గ్రామాల ఆగ్రహం.. ఓటింగ్‌కు దూరం | three Villages In Gujarat Boycott Polls | Sakshi
Sakshi News home page

గ్రామాల ఆగ్రహం.. ఓటింగ్‌కు దూరం

May 8 2024 9:16 AM | Updated on May 8 2024 11:10 AM

three Villages In Gujarat Boycott Polls

అహ్మదాబాద్: గుజరాత్‌లోని మూడు గ్రామాలకు చెందిన సుమారు వెయ్యి మంది ఓటర్లు మంగళవారం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఓటింగ్‌ను బహిష్కరించారు. అయితే అనేక ఇతర గ్రామాల్లోనూ ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చకపోవడంతో ఓటింగ్‌ ప్రక్రియకు పాక్షికంగా దూరంగా ఉన్నారని అధికారులు తెలిపారు.

ప్రాథమిక సమాచారం మేరకు.. బరూచ్ జిల్లాలోని కేసర్ గ్రామం, సూరత్ జిల్లాలోని సనాధార, బనస్కాంత జిల్లాలోని భఖారీ ఓటర్లు ఓటింగ్‌ను పూర్తిగా బహిష్కరించగా, జునాగఢ్ జిల్లాలోని భట్గాం గ్రామం, బోడోలి, మహిసాగర్ జిల్లాలోని కుంజర గ్రామాలు పాక్షికంగా ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. సనాధార గ్రామం బార్డోలి లోక్‌సభ స్థానం పరిధిలోకి వస్తుంది. ఇక్కడ 320 మంది ఓటర్లు ఉన్నారు. ఎన్నికల సంఘం నివేదిక ప్రకారం.. స్థానిక ఎన్నికల అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు స్వయంగా వచ్చి అభ్యర్థించినా గ్రామస్తులు ఒక్క ఓటు కూడా వేయలేదు.

పటాన్ పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే బఖ్రీ గ్రామంలోని దాదాపు 300 మంది ఓటర్లు తమ గ్రామ పంచాయతీ విభజనకు నిరసనగా సమిష్టిగా ఓటింగ్‌ను బహిష్కరించాలని నిర్ణయించుకున్నారు. అధికారులు ప్రయత్నించినప్పటికీ, గ్రామస్తులు తమ నిర్ణయం మార్చుకోలేదు. తెల్లవారుజాము నుంచే పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి చేసి వేచి చూసినా గ్రామస్తులు ఓటేయడానికి రాలేదు. బీజేపీ అభ్యర్థి భరత్‌సింగ్ దాభి స్వయంగా గ్రామానికి వెళ్లి అభ్యర్థించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.

భరూచ్ జిల్లాలోని కేసర్ గ్రామంలో దాదాపు 350 మంది ఓటర్లు కూడా ఒక్క ఓటు కూడా వేయలేదు. ఇక్కడ ఓటర్లు ఎన్నికలను బహిష్కరించడం ఇదే తొలిసారి కాదు. నదిపై వంతెన నిర్మించాలని పలుమార్లు డిమాండ్ చేసినా ప్రభుత్వం నెరవేర్చకపోవడంతో గతంలో కూడా ఇలాగే చేశామని స్థానికులు తెలిపారు. గుజరాత్‌లోని మొత్తం 26 లోక్‌సభ స్థానాలకు గాను 25 స్థానాలకు మంగళవారం ఒకే దశలో పోలింగ్ జరిగింది. సూరత్ స్థానాన్ని బీజేపీ ఏకపక్షంగా గెలుచుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement