బెంగళూరు: జిల్లాలోని నరసిపుర తాలూకా, హలేకంపయ్యన హుండీ గ్రామంలో తల్లిదండ్రులు, వారి కూతురు.. డెత్నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్న కేసులో నిందితుడు ఉల్లాస్గౌడ (28)ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన తర్వాత పరారీలో ఉన్న ఉల్లాస్గౌడను అరెస్ట్ చేసేందుకు ఎస్పీ మల్లికార్జున ఒక ప్రత్యేక బందాన్ని ఏర్పాటు చేశారు. ఇన్స్పెక్టర్ ధనంజయ్, శివానంద శెట్టి గాలింపు జరిపి బెంగళూరుకు పారిపోయేందుకు మైసూరులో మకాం వేసిన నిందితున్ని పట్టుకున్నారు. కోర్టులో హాజరు పరచగా రెండు వారాల కస్టడీకి ఆదేశించడంతో జైలుకు తరలించారు.
ప్రైవేటు వీడియోలు వైరల్
బుధవారం పెళ్లి జరగాల్సిన రక్షిత అనే యువతిని ఉల్లాస్గౌడ వేధించడంతో ఆమె, తల్లిదండ్రులు కలిసి ఆత్మహత్య చేసుకోవడం జిల్లాలో తీవ్ర సంచలనం కలిగిస్తోంది. మంగళవాయిద్యాలు మోగాల్సిన ఇంట శ్మశాన వాతావరణం నెలకొంది. ఊరిజనాలు అందరూ తీవ్ర విషాదంలో మునిగిపోయారు. పెళ్లి చేసి అత్తవారింటికి సాగనంపాల్సిన చోట కాటికి పంపాల్సి వచ్చిందని బంధువులు విలపించారు. విచారణలో మరిన్ని నివ్వెరపోయే అంశాలు బయటపడ్డాయి.
యువతి ప్రైవేటు వీడియోలు, ఫోటోలను ఉల్లాస్గౌడ సేకరించి సోషల్ మీడియాలో వైరల్ చేశాడు. ఇది యువతి తల్లిదండ్రులకు తెలిసి విరక్తి చెందారు. అలాగే ఆమె కాబోయే భర్తకు కూడా పంపించడంతో పెళ్లి దాదాపు క్యాన్సిల్ అయ్యింది. పరిచయం పేరిట అతడు అప్పుడప్పుడూ రక్షిత ఇంటికి వచ్చేవాడని ఇరుగుపొరుగు తెలిపారు. ప్రైవేటు ఫోటోలు, వీడియోలు అతనికి ఎలా చిక్కాయనేది పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


