‘మోగ్లీ గర్ల్‌’ పూజ ఇక లేదు | Who Was Mowgli Girl Ehsaas Alias Pooja Who Passed Away at 18 | Sakshi
Sakshi News home page

‘మోగ్లీ గర్ల్‌’ పూజ ఇక లేదు

Jun 20 2026 7:31 AM | Updated on Jun 20 2026 11:27 AM

Who Was Mowgli Girl Ehsaas Alias Pooja Who Passed Away at 18

అడవిలో ఒంటరిగా కనిపించిన ఆ చిన్నారి కథ ఒకప్పుడు దేశాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. మానవ సమాజానికి దూరంగా గడిచిన బాల్యం నుంచి, మనుషుల మధ్య జీవించడం నేర్చుకున్న ఆమె జీవితం పోరాటానికి ప్రతీకగా నిలిచింది. అయితే ఎన్నో కష్టాలు, ఆరోగ్య సమస్యలను అధిగమిస్తూ సాగిన ఆ ప్రయాణం చివరకు ఆగిపోయింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘మోగ్లీ గర్ల్’ ఎహ్సాస్‌ (18) ఇక లేదు.

చిన్నారిగా అడవుల్లో దొరికిందని అధికారులు చెబుతున్న ఎహ్సాస్‌ అలియాస్‌ పూజ చిన్నవయసులోనే కన్నుమూసింది. ఈ విషయం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఊపిరితిత్తుల వ్యాధి కారణంగా వచ్చిన తీవ్రమైన రక్త సంక్రమణ (సెప్టీసీమియా) ఆమె మృతికి కారణమైందని వైద్యులు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోలో చికిత్స పొందుతూ ఆమె జూన్‌ 15నే మరణించిందట. 

అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఎహ్సాస్‌ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. చికిత్స కోసం ఆస్పత్రిలో చేరిన ఆమె ఆరోగ్యం మెరుగుపడటంతో జూన్‌ 11న డిశ్చార్జ్‌ చేశారు. అయితే జూన్‌ 15న ఒక్కసారిగా పరిస్థితి విషమించడంతో తిరిగి ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించింది.

ఎహ్సాస్‌ కథ 2017 జనవరిలో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్‌ జిల్లా కతర్నియాఘాట్‌ అటవీ ప్రాంతంలోని మోతీపూర్‌ రేంజ్‌ సమీపంలో ఆమె కనిపించింది. అప్పటికి ఆమె మానవ సమాజంతో ఎలాంటి సంబంధం లేకుండా జీవిస్తున్నట్లు కనిపించింది. ఆమె ప్రవర్తన కూడా వింతగా అనిపించింది. నాలుగు కాళ్లపై నడవడం, దుస్తులు ధరించడానికి నిరాకరించడం, మనుషులు దగ్గరకు వస్తే దూకుడు దాడులు చేయడం.. ఇవన్నీ అధికారుల్ని ఆశ్చర్యపరిచింది. దీంతో ప్రముఖ రచయిత రుడ్యార్డ్‌ కిప్లింగ్‌ రచించిన ‘జంగిల్‌ బుక్‌’లోని మొగ్లీ పాత్రతో పోలుస్తూ ఆమెను ‘మోగ్లీ గర్ల్‌’గా పిలవడం ప్రారంభించారు.

రక్షించిన తర్వాత బాలికను తొలుత ‘పూజ’గా పేరు పెట్టిన అధికారులు.. అనంతరం లక్నోలోని ప్రత్యేక బాలల సంరక్షణ కేంద్రానికి తరలించారు. అక్కడ ఆమెకు ‘ఎహ్సాస్‌’ అనే పేరు పెట్టారు. వైద్య పరీక్షల్లో ఆమె మెదడు పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందలేదని, మేధో వికలాంగతతో పాటు ఎపిలెప్సీ (మూర్ఛ) సమస్యలు కూడా ఉన్నట్లు తేలింది. అయినప్పటికీ, సంవత్సరాల తరబడి అందించిన వైద్య సేవలు, థెరపీ, పునరావాస కార్యక్రమాల వల్ల ఆమె ప్రవర్తనలో గణనీయమైన మార్పు వచ్చింది.

క్రమంగా దుస్తులు ధరించడం, సంరక్షకులను గుర్తుపట్టడం, సామాజిక జీవనంలోని కొన్ని అంశాలకు అలవాటు పడడం నేర్చుకుంది. ఆమెను చూసుకునే సిబ్బందితో ఆత్మీయ బంధం ఏర్పడింది. ముఖ్యంగా సంరక్షకురాలు రాణిని ‘అమ్మ’ అని పిలుస్తూ ఎంతో సన్నిహితంగా ఉండేదని సహచరులు గుర్తు చేసుకున్నారు.

ఎహ్సాస్‌ మరణంపై భావోద్వేగానికి గురైన రాణి, ‘‘ఒకరోజు ఆమె పూర్తిగా కోలుకుంటుందని ఎప్పుడూ నమ్మేదాన్ని. ఇప్పుడు ఆమె జ్ఞాపకాలు మాత్రమే మిగిలాయి’’ అని ఆవేదన వ్యక్తం చేశారు.

"ఆమె ఎవరు? ఎక్కడి నుంచి వచ్చింది? అడవిలోకి ఎలా చేరింది? అన్న ప్రశ్నలు నేటికీ మిస్టరీగానే మిగిలిపోయాయి. అడవిలో ఒంటరిగా కనిపించిన ఓ బాలిక.. సమాజంలో కలిసిపోవడానికి ప్రయత్నించడం ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచింది.  ‘మోగ్లీ గర్ల్‌’గా దేశం గుర్తుపెట్టుకున్న ఎహ్సాస్‌ జీవితం మాత్రం ఒక అసాధారణ గాథగా నిలిచిపోయింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement