బెంగళూరు: అగ్నిసాక్షిగా ఏడడుగులు వేసిన భార్యను.. కిరాతక భర్త అంతమొందించాడు. అతని అక్రమ సంబంధాన్ని ప్రశ్నించడమే ఆమె చేసిన పాపం. ఈ సంఘటన బీదర్ జిల్లా బాల్కి తాలూకా గాయముఖ దేవాలయం సమీపంలోని అటవీ ప్రాంతంలో జరిగింది. బీదర్ తాలూకా హొన్నికేరికి చెందిన సంజన (26)ను భర్త భగవత్ జ్ఞానేశ్వర్ (30)దాడిచేసి హత్య చేశాడు.
భగవత్ పక్కింటి అమ్మాయితో అక్రమ సంబంధం కలిగి ఉండడంతో సంజన నిలదీసింది. అలాంటి పనులు చేయవద్దని గొడవ చేసేది. తమకు అడ్డుగా ఉందని భావించిన భగవత్ సంజనను కారులో గాయముఖ దేవాలయం వద్ద అటవీ ప్రదేశంలోకి తీసికెళ్లి రాడ్తో దాడిచేసి తీవ్రంగా గాయపరిచాడు. తరువాత ఆమెను మహారాష్ట్రలోని సొల్లాపుర ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చాడు.అయితే చికిత్స ఫలించక సంజన మృతిచెందింది. ధన్నూర పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.


