టీఎంసీ సంక్షోభం.. అసలు ట్విస్ట్‌ ఇప్పుడే మొదలు! | Major Political Crisis In West Bengal As Rebel TMC Faction Claims To Oust Mamata Banerjee And Forms New Leadership | Sakshi
Sakshi News home page

టీఎంసీ సంక్షోభం.. అసలు ట్విస్ట్‌ ఇప్పుడే మొదలు!

Jun 23 2026 8:41 AM | Updated on Jun 23 2026 10:08 AM

TMC Crisis: Battle For The Real Trinamool Begins

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది. ప్రతిపక్ష తృణమూల్ కాంగ్రెస్‌ (టీఎంసీ)లో తిరుగుబాటు వర్గాలు పార్టీ మమతా బెనర్జీకి షాక్‌ల మీద షాకులు ఇస్తున్నాయి. ఇప్పటికే ఎంపీల వర్గం విలీనం పేరుతో వేరు కుంపటి పెట్టుకున్నాయి. ఇప్పుడు ఎమ్మెల్యేల వర్గం ఆమెను పార్టీ చైర్‌పర్సన్‌ పదవి నుంచి తొలగించినట్లు ప్రకటించడమే కాకుండా.. కొత్త నాయకత్వ నిర్మాణాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించుకుంది. అంతేకాదు ఈ విషయమై ఎన్నికల సంఘాన్ని ఆశ్రయిస్తామని కూడా చెబుతోంది. దీంతో టీఎంసీలో అంతర్గత సంక్షోభం మరో మలుపు తిరిగినట్లైంది.

ప్రతిపక్ష నేత(తాత్కాలిక) రితబ్రత బెనర్జీ (Ritabrata Banerjee) నేతృత్వంలోని అసంతృప్త వర్గం సోమవారం కోల్‌కతాలోని న్యూ టౌన్‌లో ఒక ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశానికి ప్రస్తుత, మాజీ ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులు, కౌన్సిలర్లు సహా దాదాపు 500 మంది టీఎంసీ నాయకులు హాజరైనట్లు తిరుగుబాటు వర్గం ప్రకటించింది. ఈ సమావేశంలో 30 మంది సభ్యులతో కూడిన జాతీయ కార్యవర్గాన్ని (National Working Committee) ఏర్పాటు చేస్తూ, తామే అసలైన తృణమూల్ కాంగ్రెస్‌ అని ప్రకటించారు.

కొత్త అధినేత అరూప్ రాయ్
సమావేశంలో ఎమ్మెల్యే అనూప్‌ రాయ్‌ను కొత్త చీఫ్‌గా ఎన్నుకున్నట్లు తిరుగుబాటు వర్గం వెల్లడించింది. అలాగే మాజీ కోల్‌కతా మేయర్ ఫర్హిద్‌ హకీమ్‌ , అరోప్ బిశ్వాస్‌, రతిన్ ఘోష్‌, సబీనా యాస్మిన్‌లను ఉపాధ్యక్షులుగా నియమించారు. రితబ్రత బెనర్జీ, జావేద్ ఖాన్‌, సందీపన్ సాహాలను ప్రధాన కార్యదర్శులుగా, అఖ్రుజ్జమాన్ అన్సారిని ఖజానాదారుగా నియమించినట్లు ప్రకటించారు.

ఎవరీ అరూప్‌?
అరూప్ రాయ్ పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో సీనియర్ నాయకుడు. హౌరా ప్రాంతానికి చెందిన ఆయన, తృణమూల్ కాంగ్రెస్ ఆవిర్భావం నుంచి మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందారు. హౌరా సెంట్రల్ నియోజకవర్గం నుంచి పలుమార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన, మమత ప్రభుత్వంలో మంత్రిగానూ పనిచేశారు. ప్రస్తుతం టీఎంసీలో తిరుగుబాటు వర్గం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో అరూప్ రాయ్‌ను పార్టీ చైర్‌పర్సన్‌గా ఎన్నుకున్నట్లు ప్రకటించడం రాజకీయంగా సంచలనంగా మారింది. ఒకప్పుడు మమతకు నమ్మినబంటుగా ఉన్న నేతే ఇప్పుడు ఆమెకు ప్రత్యామ్నాయ నాయకుడిగా ముందుకు రావడం చర్చనీయాంశంగా మారింది.

మమతకి మరో చాన్స్‌
మమత బెనర్జీని పార్టీ నుంచి పూర్తిగా దూరం చేయలేదని, ఆమె కోరుకుంటే ప్రధాన సలహాదారుగా (Chief Advisor) వ్యవహరించవచ్చని తిరుగుబాటు వర్గం వ్యాఖ్యానించడం రాజకీయంగా మరింత చర్చనీయాంశమైంది. పార్టీ రాజ్యాంగం ప్రకారం ప్రతి మూడేళ్లకోసారి జాతీయ కార్యవర్గాన్ని పునర్వ్యవస్థీకరించాల్సి ఉండగా, 2022లో ఏర్పాటైన కమిటీ గడువు ముగిసినా కొత్త కమిటీ ఏర్పాటు చేయలేదని వారు ఆరోపిస్తున్నారు.

మమత, అభిషేక్‌ ఫొటోలకు చోటు లేదు!
తిరుగుబాటు వర్గం నిర్వహించిన సమావేశంలో టీఎంసీ పార్టీ గుర్తు కనిపించినప్పటికీ, మమత బెనర్జీ, ఆమె మేనల్లుడు అభిషేక్‌ బెనర్జీ ఫొటోలు కనిపించకపోవడం గమనార్హం. ఇది పార్టీపై తమ హక్కును ప్రకటించే ప్రయత్నంగా విశ్లేషకులు భావిస్తున్నారు.

టీఎంసీ క్రమశిక్షణా చర్యలు
మరోవైపు అధికారిక టీఎంసీ నాయకత్వం కూడా వేగంగా స్పందించింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ ఫిర్హాద్ హకీమ్‌, అరోప్ బిశ్వాస్‌, అరూప్ రాయ్‌, జావేద్ ఖాన్‌, రతిన్ ఘోష్‌, బిప్లబ్ మిత్రా, స్నేహాశిష్ చక్రవర్తి, సబీనా యాస్మిన్‌ తదితరులకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది.

ఎంపీల దారి వేరే..!
టీఎంసీలో అసంతృప్తి ఎమ్మెల్యేలకే పరిమితం కాలేదు. ఇప్పటికే 20 మంది తిరుగుబాటు ఎంపీలు పార్టీకి గుడ్‌బై చెబుతూ **నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా (NCPI)**లో విలీనమయ్యారు. అంతేకాదు, కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వానికి బయటి నుంచి మద్దతు ప్రకటించారు. త్రిపురలో వెయ్యి ఓట్లకే పరిమితమైన ఓ అనామక పార్టీ ఒక్కసారిగా జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారడం విశేషం.

ఒరిజినల్‌ టీఎంసీ ఏది?
పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే టీఎంసీలో అసంతృప్తి స్వరాలు వినిపించడం మొదలైంది. అయితే పార్టీ ఆవిర్భావం తర్వాత ఇంత పెద్ద స్థాయిలో నాయకత్వానికే సవాల్‌ విసిరిన ఘటన ఇదేనని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఒకవైపు తిరుగుబాటు వర్గం తమదే అసలైన టీఎంసీ అని ప్రకటిస్తుండగా, మరోవైపు అధికారిక నాయకత్వం క్రమశిక్షణా చర్యలకు దిగింది. దీంతో పార్టీ గుర్తు, సంస్థాగత హక్కులు, నాయకత్వంపై పోరు మరింత ముదిరే సంకేతాలు కనిపిస్తున్నాయి.

అసలు ట్విస్ట్‌ ఇప్పుడే మొదలు!
ఇప్పటివరకు ఇది కేవలం రాజకీయ తిరుగుబాటులా కనిపించినా.. అసలు పోరు ఇకపై ఎన్నికల సంఘం వద్ద జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. "అసలైన తృణమూల్ కాంగ్రెస్‌" ఎవరిది? పార్టీ గుర్తుపై హక్కు ఎవరికుంది? తిరుగుబాటు వర్గం బలం ఎంత? మమతా బెనర్జీ తదుపరి అడుగు ఏమిటి? వంటి ప్రశ్నలకు సమాధానాలు రానున్న రోజుల్లోనే తేలనున్నాయి. అందుకే బెంగాల్ రాజకీయాల్లో ఇప్పుడు అందరి దృష్టి ఒక్క అంశంపైనే ఉంది... టీఎంసీ సంక్షోభం అసలు ట్విస్ట్‌ ఇప్పుడే మొదలైందా?.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement