
పట్నా: బీహార్లోని పట్నాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. శ్రీకృష్ణ పురి ప్రాంతం సమీపంలోని అటల్ పాత్పై బుధవారం అర్థరాత్రి దాటాక ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన స్కార్పియో వాహనం గస్తీలో ఉన్న పోలీసులను ఢీకొంది. ఈ ఘటనలో ముగ్గురు కానిస్టేబుళ్లు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలోని ఒక మహిళా కానిస్టేబుల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. మరో ఇద్దరికి ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది.
శ్రీకృష్ణ పురి పోలీస్ స్టేషన్ సిబ్బంది అటల్ పాత్ వెంట వెళుతున్న సాధారణ వాహనాలను తనిఖీలు చేస్తుండగా ఈ సంఘటన జరిగింది. సబ్-ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ సబ్-ఇన్స్పెక్టర్, ఒక మహిళా కానిస్టేబుల్తో కూడిన బృందం ఒక కారును తనిఖీ చేస్తుండగా, వెనుక నుంచి అధిక వేగంతో వచ్చిన స్కార్పియో వాహనం.. పోలీసులు తనిఖీ చేస్తున్న వాహనాన్ని ఢీకొంది. ఫలితంగా ముగ్గురు పోలీసు సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి.
పట్నా సీనియర్ పోలీస్ సూపరింటెండెంట్ అవకాష్ కుమార్ తెలిపిన ప్రకారం గాయపడిన సిబ్బందిని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మహిళా కానిస్టేబుల్ మృతిచెందగా, మిగిలిన ఇద్దరి పరిస్థితి స్థిరంగా ఉందన్నారు. ఘటన జరిగిన వెంటనే స్కార్పియో డ్రైవర్ పరారయ్యాడు. వాహనంలో ఉన్న ఇద్దరు ప్రయాణికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న డ్రైవర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఇది కూడా చదవండి: హనీమూన్ కేసు: సోనమ్ తన మంగళ సూత్రాన్ని తీసేసి..