
న్యూఢిల్లీ: మేఘాలయలో చోటుచేసుకున్న హనీమూన్ హత్య కేసు విచారణలో విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. రఘువంశీ, సోనమ్లు బస చేసిన హోమ్స్టే గదిలో పోలీసులకు దొరికిన వస్తువులు కేసు దర్యాప్తులో పురోగతికి దోహదపడ్డాయి. సోనమ్ స్టేహోమ్ నుంచి బయటకు వెళ్లేటప్పుడు తన మంగళ సూత్రాన్ని అక్కడే వదిలివెళ్లింది. అలాగే ఒక ఉంగరం కూడా అక్కడ దొరికిందని డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ డీఎన్ఆర్ మారక్ మీడియాకు తెలిపారు.
అనుమానాలు రేకెత్తించిన మంగళసూత్రం
రఘువంశీ, సోనమ్లు బసచేసిన హోమ్స్టే గదిలో లభ్యమైన ఒక సూట్కేసులో సోనమ్ మంగళసూత్రాన్ని, ఒక ఉంగరాన్ని కనుగొన్నామని, ఇది తమకు సందేహాన్ని కలిగించిందని, ఒక మహిళ తన హనీమూన్ సమయంలో మంగళసూత్రాన్ని ఎందుకు వదిలి వెళుతుందనే ప్రశ్న తమలో మెదిలిందని మారక్ అన్నారు. సోనమ్ భర్త రాజా రఘువంశీని ఆమెతో పాటు ముగ్గురు కాంట్రాక్ట్ కిల్లర్లు హత్య చేశారని మారక్ తెలిపారు. మరో నిందితుడు ఇండోర్ నివాసి అయిన రాజ్ కుష్వాహా అని తెలిపారు. అతను సోనమ్ ప్రేమికుడని అన్నారు. నిందితులు విచారణలో తమ నేరాన్ని అంగీకరించారని పోలీసు అధికారి తెలిపారు.
ఫోటోలు తీసుకునే నెపంతో..
మే 23న కాంట్రాక్ట్ కిల్లర్లు నోంగ్రియాట్ గ్రామంలోని మరో హోమ్స్టేలో కాపుగాచారు. అదే సమయంలో సోనమ్ ఫోటోలు తీసుకునే నెపంతో రాజాను హోమ్ స్టే నుండి బయటకు తీసుకెళ్లింది. అక్కడ వారు స్కూటీని ఒక నిర్జన ప్రదేశంలో నిలిపివేశారు. ఆమె ఫోటోలు తీస్తున్నట్లు నటిస్తూ, కొంచెం ముందుకు నడిచింది. ఇంతలో కాంట్రాక్ట్ హంతకులు వెనుక నుండి వచ్చి రాజాను అంతమొందించారని పోలీసు అధికారి మారక్ మీడియాకు తెలిపారు. హంతకులు రెండు స్కూటీలను వినియోగించారని కూడా చెప్పారు. ఘటన తరువాత సోనమ్ ఒక నిందితుని స్కూటీపై కూర్చుని వెళ్లిందని, మిగిలిన ఇద్దరు నిందితులు మరో స్కూటీని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారని పోలీసు అధికారి పేర్కొన్నారు.
మృతదేహాన్ని విసిరేయడంతో సోనియా సహాయం
తరువాత వారంతా రాజా మృతదేహాన్ని మౌలాఖియాత్ అనే ప్రదేశానికి తీసుకెళ్లి అక్కడ పడేశారని చెప్పారు. రాజా మృతదేహాన్ని లోయలోకి విసిరివేయడంలో సోనమ్ కూడా తమకు సహాయం చేసిందని నిందితులు చెప్పారని పోలీసు అధికారి మారక్ తెలిపారు. హత్య వెనుక గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోందని, పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయని అన్నారు. మే 11న ఇండోర్లో రాజా, సోనమ్లకు వివాహం జరిగింది. తరువాత వారు హనీమూన్ కోసం మేఘాలయ వెళ్లారు.
ఇది కూడా చదవండి: మరో ‘హనీమూన్ కేసు’.. ఐస్ క్రీం ఫ్రీజర్లో మృతదేహం..