Kolkata: వెనక్కి తగ్గని వైద్యులు.. ఆగని నిరసనలు | Top Cop Changed, Officials Gone, But Kolkata Doctors Continue Cease Work | Sakshi
Sakshi News home page

Kolkata: వెనక్కి తగ్గని వైద్యులు.. ఆగని నిరసనలు

Sep 18 2024 12:45 PM | Updated on Sep 18 2024 1:06 PM

Top Cop Changed, Officials Gone, But Kolkata Doctors Continue Cease Work

కోల్‌కతాలో వైద్యురాలిపై హత్యాచార ఘటనపై ఆగ్రహాజ్వాలలు, నిరసనలు చల్లారడం లేదు. బాధితురాలికి న్యాయ చేయాలని, నిందితులను కఠినంగాశిక్షించాలని డిమాండ్‌ చేస్తూ జూనియర్‌ వైద్యులు, వైద్య సిబ్బంది చేపట్టిన ఆందోళనలు నిరంతరంగా కొనసాగుతూనేఉన్నాయి. నిరసన చేస్తున్న వైద్యులతో బెంగాల్‌ ప్రభుత్వం చర్చలు జరిపినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. వైద్యులు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు.

మమతా బెనర్జీ సర్కార్‌ ఇప్పటికే కోల్‌కతా కమిషనర్‌తో సహాల పలువురు అధికారులను బదిలీ చేసింది. అయినప్పటికీ ప్రభుత్వం తమ డిమాండ్‌లను అన్నీంటినీ నెరవేర్చేవరకు సమ్మె కొనసాగిస్తామని వైద్యులు స్పష్టం చేశారు. ఇంకా నెరవేర్చాల్సిన డిమాండ్లను వినిపించేందుకు దీదీ సర్కారుతో మరోసారి చర్చలు జరుపుతామని తెలిపారు.

అయితే తమ నిరసనల ఉద్యమాన్ని కించపరిచేందుకు చాలా ప్రయత్నాలు జరిగాయని పశ్చిమ బెంగాల్ జూనియర్ డాక్టర్ల ఫ్రంట్ ఒక ప్రకటనలో తెలిపింది. తమ సమ్మె ఒత్తిడి కారణంగానే రాష్ట్ర ప్రభుత్వం పోలీసు కమిషనర్‌, డిప్యూటీ కమిషనర్‌ నార్త్‌, డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌ సర్వీసెస్‌, డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌లను తొలగించాల్సి వచ్చిందని తెలిపారు. అయితే ఇది తమ ఉద్యమానికి లభించిన పాక్షిక విజయం మాత్రమేనని పేర్కొన్నారు.
కోల్‌కతా సీపీగా మనోజ్‌ వర్మ

సోమవారం ముఖ్యమంత్రితో జరిగిన సమావేశంలో హెల్త్‌ ప్రిన్సిపల్ సెక్రటరీ తొలగించాలన్న తమ డిమాండ్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వైద్యులు తెలిపారు. ముఖ్యమంత్రి మౌఖిక హామీ ఇచ్చారని.. ఇప్పటి వరకు ఆ దిశగా అడుగులు వేయలేదన్నారు. 

అంతేగాక ప్రభుత్వ ఆసుపల్లో  సురక్షిత వాతావరణం కల్పించాలని కోరారు. ఆసుపత్రుల వద్ద భద్రతను పెంచి, హెల్త్‌కేర్‌ సేవలు మెరుగుపరిచే వరకు వైద్యుల భద్రతకు భరోసా ఉండదని చెప్పారు. 

ఆసుపత్రులలో ఆరోగ్య సంరక్షణ సిబ్బంది, కౌన్సెలింగ్ సేవలను మరింత నియమించాలని డిమాండ్‌ చేశారు. ఆసుపత్రి బెడ్ల కేటాయింపులో అవినీతి, ప్రాణాధార మందుల కొరత కారణంగా సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం కావాలని కోరుతున్నామని వైద్యులు తెలిపారు.

ఇదిలా ఉండగా మహిళా వైద్యులు నైట్‌ డ్యూటీలు చేయొద్దన్న పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వ నిర్దేశాలను సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. అలా చెప్పే అధికారం ప్రభుత్వానికి లేదని స్పష్టం చేసింది. 

‘‘పైలట్లుగా, సైనికులుగా మహిళలు రాత్రి విధులు నిర్వహించడం లేదా? మీ నిర్దేశాలు మహిళా వైద్యుల కెరీర్‌పై ప్రభావం చూపుతాయి. రాత్రి విధుల్లో సమస్యలు ఎదుర్కోకుండా వారికి అవసరమైన భద్రత కల్పింపంచడం ప్రభుత్వ బాధ్యత. అంతే తప్ప వాటిని మానుకోవాలని చెప్పడం సరికాదు’’ అంటూ సీజేఐ జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్‌ జేబీ పార్డీవాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రా ధర్మాసనం మందలించింది. దాంతో సదరు నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకుంటామని బెంగాల్‌ సర్కారు విన్నవించింది.

Advertisement
 
Advertisement
Advertisement