న్యూఢిల్లీ: నీట్-యూజీ (NEET-UG) ప్రవేశ పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీ అవకతవకలకు సంబంధించి నిరసన వ్యక్తం చేస్తూ చేపట్టిన నిరవధిక దీక్షను ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు, పర్యావరణవేత్త సోనమ్ వాంగ్చుక్ ముగించారు. 23 రోజులుగా దీక్ష చేపట్టిన సోనమ్ వాంగ్చుక్ తన దీక్షను విరమిస్తున్నట్లు సోమవారం(జూలై 20వ తేదీ) సాయంత్రం ప్రకటించారు. కేంద్రమంత్రి జేపీ నడ్డాతో సీజేపీ ప్రతినిధులు చర్చల తర్వాత వాంగ్చుక్ తన దీక్షను విరమించారు.
అంతకుముందు సీజేపీ కార్యకర్తలు చేపట్టిన ఆందోళనకు స్వయంగా వెళ్లి మద్దతు తెలపాలని ఉందన్న ఆయన.. ఇందుకోసం ఆసుపత్రి నుంచి వెళ్లేందుకు తాత్కాలికంగానైనా అనుమతి (డిశ్చార్జ్) ఇవ్వాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ను కోరారు.
సోనమ్ వాంగ్చుక్ చేస్తున్న నిరాహార దీక్షను శనివారం పోలీసులు భగ్నం చేసిన సంగతి తెలిసిందే. ఆయన దీక్షను భగ్నం చేసేనాటికి 21 రోజులు పూర్తవ్వగా, ఆపై ఆయనను ఆయనను బలవంతంగా ఢిల్లీలోని సఫ్దర్జంగ్ ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో సైతం వాంగ్చుక్ తన దీక్షను కొనసాగించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం స్థిరంగానే ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు.
మరోవైపు, సీజేపీ కార్యకర్తల 'సంసద్ చలో' పిలుపుతో పార్లమెంట్ పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కార్యకర్తలు పార్లమెంట్ను ముట్టడించేందుకు ప్రయత్నించడంతో, వారిని అడ్డుకునేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు.
భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా బారికేడ్లను తోసుకుంటూ పార్లమెంట్లోకి ప్రవేశించేందుకు ప్రదర్శనకారులు ప్రయత్నించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఢిల్లీ వీధులు రణరంగంగా మారాయి. మరొకవైపు కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో సీజేపీ ప్రతినిధులు భేటీ అయ్యారు. కేంద్రమంత్రితో చర్చల అనంతరం వాంగ్చుక్ తన దీక్షను విరమించారు.
ఒక్కటి నెరవేర్చినా..
తాను ఈరోజు ఢిల్లీలో దీక్షను విరమిస్తానని ముందుగానే చెప్పారు వాంగ్చుక్. తన విధించిన మూడు షరతులలో ఏ ఒక్కటి నెరవేర్చినా తాను దీక్ష విరమిస్తానన్నారు. నీట్-యూజీ ప్రవేశ పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీ అవకతవకలకు కేంద్రం బాధ్యత వహించాలన్నారు. అలా కాని పక్షంలో డిమాండ్లను ఎంపీలకు, వివిధ పార్టీలకు సమర్పించేందుకు పార్లమెంట్కు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలన్నారు.


