బీజేపీకి బై చెప్పి.. టీవీకేలో చేరిన బీజేపీ నాయ‌కురాలు | Tamil Nadu BJP leader Vijayadharani join TVK in Chennai | Sakshi
Sakshi News home page

టీవీకేలో చేరిన బీజేపీ నాయ‌కురాలు

Jun 13 2026 4:48 PM | Updated on Jun 13 2026 6:07 PM

Tamil Nadu BJP leader Vijayadharani join TVK in Chennai

చెన్నై: త‌మిళ‌నాడులో అధికార పార్టీ త‌మిళ‌గ వెట్రీ క‌ళ‌గం (టీవీకే)లోకి వ‌ల‌స‌లు కొన‌సాగుతున్నాయి. ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌లు.. సీఎం విజ‌య్ పార్టీలో చేరేందుకు క్యూ క‌డుతున్నారు. తాజాగా బీజేపీ నాయ‌కులు, మాజీ ఎమ్మెల్యే ఎస్ విజయధరణి, అన్నాడీఎంకే నేత‌ బాలగంగ త‌దిత‌రులు శ‌నివారం టీవీకేలో చేరారు. వీరికి పార్టీ కండువాల‌తో మంత్రులు ఎన్‌. ఆనంద్‌, ఆధవ్ అర్జున స్వాగ‌తం ప‌లికారు.

టీవీకే చేర‌డం సంతోషంగా ఉంద‌ని ఎస్ విజయధరణి ఈ సంద‌ర్భంగా వ్యాఖ్యానించారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. "తమిళనాడులో టీవీకే మార్పును తీసుకువచ్చింది. జోస‌ఫ్ విజ‌య్ నాయ‌క‌త్వంలోని ప్ర‌భుత్వం అవినీతిని రూపుమాపుతూ, మహిళలకు భద్రతను కల్పిస్తోంది. ముఖ్యమంత్రి తాను ఇచ్చిన హామీలను నెరవేర్చారు. ప్రజల కోసం పనిచేసే అవకాశాన్ని టీవీకే నాకు కల్పించింది, ఆ పార్టీలో చేరడం సంతోషంగా ఉందని అన్నారు.

మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి..
విజయధరణి ఇటీవ‌ల జ‌రిగిన శాన‌స‌స‌భ ఎన్నిక‌ల్లో కన్యాకుమారి జిల్లాలోని విలవంకోడ్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి బీజేపీ అభ్య‌ర్థిగా పోటీ చేసి పరాజ‌యం పాల‌య్యారు. అంత‌కుముందు ఇదే నియోజ‌క‌వ‌ర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున‌ మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైయ్యారు. తమిళనాడు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ప‌నిచేశారు. 2016లో ఆమె కర్ణాటక వ్యవహారాల బాధ్యతతో కూడిన అఖిల భారత మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. 

చ‌ద‌వండి: రంగ‌స్వామితో విజ‌య్ దూత ర‌హ‌స్య భేటీ!

2011లో తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. త‌ర్వాత వ‌రుస‌గా 2016, 2021లోనూ గెలిచారు. 2024, ఫిబ్ర‌వ‌రిలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. క‌న్యాకుమారి లోక్‌స‌భ టికెట్ కోసం ఎమ్మెల్యే ప‌ద‌వి రాజీనామా చేసి క‌మ‌లం పార్టీ కండువా క‌ప్పుకున్నారు. అయితే ఆమెకు బీజేపీ లోక్‌స‌భ టికెట్ ఇవ్వ‌లేదు. తాజాగా ముగిసిన త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో సొంత నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసినా విజ‌యం ద‌క్క‌లేదు. దీంతో బీజేపీని వీడి టీవీకే పార్టీలోకి  వ‌చ్చారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement