ఇండోర్ జంట మిస్సింగ్‌ మిస్టరీ.. ఏ రోజు ఏం జరిగింది? | Tracing the Trail of Indore Couple Missing | Sakshi
Sakshi News home page

ఇండోర్ జంట మిస్సింగ్‌ మిస్టరీ.. ఏ రోజు ఏం జరిగింది?

Jun 8 2025 8:51 AM | Updated on Jun 8 2025 11:05 AM

Tracing the Trail of Indore Couple Missing

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన నూతన దంపతులు రఘువంశీ, సోనమ్‌లు హనీమూన్ కోసం మేఘాలయకు వెళ్లి అదృశ్యమయ్యారు. 11 రోజుల తరువాత రాజా రఘువంశీ మృతదేహం లభ్యమైంది. అతడిని ఎవరో హత్యచేసినట్టు పోలీసులు నిర్ధారించారు. ఘటనా స్థలంలో హత్యకు ఉపయోగించిన వేటకొడవలిని స్వాధీనం చేసుకున్నట్టు ఈస్ట్ ఖాసీ హిల్స్ ఎస్పీ వివేక్ సియోం తెలిపారు. అయితే సోనమ్ ఏమైందనేది ఇంతవరకూ తెలియరాలేదు.

మేఘాలయ పోలీసులు ఈ కేసుకు సంబంధించిన పలు ఫొటోలు విడుదల చేశారు. అదృశ్యమైన సోనమ్‌ కోసం గాలిస్తున్నారు. ఈ జంట హనీమూన్‌లో భాగంగా సందర్శించిన ప్రదేశాలను, సమయాలను పోలీసులు తెలిపారు.

మే 21, సాయంత్రం 6 గంటలకు: షిల్లాంగ్
రఘువంశీ, సోనమ్‌లు మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లోని బాలాజీ గెస్ట్ హౌస్‌కు చేరుకుని, చెక్ ఇన్ చేశారు.

మే ​​22, ఉదయం: షిల్లాంగ్
రఘువంశీ, సోనమ్‌లు కీటింగ్ రోడ్‌లో స్కూటీని అద్దెకు తీసుకుని, బాలాజీ గెస్ట్ హౌస్‌కు తిరిగి వచ్చారు. వారు అల్పాహారం తీసుకోకుండానే చెక్ అవుట్ చేశారు. మే 25కు తిరిగి వస్తామని, గది అవసరమైతే ఫోన్ చేస్తామని మేనేజర్‌కు చెప్పారు. షిల్లాంగ్ నుండి వారు స్కూటీపై ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం సోహ్రా (చిరపుంజి)కి రెండు లగేజీలను తీసుకుని బయలుదేరారు.

మే 22, సాయంత్రం: మౌలాఖియాట్, తూర్పు ఖాసీ హిల్స్ జిల్లా
ఈ జంట తూర్పు ఖాసీ హిల్స్‌లోని మౌలాఖియాట్ గ్రామానికి చేరుకుంది. పర్యాటకుల కోసం  కేటాయించిన పార్కింగ్ స్థలంలో స్కూటీని నిలిపారు. అదే జిల్లాలోని నోంగ్రియాట్ గ్రామంలోని షిపారా హోమ్‌స్టేకు ట్రెక్కింగ్ చేసేందుకు వారు స్థానిక గైడ్‌ను  ఏర్పాటు చేసుకున్నారు.

మే 23, ఉదయం: మౌలాఖియాట్, తూర్పు ఖాసీ హిల్స్ జిల్లా
రఘువంశీ, సోనమ్‌లు షిపారా హోమ్‌స్టే నుండి చెక్ అవుట్ చేసి, గైడ్ లేకుండానే మావ్లాఖియాట్ గ్రామానికి వెళ్లారు. అదే రోజు వారు మావ్లాఖియాట్ నుండి బయలుదేరి, ఆ తర్వాత అదృశ్యమయ్యారు. దీంతో పోలీసులు చుట్టుపక్కల ప్రాంతాలలో  గాలించారు. ఆ  జంట తామే ట్రెక్కింగ్‌కు వెళతామని తెలియజేసినట్లు గైడ్ పోలీసులకు చెప్పాడు. తన సేవలను తీసుకోలేదని గైడ్‌ పోలీసులకు తెలిపాడు.

మే 24: సోహ్రారిమ్
తూర్పు ఖాసీ హిల్స్‌లోని సోహ్రారిమ్ గ్రామ పెద్ద తమ గ్రామంలో  అనుమానాస్పదంగా ఉన్న ఒక స్కూటీని చూసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మే 25: సోహ్రారిమ్
పోలీసులు ఆ స్కూటీ యజమానిని గుర్తించారు. అతను సోహ్రా పోలీస్ స్టేషన్‌కు వచ్చి, మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన రఘువంశీ, సోనమ్‌లు తన ద్విచక్ర వాహనాన్ని అద్దెకు తీసుకున్నట్లు నిర్ధారించాడు.

మే 26: సోహ్రారిమ్
రఘువంశీ, సోనమ్‌లు తిరిగిన ప్రాంతంలో పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.

జూన్ 2: వీ సావ్డాంగ్ జలపాతం
పోలీసు డ్రోన్ వీ సావ్డాంగ్ జలపాతం కింద లోయలో ఒక మృతదేహాన్ని గుర్తించింది. పాక్షికంగా కుళ్ళిపోయిన ఆ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. అది రాజా రఘువంశీ మృతదేహమేనని మృతుని కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం సోనమ్‌ కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

ఇది కూడా చూడండి: అధ్యక్ష అభ్యర్థిపై కాల్పులు.. కొలంబయాలో ఉద్రిక్తత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement