సాక్షి, చెన్నై: కరూర్ నియోజకవర్గ అన్నాడీఎంకే ఎమ్మెల్యే ఎం.ఆర్.విజయభాస్కర్ తన పదవికి రాజీనామా చేశారు. చెన్నైలోని సచివాలయంలో శాసనసభ స్పీకర్ జె.సి.డి.ప్రభాకర్ను కలిసి ఆయన రాజీనామా లేఖను సమర్పించారు. ఆయన రాజీనామాను తక్షణమే ఆమోదిస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. శాసనసభ ఎన్నికల అనంతరం అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామికి వ్యతిరేకంగా తిరుగుబావుటా ఎగురవేసిన 25 మంది ఎమ్మెల్యేల్లో ఎం.ఆర్. విజయభాస్కర్ ఒకరు. ఆ సమయంలో వీరి పార్టీ పదవులను పళనిస్వామి రద్దుచేశారు.
ఆ తర్వాత వారు మళ్లీ పళనిస్వామితో రాజీ పడినా, వారికి తిరిగి పార్టీ పదవులు దక్కలేదు. గత వారం ఎం.ఆర్.విజయభాస్కర్ను అన్నాడీఎంకే ప్రచార సంయుక్త కార్యదర్శిగా పళనిస్వామి నియమించారు. అయినప్పటికీ, కరూర్ జిల్లా కార్యదర్శి పదవిని మాత్రం ఆయనకు ఇవ్వలేదు. ఈ కారణంగా తీవ్ర అసంతృప్తితో ఉన్న విజయభాస్కర్ సోమవారం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.
ఇప్పటికే అన్నాడీఎంకేకు చెందిన మధురాంతకం ఎమ్మెల్యే మరగద కుమారవేల్, ధారాపురం ఎమ్మెల్యే సత్యభామ, పెరుందురై ఎమ్మెల్యే జయకుమార్, అంబాసముద్రం ఎమ్మెల్యే ఇసక్కి సుబ్బయ్య, విరాలిమలై ఎమ్మెల్యే సి.విజయభాస్కర్ తమ పదవులకు రాజీనామా చేశారు. సి.విజయభాస్కర్ సీఎం విజయ్ నేతృత్వంలోని టీవీకేలో చేరబోతున్నట్టు సమాచారం. తాజాగా ఎం.ఆర్.విజయభాస్కర్ రాజీనామా చేయడంతో అన్నాడీఎంకే నుంచి బయటకు వచి్చన ఎమ్మెల్యేల సంఖ్య ఆరుకు చేరింది.
స్పీకర్ జేసీడీ ప్రభాకర్కు ఎంఆర్ విజయ భాస్కర్ రాజీనామా లేఖ సమర్పణ


