నమ్మించి గొంతుకోసి.. కారు ప్రమాదంగా చిత్రీకరించి.. | Shocking Details Revealed In Haryana Model Sheetal Case | Sakshi
Sakshi News home page

నమ్మించి గొంతుకోసి.. కారు ప్రమాదంగా చిత్రీకరించి..

Jun 17 2025 11:29 AM | Updated on Jun 17 2025 3:18 PM

Shocking Details Revealed In Haryana Model Sheetal Case

సంగీత ప్రపంచంలో పాపులారిటీ సంపాదించుకుంటోందనుకున్న  సమయంలోనే.. ఆమె రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలు కావడం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. అయితే దర్యాప్తులో కేసు కీలక మలుపు తిరిగింది. ఆమెది ప్రమాదం కాదని.. హత్య చేశారనే విషయం బయటపడడంతో అంతా ఒక్కసారిగా కంగుతిన్నారు. 

ప్రముఖ హర్యానా మోడల్‌ శీతల్‌ చౌద్రీ హత్య కేసు మిస్టరీ వీడింది. ప్రియుడే ఆమెను నమ్మించి.. గొంతుకోసి హత్య చేశాడని క్రైమ్‌బ్రాంచ్‌ పోలీసులు నిర్ధారించారు. ఆపై ఘటనను ఓ కారు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడని వెల్లడించారు. నిందితుడు సునీల్‌ తన నేరం ఒప్పుకోవడంతో హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు. 

హర్యానా మోడల్‌ అయిన శీతల్‌ చౌద్రీ.. అక్కడి మ్యూజిక్‌ ఇండస్ట్రీలోనూ ఆల్బమ్స్‌ పాపులారిటీ సంపాదించుకుంది. ఈ క్రమంలో ఆమె తన బంధువుల అమ్మాయిలతో పానిపట్‌ సత్కర్‌తర్‌ కాలనీలో నివసించసాగింది. అయితే జూన్‌14వ తేదీన ఓ ఆల్బమ్‌ షూట్‌కు వెళ్లిన ఆమె కనిపించకుండా పోయింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు మాత్లౌదా పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్‌ కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆమె ఆచూకీని కనిపెట్టే ప్రయత్నంలో ఉన్నారు. ఈలోపు.. 

ఆదివారం(జూన్‌ 15న) ఓ కాలువలో ఆమె ప్రయాణించిన కారు కొట్టుకువచ్చింది. అయితే అందులో ఆమె మృతదేహాం లేదు. ఆ మరుసటిరోజు.. కారు దొరికిన 80 కిలోమీటర్ల దూరంలో ఆమె మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చేతిపై ఉన్న టాటూల ఆధారంగా అది శీతల్‌ మృతదేహామేనని నిర్ధారించుకున్నారు. ఈలోపు.. ఆమె ప్రియుడు, ప్రమాదం నుంచి బయటపడ్డ సునీల్‌ చెప్పిన మాటల్ని అంతా నమ్మారు. 

అయితే పోలీసుల దర్యాప్తులో అసలు విషయం బయటపడింది. పోస్ట్‌మార్టం నివేదికలో ఆమె గొంతు, శరీరంపై కత్తిగాట్లు ఉన్నాయని, ఆ గాయాల కారణంగానే ఆమె మరణించిందని తేలింది. లోతుగా దర్యాప్తు చేపట్టిన హర్యానా క్రైమ్‌ బ్రాంచ్‌ విభాగం.. చివరగా ఆమె కారులో వెళ్లిన ప్రియుడు సునీల్‌ను గట్టిగా విచారించడంతో విషయం బయటకు వచ్చింది. 

శీతల్‌ గతంలో సునీల్‌ పని చేసిన ఓ హోటల్‌లో రిసెప్షనిస్ట్‌గా పని చేసింది. వీళ్ల మధ్య ఆరేళ్లుగా పరిచయం ఉంది. శీతల్‌ ఐదు నెలల క్రితమే ఓ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే భర్తాబిడ్డలను వదిలేసి తనను వివాహం చేసుకోవాలని సునీల్‌ శీతల్‌కు ప్రపోజ్‌ పెట్టారు. ఈలోపు సునీల్‌కు ఇదివరకే పెళ్లైందని.. ఇద్దరు బిడ్డలకు తండ్రి అనే విషయం శీతల్‌కు తెలిసింది. దీంతో ఇద్దరి మధ్య గొడవలు అయ్యాయి. తన పరువును బజారున పడేస్తుందన్న భయంతో.. మాట్లాడుకుందామని శీతల్‌ను పిలిచాడు సునీల్‌. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగి.. కత్తితో ఆమె గొంతు కోసి హత్య చేశాడు. ఆపై ఆ మృతదేహాన్ని కారులో ఉంచి కాలువలోకి నెట్టేశాడు. నిందితుడు సునీల్‌ నేరం అంగీకరించడంతో.. పోలీసులు అతన్ని కోర్టులో ప్రవేశపెట్టేందుకు సిద్ధమయ్యారు. 

  • జూన్‌ 14వ తేదీ.. పానిపట్‌లో శీతల్‌ ఆల్బమ్‌ షూటింగ్‌.. ఆపై సునీల్‌తో ఔటింగ్‌. అర్ధరాత్రి దాకా కలిసి తాగిన శీతల్‌-సునీల్‌. ఆపై తన సోదరికి కాల్‌ చేసి సునీల్‌ దాడి చేస్తున్నాడని చెప్పిన శీతల్‌. కాల్‌ కట్‌ కావడంతో కంగారుపడిపోయిన శీతల్‌ సోదరి. 

  • జూన్‌ 15వ తేదీ.. మిస్సింగ్‌ కేసు నమోదు. పోలీసులు ఎంక్వైరీ. ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సునీల్‌ను ప్రశ్నించిన పోలీసులు. తాము కారులో వెళ్తుండగా ప్రమాదం జరిగిందని, తాను ఈత కొడుతూ బయటకు వచ్చి ఆస్పత్రిలో చేరానని, శీతల్‌ కారుతో సహా కొట్టుకుపోయిందని సునీల్‌ వాంగ్మూలం. శీతల్‌ ప్రయాణించిన కారు స్వాధీనం.

  • జూన్‌ 16వ తేదీ..  శీతల్‌ మృతదేహాం లభ్యం. పోస్ట్‌మార్టం నివేదికలో హత్య జరిగిందని నిర్ధారణ.

  • జూన్‌ 17వ తేదీ.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సునీల్‌ నేరాంగీకరణ. ఉదయాన్నే మెజిస్ట్రేట్‌ ముందు ప్రవేశపెట్టడంతో రిమాండ్‌ విధింపు.

Video Credits: India News Haryana

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement