
రిటైర్డు డీజీపీ ఓంప్రకాష్ హత్య కేసు..
భోజనం చేస్తుండగా భార్య దాడి
భార్య, కూతురు అరెస్టు
కర్ణాటక: విశ్రాంత డీజీపీ ఓం ప్రకాష్ ఆదివారం ఇంట్లో డైనింగ్ టేబుల్పై చేపల కూరతో భోజనం చేస్తుండగా హత్య చేసినట్లు తెలిసింది. బెంగళూరు హెచ్ఎస్ఆర్ లేఔట్ లోని నివాస భవనంలో ఆయన దారుణ హత్యకు గురికావడం తెలిసిందే. ఆయన భార్య పల్లవి, కూతురు కృతిని పోలీసులు అరెస్టు చేసి విచారణ చేపట్టారు. హత్యా సంగతులు క్రమంగా బయటపడుతున్నాయి. మధ్యాహ్నం ఓంప్రకాష్ చేపల కూరను తెప్పించుకున్నారు. డైనింగ్టేబుల్పై ఆరగిస్తుండగా భార్య గొడవకు దిగింది. రగడ తారాస్థాయికి చేరుకుంది, భార్య ఆవేశం పట్టలేక ఓంప్రకాష్ కళ్లలో కారంపొడి చల్లి కత్తితో పొడిచి చంపింది. తరువాత పై అంతస్తు గదిలోకి వెళ్లిన భార్య, కుమార్తె పోలీసులకు సమాచారం అందించారు.
హెచ్ఎస్ఆర్లేఔట్ పోలీసులు వెళ్లగానే కూతురు కృతి తలుపులను లాక్ చేసింది. హత్య చేసింది ఎవరు అని పోలీసులు ప్రశ్నించగా భార్య పల్లవి నేనే అని బదులిచ్చింది. క్రైంసీన్ పరిశీలనలో భోజనం ప్లేట్ డైనింగ్టేబుల్పై కనబడింది. డైనింగ్ హాల్ రక్తసిక్తమైన ఓంప్రకాష్ శవం పడి ఉంది. కళ్లలో కారంపొడి చల్లిన గుర్తులు కనబడ్డాయి. చాకుతో , బీర్ బాటిల్తో పొడిచారు. పగిలిన బీర్ బాటిల్ లభించింది. సోమవారం ఉదయం తల్లీకూతురిని హెచ్ఎస్ఆర్ లేఔట్ ఠాణాకు తరలిస్తుండగా గొడవకు దిగారు. మమ్మల్ని ఎందుకు అరెస్టు చేశారు అని కేకలు వేస్తూ జీపు నుంచి దిగలేదు. పోలీసులు సముదాయించి తీసుకెళ్లారు. ఓంప్రకాష్ హత్య కేసు విచారణను మడివాళ ఏసీపీ వాసుదేవ్ కు అప్పగించారు. కాగా, కుటుంబసభ్యులు సంప్రదాయరీతిలో అంత్యక్రియలను నిర్వహించారు.
మరో మహిళతో ఎఫైర్
ఓంప్రకాష్ చిక్కమగళూరుకు చెందిన మహిళతో ఆత్మీయంగా ఉంటున్నారు. సదరు మహిళ 2015లో ఓంప్రకాష్ డీజీపీగా ఉండగా ప్రధాన కార్యాలయం ముందు ధర్నా చేసింది. ఓంప్రకాష్ మోసం చేశాడని ఆరోపించింది. ఈ సంఘటన ఓంప్రకాష్ దంపతుల మధ్య కలహాలకు కారణమైంది. ఇప్పుడు ఆమెను కూడా కనిపెట్టి విచారణ చేయాలని పోలీసులు తీర్మానించారు.
శాంతిభద్రతలు ఉన్నాయా: విపక్ష నేత
దొడ్డబళ్లాపురం: రిటైర్డ్ డీజీపీ ఓం ప్రకాశ్ తన కుటుంబ సభ్యుల చేతుల్లో దారుణ హత్యకు గురికావడం రాష్ట్రంలో శాంతిభద్రతల దుస్థితికి అద్దం పడుతోందని బీజేపీ పక్ష నేత ఆర్ అశోక్ విమర్శించారు. బెంగళూరులో మాట్లాడుతూ ఈ హత్య విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవాలన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ అసలు ఉందా అనే అనుమానం కలుగుతోందన్నారు. రాష్ట్రంలో హత్యలు, అత్యాచారాలు రోజూ ఎక్కడో ఒకచోట జరుగుతూనే ఉన్నాయన్నారు.
దాండేలిలో ఫాంహౌస్, రిసార్టు
ఓంప్రకాష్ గతంలో ఉత్తర కన్నడ జిల్లా ఎస్పీగా పనిచేశారు. ఆయనకు దాండేలిలో కోట్లాది రూపాయలు విలువచేసే ఆస్తులు ఉన్నాయి. సామజోయిడా గ్రామంలో 2 ఎకరాలకు పైగా భూమిలో సుందరమైన ఫాంహౌస్ను నిర్మించారు. శ్రీగంధం, అరటి తోట వేశారు. అక్కడే కాళీనది పక్కన ఐదెకరాల భూమి ఉంది ఈ స్దలంలో రిసార్టు నిర్మించి పర్యాటకులకు రివర్ ర్యాఫ్టింగ్ కూడా చేస్తున్నారు. ఈ ఆస్తి ఓంప్రకాష్ కుమారుడు కార్తీకేశ్ పేరులో ఉంది.
ఇప్పుడే చెప్పలేను: హోంమంత్రి
రిటైర్డ్ డీజీపీ ఓం ప్రకాశ్ హత్య కేసులో సమగ్ర విచారణ జరిగేవరకు ఏమి చెప్పేందుకు సాధ్యపడదు. తనిఖీలో ఎలాంటి సమాచారం లభిస్తుంది అనేది చూడాల్సి ఉందని హోం మంత్రి పరమేశ్వర్ అన్నారు. ఉత్తమ అధికారికి, మంచి వ్యక్తి. ఈ విధంగా జరుగకుండా ఉండాల్సిందని అన్నారు. విచారణ పూర్తయ్యేవరకు ఘటనకు కారణం ఏమిటనేది చెప్పలేమని అన్నారు.
క్రూరంగా హత్య చేశారు
బనశంకరి: విశ్రాంత డీజీపీ ఓంప్రకాష్ హత్యకు గురయ్యే గంట ముందు వరకు వ్యక్తిగత సిబ్బందితో బాగానే మాట్లాడారు, ఇలా హత్యకు గురికావడం దురదృష్టకరమని వీవీఐపీ సెక్యూరిటీ విభాగం ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. ఓంప్రకాష్ ఇంటి వద్ద ఆయన మాట్లాడుతూ.. ఆదివారం మధ్యాహ్నం 3.05 నిమిషాలకు ఓంప్రకా‹Ùకు ఫోన్ చేస్తే సంతోషంగా మాట్లాడారు, సోమవారం ఇంటికి వస్తాను సార్ అని చెప్పా, వద్దు ఇంట్లో మేడం ఉన్నారని సార్ చెప్పారు అని పేర్కొన్నారు. చాలా క్రూరంగా హత్య చేశారని, గొంతు భాగంలో రెండుసార్లు పొడిచారు, మృతదేహాన్ని చూడగానే సారేనా హత్యకు గురైంది అని దిగ్భ్రాంతికి లోనయ్యాను అన్నారు. కుమార్తెకు పెళ్లి చేసి, కొడుకుతో ఉంటానని చెప్పేవారన్నారు.