యూపీలో ఇంటింటికీ బీజేపీ–ఆర్‌ఎస్‌ఎస్‌! | Uttar Pradesh BJP to launch door to door campaign | Sakshi
Sakshi News home page

యూపీలో ఇంటింటికీ బీజేపీ–ఆర్‌ఎస్‌ఎస్‌!

Nov 16 2024 5:42 AM | Updated on Nov 16 2024 5:42 AM

Uttar Pradesh BJP to launch door to door campaign

సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తర్‌ప్రదేశ్‌ భారీ ఎదురుదెబ్బ నుంచి బీజేపీ పాఠం నేర్చుకుంది. 9 అసెంబ్లీ స్థానాలకు అక్కడ జరుగుతున్న ఉప ఎన్నికల్లో మాతృ సంస్థ ఆర్‌ఎస్‌ఎస్‌ఎస్‌తో సమన్వయంతో పనిచేస్తోంది. ఇండియా కూటమి కులాధారిత సామాజిక న్యాయ రాజకీయాన్ని హిందూత్వ కార్డుతో ఢీ కొట్టనుంది. ‘ఏక్‌ హై తో సేఫ్‌ హై ’ (ఐక్యంగా ఉంటేనే సురక్షితంగా ఉంటాం) నినాదాన్ని వచ్చే ఐదు రోజులు విస్తృతంగా ఇంటింటికీ తీసుకెళ్లాలని ప్రయాగ్‌రాజ్‌లో బీజేపీ–ఆర్‌ఎస్‌ఎస్‌ కీలక భేటీలో నిర్ణయించారు. 

సమాజ్‌వాదీ పార్టీ తెరపైకి తెచ్చిన పీడీఏ (పీడిత్, దళిత్, ఆదివాసీ) ఫార్ములాను ఎదుర్కొనే వ్యూహాలపై భేటీ చర్చించింది. హిందూత్వ అజెండాకు పదును పెట్టాలని సంఘ్‌ నొక్కి చెప్పింది. ‘బటేంగేతో కటేంగే’ (విడిపోతే చెల్లాచెదురవుతాం) అన్న ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు. పార్టీ, సంఘ్‌ మధ్య సమన్వయ లోపం లేకుండా చూసుకోవాల్సిందిగా పార్టీ శ్రేణులకు ఆదేశాలు జారీ అయ్యాయి. దళిత, ఓబీసీ ఓటర్ల మధ్య విభజనకు యత్నాలకు చెక్‌ పెట్టాలని బీజేపీకి ఆర్‌ఎస్‌ఎస్‌ సూచించింది.

Advertisement
 
Advertisement
Advertisement