
48 గంటల్లో రెండో ఎన్కౌంటర్
ముగ్గురు ఉగ్రవాదులూ పుల్వామా వాసులే
లొంగిపోవాలని తల్లి వేడుకున్నా వినని ఉగ్రవాది
ముష్కరులు దాక్కున్న చోటు వీడియోలు వైరల్
త్రాల్: జమ్మూకశ్మీర్లోని పుల్వామా జిల్లా, త్రాల్ ప్రాంతంలోని నాదిర్ గ్రామంలో భద్రతా దళాలతో జరిగిన కాల్పుల్లో ముగ్గురు జైషే మహ్మద్ ఉగ్రవాదులు మృతి చెందారు. గురువారం తెల్లవారుజామున జరిగిన ఎన్కౌంటర్లో మరణించిన ముగ్గురు ఉగ్రవాదులను ఆసిఫ్ అహ్మద్ షేక్, అమీర్ నజీర్ వని, యావర్ అహ్మద్ భట్గా గుర్తించారు. వీరందరూ పుల్వామా జిల్లా వాసులే.
ఆ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లు నిర్దిష్ట సమాచారం అందుకున్న భద్రతా దళాలు కార్డన్, సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఉగ్రవాదుల జాడ కోసం భద్రతాదళాలు డ్రోన్లను ఉపయోగించాయి. ఉగ్రవాదులను గుర్తించిన అనంతరం.. లొంగిపోవాలని కోరాయి. అయితే, భద్రతా సిబ్బందిని చూసిన వెంటనే, ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. మూడు గంటల పాటు కాల్పులు జరిగాయి.
ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు మృతి చెందారు. ఆ ప్రాంతంలో ఇంకా ఉగ్రవాదులు ఉండొచ్చని భద్రతా దళాలు భావిస్తున్నాయి. దీంతో ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. జమ్మూకశ్మీర్లో 48 గంటల్లో జరిగిన రెండో ఎన్కౌంటర్ ఇది. మంగళవారం షోపియాన్ జిల్లాలోని కెల్లర్ ప్రాంతంలో జరిగిన ఆపరేషన్లో ముగ్గురు లష్కరే తోయిబా ఉగ్రవాదులు హతమయిన సంగతి తెలిసిందే.
లొంగిపోవాలని తల్లి వేడుకున్నా...
మరణించిన ఉగ్రవాదుల్లో ఒకరైన అమీర్ నజీర్ ఎన్కౌంటర్కు ముందు తల్లితో మాట్లాడిన వీడియో ఒకటి బయటికి వచ్చింది. ఎన్కౌంటర్కు ముందు చివరి క్షణాల్లో నజీర్ తను దాక్కున్న ప్రదేశం నుంచి తల్లికి వీడియో కాల్ చేశాడు. తన తల్లితో, సోదరితో మాట్లాడాడు. అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకోవద్దని, భద్రతాదళాలకు లొంగి పోవాలని నజీర్ను తల్లి వేడుకుంది. ఏకే 47 పట్టుకుని ఉన్న నజీర్ లొంగిపోవడానికి నిరాకరించాడు. ‘సైన్యాన్ని నా ముందుకు రానివ్వండి. అప్పుడు చూస్తా’ అని బదులిచ్చి కాల్ కట్ చేశాడు.