హర్యానాలోని థానేసర్లో సీనియర్ అడ్వకేట్ బల్వంత్ సింగ్ వాలియా ఇంట్లో భారీ చోరీ కలకలం రేపింది. ముసుగులు వేసుకున్న నలుగురు దుండగులు ఆయన నివాసంలోకి చొరబడి, తుపాకీతో బెదిరించి దాదాపు రూ. 3.15 కోట్ల విలువైన సొత్తును దోచుకెళ్లారు. ఇక్కడ మరో షాకింగ్ ట్విస్ట్ దిగ్భ్రాంతికి గురిచేసింది.
అడ్వకేట్ వాలియా తన పెంపుడు కుక్కను వాకింగ్కు తీసుకెళ్లిన సమయంలో దొంగలు ఇంట్లోకి చొరబడ్డారు. రాత్రి 10 గంటలకు తిరిగి వచ్చేసరికి, ఇల్లంతా చెల్లాచెదురుగా ఉంది. ఆయన భార్యను చేతులు, కాళ్ళు తాడుతో కట్టేసి, నోటికి అడెసివ్ టేప్ వేసి మంచంపై పడేశారు. ఇది చూసి ఏం జరగిందో అంచనా వేసే లోపే ఇంట్లోనే ఉన్న ఆ నలుగురు ముసుగు దొంగలు న్యాయవాదిని కూడా బంధించి, వయోవృద్ధులు అని కూడా చూడకుండా కొట్టి, తుపాకీతో బెదిరిస్తూ నగదు, విలువైన వస్తువులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతేకాదు ఈ ఏడాది మార్చి 20న అదే ఇంట్లో జరిగిన రూ. 50 లక్షల దొంగతనం యత్నం వెనుక కూడా తామే ఉన్నామని దుండగులు చెప్పారు. ఆ రోజు డిజిటల్ సేఫ్లను తెరవలేకపోయామని, ఇప్పుడు సేఫ్లు తెరవకపోతే కాల్చి చంపుతామని బెదిరించారు.
రూ. 17 నుంచి 20 లక్షలు నగదు 1.5 నుంచి 2 కిలోల ఆభరణాలు, దాదాపు 4 కిలోల వెండి ఆభరణాలు, పాత్రలు, విగ్రహాలు, ఒక లైసెన్స్డ్ రివాల్వర్, కార్ట్రిడ్జ్లను దోచుకుపోయారు. వెళ్లేముందు 4 సీసీటీవీ కెమెరాలను ధ్వంసం చేసి, డీవీఆర్ (DVR) ను తీసుకెళ్లారు. అంతేకాకుండా మరో రూ. 80 లక్షలు ఇవ్వాలని, పోలీసులకు ఫిర్యాదు చేస్తే చంపేస్తామని బెదిరించి బయట నుంచి గడియ పెట్టి పారిపోయారు.
ఇదీ చదవండి: 10 నెలల క్రితమే ప్రేమ పెళ్లి : రీల్స్ చేస్తోందని చంపేశాడు!
పొరుగువారి సహాయంతో బంధీల నుంచి బయటపడిన దంపతులు పోలీసులకు సమాచారం అందించారు. దీనిపై థానేసర్ సిటీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (CIA) , స్థానిక పోలీసులు సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు.
ఇదీ చదవండి : అర్ధరాత్రి దాకా క్యాబ్ డ్రైవింగ్, రూ. 20 లక్షల నష్టం, ఇపుడు రూ. కోట్ల కంపెనీ
రాజకీయ విమర్శలు
హర్యానా మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే అశోక్ అరోరా ఈ ఘటనపై స్పందిస్తూ రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని ఆరోపించారు. ఒకప్పుడు ప్రశాంతంగా ఉన్న కురుక్షేత్ర ప్రాంతంలో తీవ్రమైన నేరాలు పెరిగిపోతున్నాయని, నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.


