చొరబాటు రాకెట్‌ను ఛేదించిన అస్సాం పోలీసులు | Three Infiltrators sent back to Bangladesh | Sakshi
Sakshi News home page

చొరబాటు రాకెట్‌ను ఛేదించిన అస్సాం పోలీసులు

Aug 21 2024 7:56 AM | Updated on Aug 21 2024 9:03 AM

Three Infiltrators sent back to Bangladesh

బంగ్లాదేశ్‌లో హింసాయుత వాతావరణం నెలకొన్న ప్రస్తుత తరుణంలో పలువురు బంగ్లాదేశీయులు భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే  భారత సైన్యం, పోలీసులు ఇలాంటివారిని పట్టుకుని, తిరిగి వారి దేశానికి పంపిస్తున్నారు. తాజాగా అస్సాంలోకి చొరబడిన ముగ్గురు  బంగ్లాదేశీయులను పోలీసులు తిరిగి  ఆ దేశానికి పంపించారు. వీరు భారత్‌లోకి ప్రవేశించేందుకు సహాయం చేస్తున్న  ఏజెంట్‌ను కూడా పోలీసులు  అరెస్టు చేశారు.

అలీ హుస్సేన్‌ అనే వ్యక్తి, చొరబాటుదారులకు ఆశ్రయం కల్పిస్తున్నాడని తమ దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు. బంగ్లాదేశ్‌కు చెందిన ఒక మహిళను భారత అధికారులు తిరిగి ఆ దేశానికి అప్పగించిన దరిమిలా అలీని అరెస్టు చేశారు. పోలీసుల విచారణలో ఆ మహిళ తాను మరో 15 మందితో  కలసి ఆగస్టు 17న బంగ్లాదేశ్‌ను విడిచిపెట్టి, ఇద్దరు ఏజెంట్ల సహాయంతో భారత్‌లోకి ప్రవేశించినట్లు తెలిపింది. ఇందుకోసం అలీకి 2,500 బంగ్లాదేశ్ టాకాలు చెల్లించానని పేర్కొంది.

కాగా అస్సాం పోలీసులు ముగ్గురు బంగ్లాదేశ్ పౌరులను అరెస్టు చేసినట్లు ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ట్విట్టర్‌ వేదికగా తెలిపారు. వీరు త్రిపుర నుంచి భారత్‌లోకి ప్రవేశించారని, వారిని బంగ్లాదేశ్‌లోని రాజ్‌షాహి జిల్లాకు చెందిన మహ్మద్ అబూ, అసదుల్ ఇస్లాం, మహ్మద్ సర్వర్‌గా గుర్తించామన్నారు. వీరిలో ఒకరి దగ్గర ఆధార్ కార్డు లభ్యమయ్యిదని ముఖ్యమంత్రి తెలిపారు. వీరు కూలి పనుల కోసం చెన్నైకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కాగా ఈ ముగ్గురు బంగ్లాదేశీయులు త్రిపుర అంతర్ రాష్ట్ర సరిహద్దు గుండా అస్సాంలోని కరీంగంజ్ జిల్లాలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తుండగా పట్టుకున్నామని సీనియర్ పోలీసు అధికారి మీడియాకు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement