారం ‘ఎక్స్’లో ఆయన పోస్టు చేశారు. మహిళల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలను ప్రస్తావించారు. వాటితో నారీమణులు ఎంతో ప్రయోజనం పొందుతున్నారని హర్షం వ్యక్తం చేశారు. స్వచ్ఛభారత్, జన్ధన్ యోజన వంటి కార్యక్రమాలతో మన అడపడుచుల గౌరవం పెంచామని తెలిపారు. పేద గృహిణులకు ఉజ్వల యోజన కింద 10 కోట్లకు పైగా వంట గ్యాస్ కనెక్షన్లు ఇచ్చామని, మహిళా వ్యాపారవేత్తలకు ముద్రా రుణాలు అందజేశామని గుర్తుచేశారు. పీఎం ఆవాస్ యోజన కింద మహిళల పేరిటే ఇళ్లు ఇస్తున్నామని ఉద్ఘాటించారు. మహిళా సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పని చేస్తోందన్నారు. ప్రభుత్వ అండతో సోదరీమణులు వారి కలలు సాకారం చేసుకుంటున్నారని, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్నారని వెల్లడించారు. వికసిత్ భారత్ నిర్మాణంలో వారు చురుగ్గా పాల్గొంటున్నారని కొనియాడారు. గర్భిణుల ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యం ఆడ శిశువులను కాపాడుకోవాలన్న లక్ష్యంతో తీసుకొచ్చిన ‘బేటీ బచావో, బేటీ పడావో’ కార్యక్రమంతో అద్భుత ఫలితాలు వస్తున్నాయని, ఇదొక ఉద్యమంగా మారిందని మోదీ వివరించారు. గర్భిణుల ఆరోగ్య సంరక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. 2011–13లో ప్రతి లక్ష మందిలో 167 మంది గర్భిణులు ప్రసవాల సమయంలో మరణించేవారని, 2019–21 నాటికి అది 93కు తగ్గిందని పేర్కొన్నారు. 2019లో దేశంలో మంచినీటి కనెక్షన్ ఉన్న ఇళ్లు 3.23 కోట్లు కాగా 2025 మే నాటికి 15.64 కోట్లకు పెరిగాయన్నారు. సమాజంలో అన్ని వర్గాల మహిళల సంపూర్ణ అభివృద్ధే తమ ధ్యేయమని ప్రధాని స్పష్టం చేశారు.మోదీ పాలనకు నేటితో పదకొండేళ్లు ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ సోమవారం 11 ఏళ్లు పూర్తి చేసుకోబోతున్నారు. ప్రధానిగా మూడో టర్ములో ఆయన పదవీ కాలానికి సోమవారంతో ఏడాది పూర్తవనుంది. 2024 జూన్ 9న మోదీ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన నేతృత్వంలో కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం వరుసగా మూడోసారి అధికారంలోకి రావడం తెలిసిందే. తొలి రెండు దఫాలకు భిన్నంగా మూడోసారి బీజేపీ సంపూర్ణ మెజార్టీకి కాస్త దూరంలోనే ఆగిపోయింది. దాంతో జేడీ(యూ), టీడీపీ తదితర పారీ్టల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేశారు. మూడో టర్మ్లో తొలి వార్షికోత్సవ వేడుకలకు బీజేపీ శ్రేణులు సిద్ధమయ్యాయి. తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ 16 ఏళ్ల 286 రోజుల పాటు పదవిలో కొనసాగారు. ఇందిరా గాంధీ 11 ఏళ్ల 59 రోజులతో రెండో స్థానంలో ఉన్నారు. మరో రెండు నెలల్లో ఆమె రికార్డును మోదీ అధిగమించనున్నారు. -
అంబులెన్స్ వచ్చేలోగా కారులో బయల్దేరిన సోనియా
షిమ్లా : యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ అస్వస్థతకు లోనయ్యారు. ఉన్నపలంగా ఆమె షిమ్లా నుంచి ఢిల్లీకి వచ్చారు. సోనియాకు ఒంట్లో కొంత వ్యాకులతగా అనిపించడంతో అంబులెన్స్ రావడానికంటే ముందే తన సొంతకారులో బయల్దేరారు. షిమ్లాలోని చరబ్రాలో సోనియాగాంధీ నివాసం నిర్మాణం జరుగుతున్న విషయం తెలిసిందే. ఆ పనులు పర్యవేక్షించేందుకు సోనియా అక్కడికి వెళ్లారు. ఆ సమయంలో ఆమెతో కూతురు ప్రియాంక గాంధీ కూడా ఉన్నారు. అయితే, ఇందిరా గాంధీ మెడికల్ కాలేజీ (ఐజీఎంసీ) సీనియర్ మెడికల్ సూపరిండెంట్ డాక్టర్ రమేశ్ చంద్ తెలిపిన ప్రకారం సోనియాకు కొంత నీరసంగా ఉందని, ఆమె వెంటనే ఢిల్లీ బయలుదేరి రావాల్సిన అవసరం ఉందని, అందుకోసం అంబులెన్స్ పంపించాలని ఆమె పక్కన ఉన్న వైద్యుడు ఫోన్ చేశారు. అయితే, కొందరు వైద్యుల బృందంతో కూడిన అంబులెన్స్ వచ్చేలోగానే ఆమె కారులో బయలుదేరారు. దీంతో ఆమెకోసం వచ్చిన అంబులెన్స్ కూడా కారు వెనుకే వెళ్లింది. కాగా, మార్గం మధ్యలో ఆమె ఓసారి పంచకులలో ఆగినట్లు డాక్టర్ చంద్ వెల్లడించారు. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని ఆయన చెప్పారు. -
టీచర్ల సమస్యలపై రాజీలేని పోరాటం
అభినందనసభలో ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి అనంతపురం ఎడ్యుకేషన్: టీచర్ల, అధ్యాపకుల సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తానని పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి అన్నారు. స్థానిక రాయల్ ఫంక్షన్ హాలులో ఆదివారం ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు గోవిందు అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఆత్మీయ అభినందన సభలో కత్తి నరసింహారెడ్డిని సన్మానించారు. వక్తలు మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి ని బద్ధతతో పనిచేస్తే ఆదరిస్తారనేందుకు కత్తి నరసింహారెడ్డి విజయమే నిదర్శనమన్నారు. నరసింహారెడ్డి మాట్లాడుతూ సామాన్య టీచరు, కార్పొరేట్ శక్తుల మధ్య జరిగిన ఎన్నికల్లో చివరకు సామాన్య టీచరువైపే తీర్పు ఇచ్చారన్నారు. తనను ఓడించేందుకు కొందరు కుట్రపన్ని చివరకు తనపేరు ఉన్న వ్యక్తిని వెతికి తీసుకొచ్చి డబ్బులిచ్చి డమ్మీగా నిలబెట్టారన్నారు. ఓటర్లలో గందరగోళం సృష్టించాలని చూశారన్నారు. మే«థావులైన టీచర్లు, అధ్యాపకులు ఇలాంటి కుయక్తులను తిప్పి కొట్టారన్నారు. 28 ఏళ్ల పాటు ఉద్యమానికి ఎంతో నీతి నిజాయితీగా పని చేశానని, అంతే నీతి నిజాయితీగా భవిష్యత్తులోనూ పని చేస్తానన్నారు. తనకు మద్ధతిచ్చిన అన్ని సంఘాల నాయకులు, టీచర్లు, అధ్యాపకులకు ధన్యవాదాలు తెలిపారు. సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్, ఎస్టీయూ రాష్ట్ర ప్రధానకార్యదర్శి సుధీర్బాబు, ఏపీటీఎఫ్ (1938) రాష్ట్ర అధ్యక్షుడు హృదయరాజు, ఆర్యూపీపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి రవిచంద్ర, స్కూల్ అసిస్టెంట్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్యారుఖాన్, యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి జిలాన్, వివిధ సంఘాల జిల్లా నేతలు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు పాల్గొన్నారు.