స్టేషన్‌ మాస్టర్‌కు నిద్రొచ్చింది.. లోకో పైలెట్‌ హారన్‌ మోగించినా.. | Station Master Fell Asleep Loco Pilot Kept Blowing The Horn | Sakshi
Sakshi News home page

స్టేషన్‌ మాస్టర్‌కు నిద్రొచ్చింది.. లోకో పైలెట్‌ హారన్‌ మోగించినా..

May 5 2024 11:05 AM | Updated on May 5 2024 11:06 AM

Station Master Fell Asleep Loco Pilot Kept Blowing The Horn

రైలు ప్రయాణాన్ని ఇష్టపడని వారెవరూ ఉండరనడంలో అతిశయోక్తి లేదు. మరి రైలు ప్రయాణంలో అనుకోని ఘటన ఏదైనా జరిగితే అది వార్తల్లో నిలుస్తుంది. తాజాగా అటువంటి ఉదంతమే సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
 
ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఇటావా సమీపంలోని ఉదీ మోడ్ రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకుంది. డ్యూటీలో ఉన్న స్టేషన్ మాస్టర్ నిద్రపోవడంతో పట్నా-కోటా ఎక్స్‌ప్రెస్ రైలు గ్రీన్ సిగ్నల్ కోసం అరగంట పాటు వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ స్టేషన్ ఆగ్రా డివిజన్ పరిధిలోకి వస్తుంది. ఈ సంఘటనను సీరియస్‌గా తీసుకున్న ఆగ్రా రైల్వే డివిజన్ అధికారులు ఈ నిర్లక్ష్యానికి కారణాన్ని వివరించాలని స్టేషన్ మాస్టర్‌ను ఆదేశించారు.

ఈ ఘటన గురించి ఆగ్రా రైల్వే డివిజన్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ (పీఆర్‌ఓ) ప్రశస్తి శ్రీవాస్తవ మాట్లాడుతూ తాము ఈ విషయంలో స్టేషన్ మాస్టర్‌కు ఛార్జ్ షీట్ జారీ చేశామని, క్రమశిక్షణా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కాగా ఘటన జరిగిన సమయంలో స్టేషన్ మాస్టర్‌ను నిద్రలేపడానికి రైలులోని లోకో పైలట్ పలుమార్లు హారన్ మోగించారు.

అరగంట తరువాత స్టేషన్‌ మాస్టర్‌ నిద్రనుంచి మేల్కొని రైలు వెళ్లడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తరువాత స్టేషన్ మాస్టర్ తన తప్పును అంగీకరించి, క్షమాపణ చెప్పారని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. డ్యూటీలో ఉన్న ‘పాయింట్‌మెన్’ ట్రాక్‌ను పరిశీలించడానికి వెళ్లాడని, దీంతో ఆ సమయంలో తాను స్టేషన్‌లో ఒంటరిగా ఉన్నానని ఆ స్టేషన్‌ మాస్టర్‌ తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement