
కొత్తగా వెలుగులోకి కూంబింగ్ ఆపరేషన్ విషయాలు
ఉగ్రవాదుల కోసం అన్వేషణ, వేటలో పురోగతి
శ్రీనగర్: పైశాచికంగా అమాయకుల ప్రాణాలను బలిగొని దట్టమైన దక్షిణకశ్మీర్ అడవిలోకి పారిపోయిన ఉగ్రవాదులను తుదముట్టించేందుకు భద్రతా బలగాల వేట కొనసాగుతోంది. స్థానికులు ఇస్తున్న సమాచారం, నిఘా వివరాలతో ఎప్పటికప్పుడు ఉగ్రవాదుల జాడ కోసం వెతుక్కుంటూ వెళ్తున్నా ఆలోపే వాళ్లు అక్కడి నుంచి
ఉడాయిస్తున్న ఉదంతాలు జరిగాయన్న అంశం తాజాగా వెలుగులోకి వచి్చంది. ఈ మేరకు జాతీయ మీడియా కథనం వెలువర్చింది. గత వారం రోజుల వ్యవధిలో ఉగ్రవాదులు చిక్కినట్లే చిక్కి నాలుసార్లు తప్పించుకున్నారని తెలుస్తోంది.
ఒకసారి దూరం నుంచి పరస్పర ఎదురుకాల్పులు సైతం జరిగాయని ఆ కథనం పేర్కొంది. ఉగ్రవాదుల అన్వేషణ బృందం కూంబింగ్ ఆపరేషన్పై అవగాహన ఉన్న ఒక సైన్యాధికారి ఈ వివరాలను వెల్లడించారు. ‘‘ఇది పిల్లి, ఎలుకల గేమ్లా తయారైంది. ఉగ్రవాదులు నక్కిన ప్రాంతాన్ని దాదాపు చేరుకున్నాం. ఆలోపే వాళ్లు ఉడాయించారు. ఇలా నాలుగుసార్లు జరిగింది. దట్టమైన అడవిలో దూరం నుంచి ఒక వ్యక్తి కనిపించినా సరే వెంటనే వాళ్ల వెనకాలే పరుగెత్తలేం. కొన్ని భౌగోళిక అవాంతరాలు మన కాళ్లకు బంధనాలుగా మారతాయి. మేం త్వరలోనే వాళ్లను పట్టుకుంటాం లేదా అంతమొందిస్తాం. కొద్ది రోజుల్లో ఈ కథ సుఖాంతమవుతుంది’’అని ఆ అధికారి అన్నారు.
తొలుత హర్పథ్నార్ గ్రామంలో..
ఉగ్రవాదుల జాడను తొలుత అనంత్నాగ్ జిల్లాలోని పహల్గాం తహసిల్లోని హర్పథ్నార్ గ్రామంలో గుర్తించారు. అయితే బలగాలు వచ్చేలోపే సమీప అటవీప్రాంతంలోకి పారిపోయారు. వాళ్లను బలగాలు వెంబడించాయి. అలా కుల్గాం ప్రాంతానికి వచ్చాక ఇరువైపులా కాల్పులు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. తర్వాత అక్కడి నుంచీ ఉగ్రవాదులు పారిపోయారు. తర్వాత థ్రాల్ కొండ అంచు వద్ద, ఆ తర్వాత చివరిసారిగా కోకెర్నాగ్ ప్రాంతంలో ఉగ్రవాదుల లొకేషన్ను బలగాలు గుర్తించాయి. ప్రస్తుతం కోకెర్నాగ్ సమీప అడవుల్లోనే ఉగ్రవాదులు సంచరిస్తున్నట్లు తెలుస్తోంది.
తెలివిగా వ్యవహరిస్తున్న ముష్కరులు
ఆహారం కోసం అడవి నుంచి బయటికొచ్చి సమీప గ్రామాలకు వస్తే ఉగ్రవాదులను మట్టుబెట్టడం సులభం. అలాకాకుండా వాళ్లు ఆయా గ్రామాల్లో తమకు తెల్సిన వ్యక్తుల ద్వారా అడవిలోకే ఆహారం తెప్పించుకునే ప్రయత్నాలు చేస్తారు. ఇలాంటి సందర్భాల్లో భద్రతాబలగాలకు ఉగ్రవాదులను చుట్టుముట్టే అవకాశం చిక్కుతుంది. ఆ అవకాశం లేకుండా ఉగ్రవాదులు తెలివిగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ‘‘రాత్రి ఒక గ్రామంలో భోజనానికి వెళ్లినట్లు మాకు సమాచారం అందింది. అక్కడికి మేం వెళ్లేలోపే మా రాకను పసిగట్టి వాళ్లు భోజనం చేయకుండా ఆహారాన్ని ఎత్తుకెళ్లిపోయారు’’అని సైన్యాధికారి చెప్పారు. ‘‘ఇక్కడ మరో సమస్య ఉంది. అత్యంత ఎత్తయిన పర్వతాలుండే పహల్గాం వెంటే కిష్టవార్ శ్రేణి ఉంది. వేసవికాలం కావడంతో ఇక్కడ మంచు తక్కువగా ఉంది.
దీంతో తేలిగ్గా కొండలెక్కి అటువైపు వెళ్లి తప్పించుకోవచ్చు. అటువైపు ఉన్న జమ్మూ అడవులకు వెళ్తే పట్టుకోవడం చాలా కష్టం. జమ్మూ అడవులు మరింత దట్టంగా ఉంటాయి. కిష్్టవార్ అడవుల గుండా అటువైపు వెళ్లాలనేదే ఉగ్రవాదుల పథకం కావొచ్చు. ఇప్పటికైతే వాళ్లు ఇంకా దక్షిణ కశ్మీర్లోనే ఉన్నారని అంచనావేస్తున్నాం. స్థానికుడు, పర్యాటకుని నుంచి లాక్కున్న రెండు ఫోన్లు ఉగ్రవాదుల వద్ద ఉన్నాయి. వాటిని వాళ్లు ఉపయోగిస్తే అత్యంత ఖచి్చతమైన లొకేషన్ దొరుకుతుంది. దాక్కునే క్రమంలో ఉగ్రవాదులు చేసే ఏ ఒక్క పొరపాటైనా అది వాళ్లకు మరణశాసనమే’’అని అధికారి చెప్పారు.