కరుణానిధి జయంతి వేళ స్టాలిన్ భావోద్వేగం | Stalin Vows Comeback on Karunanidhi's Birth Anniversary | Sakshi
Sakshi News home page

కరుణానిధి జయంతి వేళ స్టాలిన్ భావోద్వేగం

Jun 3 2026 12:52 PM | Updated on Jun 3 2026 1:15 PM

Stalin Vows Comeback on Karunanidhi's Birth Anniversary

చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి, ద్రవిడ రాజకీయ దిగ్గజం ఎం. కరుణానిధి జయంతి వేళ చెన్నైలో నేడు (బుధవారం) భావోద్వేగ వాతావరణం నెలకొంది. డీఎంకే అధినేత ఎం.కే. స్టాలిన్ తన తండ్రి కరుణానిధికి ఘనంగా నివాళులర్పించారు. ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే పరాజయం పాలైన నేపథ్యంలో, ఈ వేదికగా స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు, డీఎంకే శ్రేణుల శపథాలు తమిళనాట రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
 

చెన్నైలోని ఒమందురార్ ప్రభుత్వ ఎస్టేట్‌లో ఉన్న కలైంజ్ఞర్ కరుణానిధి విగ్రహానికి సీఎం ఎం.కే. స్టాలిన్ పూలమాలలు వేసి  నివాళులు అర్పించారు. ఆయనతో పాటు పార్టీ అగ్ర నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తమిళనాడు రాజకీయ, సామాజిక అభివృద్ధికి కరుణానిధి చేసిన సేవలను వారు ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. 


అనంతరం డీఎంకే ప్రధాన కార్యాలయంలో స్టాలిన్ స్వయంగా పార్టీ శ్రేణులకు మిఠాయిలు పంచి, ఆ తర్వాత పార్టీ యూత్ వింగ్ కార్యాలయాన్ని కూడా సందర్శించారు.
 

‘ఎక్స్’ వేదికగా స్టాలిన్ భావోద్వేగ శపథం
కరుణానిధి జయంతిని పురస్కరించుకుని స్టాలిన్ సోషల్ మీడియా వేదికగా ఒక సుదీర్ఘమైన, అత్యంత ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు. ‘చివరి శ్వాస వరకు చక్రాల కుర్చీకే పరిమితమైనా, విశ్రాంతి అనేది లేకుండా తమిళ ప్రజల అభ్యున్నతి కోసం శ్రమించిన మహోన్నత నాయకుడు కరుణానిధి’ అని కొనియాడారు. గెలుపోటములకు లొంగని తండ్రి గుణమే తనకూ ఉందన్న స్టాలిన్ ‘ప్రస్తుతం మనం విజయావకాశాన్ని కోల్పోయాం. కానీ, ఆ సూర్యుడి వెలుగుతో తమిళనాడును కమ్మేసిన చీకట్లను త్వరలోనే పారద్రోలుతాం.. మళ్లీ విజయగాథను లిఖిస్తాం’ అంటూ కార్యకర్తల్లో కొత్త  ఉత్సాహాన్ని నింపారు.
 

ఈ నివాళి కార్యక్రమంలో పాల్గొన్న డీఎంకే ఎంపీ టి. సుమతి సంచలన వ్యాఖ్యలు చేశారు. డీఎంకే పార్టీని ఆమె ‘ఫీనిక్స్’ పక్షితో పోల్చారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా బూడిద నుంచి సైతం తిరిగి లేచే శక్తి పార్టీకి ఉందన్నారు. ఎంకే స్టాలిన్ నాయకత్వంలో పార్టీ మరింత ఉన్నత స్థాయికి చేరుకుంటుందని, కరుణానిధి ఆశయ సాధనలో తామంతా కలిసికట్టుగా ముందడుగు వేస్తామని ఆమె స్పష్టం చేశారు. 1957లో అసెంబ్లీలో అడుగుపెట్టి, దశాబ్దాల పాటు తమిళ రాజకీయాలను శాసించిన కరుణానిధి వారసత్వాన్ని స్టాలిన్ సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారని నేతలు కొనియాడారు.

103వ జయంతి వేడుకలు
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి ఎం. కరుణానిధి (కలైంజ్ఞర్) 103వ జయంతి వేడుకలను బుధవారం రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. డీఎంకే అధినేత, సీఎం ఎం.కే. స్టాలిన్ మెరీనా బీచ్‌లోని కరుణానిధి స్మారక చిహ్నం వద్ద నివాళులర్పించారు. తమిళనాడు ప్రభుత్వం తరపున మంత్రి రాజ్‌మోహన్, కరుణానిధి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే తమిళనాడు అసెంబ్లీ ప్రతిపక్ష నేత, డీఎంకే యువజన విభాగం కార్యదర్శి ఉదయనిధి స్టాలిన్ తన తాత కరుణానిధికి ఘన నివాళులర్పించారు. ఈ వేడుకల్లో పెద్ద సంఖ్యలో డీఎంకే మంత్రులు, సీనియర్ నాయకులు, కూటమి పక్షాల ప్రతినిధులు పాల్గొన్నారు.

సామాజిక న్యాయ విజేత 
మరోవైపు, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఐఎన్‌సీ) కూడా కరుణానిధికి ఘనంగా నివాళులర్పించింది. ఆయనను ఒక దార్శనికుడిగా, గొప్ప రచయితగా, సామాజిక న్యాయ విజేతగా కాంగ్రెస్ అభివర్ణించింది. సమానత్వం, విద్య, ప్రజల సంక్షేమం కోసం కరుణానిధి చూపిన నిబద్ధత భారతదేశంలోని రాబోయే తరాలకు ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తుందని తమ ‘ఎక్స్’ సందేశంలో పేర్కొంది.

Advertisement
 
Advertisement
Advertisement