బీహార్ స్ట్రాంగ్ రూమ్ కెమెరాలు ఆఫ్.. ఆర్జేడీ సంచలన వీడియో | Video RJD Alleges Suspicious Activity At Bihar Strong Room | Sakshi
Sakshi News home page

బీహార్ స్ట్రాంగ్ రూమ్ కెమెరాలు ఆఫ్.. ఆర్జేడీ సంచలన వీడియో

Nov 9 2025 7:56 AM | Updated on Nov 9 2025 10:40 AM

Video RJD Alleges Suspicious Activity At Bihar Strong Room

పాట్నా: బీహార్‌లో ఏం జరుగుతోంది?. స్ట్రాంగ్ రూమ్ వద్ద కొందరు వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరించడం పలు అనుమానాలకు తావిస్తోంది. దీనికి సంబంధించిన వీడియోను ఇండియా కూటమికి చెందిన ఆర్జేడీ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. ఈ సందర్భంగా బీహార్‌లో ఈవీఎం ట్యాంపరింగ్ చేసి భారీ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారంటూ ఆర్జేడీ ఆరోపించింది. దీంతో, ఈ వీడియో సంచలనంగా మారింది. మరోవైపు.. ఆర్జేడీ ఆరోపణలను ఈసీఐ తీవ్రంగా ఖండించింది. దీనిపై క్లారిటీ ఇచ్చింది.

ఆర్జేడీ ట్విట్టర్‌లో పోస్టు చేసిన వీడియో ప్రకారం.. సమస్తిపూర్‌లోని మొహియుద్దీన్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని స్ట్రాంగ్ రూమ్‌లోకి కొందరు వ్యక్తులు ప్రవేశించడం కనిపించింది. వారంతా ఎవరు? స్ట్రాంగ్‌ రూమ్‌ వద్ద ఏం చేస్తున్నారు?. అక్కడి పరిస్థితులపై వివరణ ఇవ్వాలని ఎన్నికల కమిషన్‌, అధికారులను ఆర్జేడీ డిమాండ్‌ చేసింది. బీహార్ నుండి ఓట్లను దొంగిలించడానికి కొంతమంది బీహార్ వ్యతిరేక వ్యక్తులతో కలిసి ఒక దొంగ పనిచేయాలనుకుంటున్నాడు అని సంచలన ఆరోపణలు చేసింది. ఇదే సమయంలో స్ట్రాంగ్‌ వద్ద భద్రత పెంచాలని, అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

మరో వీడియోలో.. 
ఆర్ఎన్ కాలేజీలో కౌంటింగ్ కోసం భద్రపరిచిన ఈవీఎంలను ట్యాంపరింగ్ చేస్తున్నారని ఆర్జేడీ ఆరోపణలు చేసింది. ఆ స్ట్రాంగ్ రూమ్ దగ్గర ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను మేనేజ్ చేస్తున్నారని.. దీంతో ఈవీఎం ట్యాంపరింగ్‌కు పాల్పడినట్లు అనుమానంగా ఉందని కామెంట్స్‌ చేసింది. మహ్నార్-129 అసెంబ్లీ స్థానంలో ఉన్న ఈ ఆర్ఎన్ కాలేజ్ కౌంటింగ్ సెంటర్లో సీసీటీవీలను ఆఫ్ చేశారని అందుకు సంబంధించి ఆర్జేడీ నాయకులు వీడియో రిలీజ్ చేశారు.

వైశాలి జిల్లాలోని హాజీపూర్‌లో స్ట్రాంగ్ రూమ్ దగ్గర అనుమానాస్పద పరిస్థితులు నెలకొన్నాయని మరో వీడియోలో తెలిపారు. రాత్రి వేళ పికప్ వ్యాన్ స్ట్రాంగ్ రూమ్ దగ్గరికి వచ్చినట్లు వీడియోలో కనిపిస్తోంది. అయితే, ఆ వ్యాన్ వెళ్లేటప్పుడు సీసీ టీవీ కెమెరాలు స్విచ్ ఆఫ్ అయినట్లు చూపిస్తోంది. అక్కడున్న పెద్ద సీసీకెమెరా ఆఫ్ అయి ఉంది. మిగతావి ఆన్‌లో ఉన్నాయి. ఇది అనుమానాలకు తావిస్తోందని ఆర్జేడీ ఆరోపిస్తోంది.

కౌంటింగ్ ఏరియాలోకి వాహనాలు.. 
కౌంటింగ్ చేసేందుకు ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ ఉన్న స్థలంలోకి వెహికిల్స్ ఎందుకు వెళ్తున్నాయని వీడియో రికార్డు చేసిన వ్యక్తి ప్రశ్నించాడు. ఈ నేపథ్యంలో అధికార జేడీయూ-బీజేపీ కూటమి అక్రమ మార్గంలో గెలిచేందుకు కుట్రలు చేస్తున్నట్టు ఆర్జేడీ నేతలు ఆరోపిస్తున్నారు.

ఈసీ స్పందన.. 
ఈ నేపథ్యంలో ఆర్జేడీ ఫిర్యాదుపై ఈసీ స్పందిస్తూ ప్రాథమిక విచారణ నిర్వహించినట్లు తెలిపింది. కంట్రోల్ రూమ్‌లోని నుంచి స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద సీసీ కెమెరాల పర్యవేక్షణ కొనసాగుతోందని అధికారికంగా ఓ ప్రకటనలో తెలిపింది. అయితే, ఐదు అసెంబ్లీ విభాగాలలో ఒకటైన 129 మహానార్ వద్ద డిస్‌ప్లే స్క్రీన్ ఆటో టైమ్ అవుట్ కారణంగా కొంతకాలం ఆపివేయబడింది. త్వరగా పునఃప్రారంభించబడిందని పేర్కొంది. ఇది అంతరాయం లేకుండా జరిగాయని కమిషన్ స్పష్టం చేసింది. మహానార్ ప్రధాన కంట్రోల్ రూమ్ ఫీడ్ ఏమాత్రం ప్రభావితం కాలేదని కూడా తెలిపింది.

పికప్ వ్యాన్‌ ఆరోపణలపై స్పందిస్తూ.. వాహనం స్ట్రాంగ్ రూమ్‌లో నియమించబడిన భద్రతా సిబ్బందికి చెందినది. వారు కళాశాల క్యాంపస్‌కు ఆలస్యంగా బెడ్డింగ్, సామాగ్రిని తీసుకువచ్చారని ఈసీఐ తెలిపింది. వాహనం 15 నిమిషాల్లోనే వెళ్లిపోయింది. దాన్ని ఎంట్రీ గార్డు రిజిస్టర్‌లో నమోదు చేశారు అని పేర్కొంది. స్ట్రాంగ్ రూమ్ మూడు అంచెల భద్రతా వ్యవస్థ కింద పనిచేస్తుందని కమిషన్ స్పష్టం చేసింది. చివరగా.. నిరాధారమైన, తప్పుదారి పట్టించే పోస్ట్‌ను ఖండిస్తున్నట్టు ఈసీఐ తెలిపింది.

ఇది కూడా చదవండి: చెత్తకుప్పలో వీవీప్యాట్‌ స్లిప్పులు

Advertisement
 
Advertisement
Advertisement