ఘోర విషాదాలు  | Tragic incidents of plane crashes in the world | Sakshi
Sakshi News home page

ఘోర విషాదాలు 

Jun 13 2025 6:12 AM | Updated on Jun 13 2025 8:49 AM

Tragic incidents of plane crashes in the world

దేశంలో పలు విమాన ప్రమాదాలు 

వందల సంఖ్యలో ప్రయాణికులు మృతి  

సాంకేతిక లోపాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితులే కారణం  

న్యూఢిల్లీ:  అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదం దేశ ప్రజలను ఒక్కసారిగా తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. దేశంలో ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద విమాన ప్రమాదాల్లో ఇది కూడా ఒకటని చెబుతున్నారు. గతంలో ఎన్నో ప్రమాదాలు జరిగాయి. వందలాది మంది ప్రయాణికులు గమ్యస్థానం చేరకుండానే కన్నుమూశారు. చాలావరకు సాంకేతిక లోపాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితులతోపాటు మానవ తప్పిదాలు సైతం ప్రమాదాలకు కారణమవుతున్నాయి.  

→ 2020 ఆగస్టు 7:  కేరళలోని కోజికోడ్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు రన్‌వేపై ఎయిర్‌ ఇండియా 1344 విమానం ల్యాండవుతున్న సమయంలో అదుపు తప్పింది. పక్కనే ఉన్న లోయలోకి దూసుకెళ్లింది. విమానం రెండు ముక్కలు కావడంతో అందులో ఉన్న 190 మంది ప్రయాణికుల్లో 21 మంది మృతిచెందారు. భారీ వర్షం, ప్రతికూల వాతావరణం కారణంగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మృతుల్లో ఇద్దరు పైలట్లు సైతం ఉన్నారు. 
 
→ 2010 మే 22:  కర్ణాటకలోని మంగళూరు ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో ఎయిర్‌ ఇండియాకు చెందిన బోయింగ్‌ 737–800 విమానం ల్యాండింగ్‌ సమయంలో అదుపు తప్పి లోయలో పడిపోయింది. విమానంలో వెంటనే మంటలు చెలరేగడంలో 158 మంది మరణించారు. ఇది టేబుల్‌టాప్‌ రన్‌వే కావడంతో విమానాన్ని ల్యాండింగ్‌ చేయడంలో పైలట్‌ తడబడినట్లు గుర్తించారు.   

→ 2000 జూలై 17:  బిహార్‌ రాజధాని పాటా్నలో అలయెన్స్‌ ఎయిర్‌ ఫ్లైట్‌ 7412 జనావాసాలపై కుప్పకూలింది. 60 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 55 మంది విమాన ప్రయాణికులు కాగా, ఐదుగురు ఇళ్లల్లోని నివాసితులు.   

→ 1996 నవంబర్‌ 12:  సౌదీ అరేబియా విమానం 763, కజకిస్తాన్‌ ఎయిర్‌లైన్స విమానం 1907 హరియాణాలోని చార్కీ దాద్రీ గగనతలంలో పరస్పరం ఢీకొని కుప్పకూలాయి. ఏకంగా 349 మంది మరణించారు. సమాచార మారి్పడిలో లోపం వల్లే ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.   

→ 1990 ఫిబ్రవరి 14:  ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ విమానం 605 బెంగళూరు హెచ్‌ఏఎల్‌ ఎయిర్‌పోర్టులో ల్యాండయ్యే ముందు అదుపుతప్పింది. రన్‌వే పక్కన భూమిని ఢీకొని పక్కనే ఉన్న గోల్ఫ్‌ కోర్సులోకి దూసుకెళ్లింది. విమానంలో 146 మంది ఉండగా, వీరిలో 92 మంది మృతిచెందారు.  
 


→ 1988 అక్టోబర్‌ 19:  గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ విమానాశ్రయంలో ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ ఫ్లైట్‌ 113 ల్యాండింగ్‌ సమయంలో రన్‌వే పక్కన చెట్లను ఢీకొట్టింది. వెంటనే మంటలు చెలరేగడంతో 135 మంది ప్రయాణికులకు గాను 133 మంది విగత జీవులయ్యారు. పొగమంచు అధికంగా ఉండడం వల్ల రన్‌వే కనిపించకపోవడంతో ఈ ప్రమాదం జరిగింది.  

→ 1978 జనవరి 1:   ముంబై నుంచి దుబాయ్‌కి బయలుదేరిన ఎయిర్‌ ఇండియా ఫ్లైట్‌ 855 అరేబియా సముద్రంలో కూలిపోయింది. విమానంలోని మొత్తం 213 మంది ప్రయాణికులు మరణించారు. టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే ఈ దుర్ఘటన జరిగింది.  

→ 1973 మే 31:  ఢిల్లీ పాలమ్‌ ఎయిర్‌ఫోర్టులో ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ విమానం 440 ల్యాండింగ్‌ కంటే ముందు హైటెన్షన్‌ విద్యుత్‌ వైర్లను ఢీకొట్టింది. దాంతో అందులో మంటలు వ్యాపించడంతో 65 మందికిగాను 48 మంది ప్రయాణికులు బలయ్యారు. ప్రతికూల వాతావరణం వల్ల ఈ ప్రమాదం చోటుచేసుకుంది.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement