భరణం పిటిషన్‌ను 6 నెలల్లో పరిష్కరించండి | Resolve the maintenance petition within 6 months | Sakshi
Sakshi News home page

భరణం పిటిషన్‌ను 6 నెలల్లో పరిష్కరించండి

Jul 3 2026 3:59 AM | Updated on Jul 3 2026 3:59 AM

Resolve the maintenance petition within 6 months

విజయవాడ ఫ్యామిలీ కోర్టుకు సుప్రీంకోర్టు ఆదేశం  

హైకోర్టు తీర్పును సవాలుచేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన భర్త  

సాక్షి, న్యూఢిల్లీ: నాలుగేళ్ల వయసున్న ఆటిజం బాధిత చిన్నారిని భర్త, అత్తమామల వద్ద వదిలేసి వెళ్లిన భార్య దాఖలు చేసిన భరణం పిటిషన్‌ను 6నెలల్లోగా పరిష్కరించాలని సుప్రీంకోర్టు విజయవాడలోని ప్రిన్సిపల్‌ ఫ్యామిలీ కోర్టును ఆదేశించింది. గుండు సాయికార్తీక్‌ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ ఏపీ వ్యవహారంలో ఏపీ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై జస్టిస్‌ ఎం.ఎం.సుందరేశ్, జస్టిస్‌ శీల్‌ నాగులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ న్యాయవాది బి.శ్రవణ్‌శంకర్‌ వాదనలు వినిపిస్తూ.. సాయికార్తీక్‌ భార్య నాలుగేళ్ల ఆటిస్టిక్‌ చిన్నా­రిని భర్త, అతడి తల్లిదండ్రుల వద్ద వదిలేసి వెళ్లి­పోయినట్లు చెప్పారు. 

ఆమె కూడా భర్తతో సమానంగా చదువుకున్న ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్‌ అని, పెళ్లికి ముందు బ్యాంకులో పనిచేశారని తెలిపారు. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్న భర్త చేతికి వచ్చే నికర నెలవారీ ఆదాయం కేవలం రూ.48 వేలు మాత్రమేనని చెప్పారు. 2024లో భరణం కోసం పిటిషన్‌ వేసిన ఆమె ఇప్పటివరకు కనీసం బిడ్డ కస్టడీ కోరలేదని తెలిపారు. ఈ  పిటిషనర్‌ వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం స్పందిస్తూ.. ఇది కేవలం కింది కోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల వ్యవహారమేనని, ప్రస్తుత దశలో ఇందులో జోక్యం చేసుకోలేమని వ్యాఖ్యానించింది. అయి­తే, విజయవాడలోని ట్రయల్‌ కోర్టులో విచారణలో ఉన్న మెయింటెనెన్స్‌ పిటిషన్‌ను 6 నెలల వ్యవధిలో పరిష్కరించాలని ఆదేశిస్తూ విచారణను ముగించింది.  

అసలేం జరిగిందంటే..   
ఐర్లాండ్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్న గుండు సాయికార్తీక్‌పై అతడి భార్య హిమబిందు విజయవాడలోని ప్రిన్సిపల్‌ ఫ్యామిలీ కోర్టులో భరణం కోసం పిటిషన్‌ వేశారు. దీనిపై విచారణ జరిపిన కింది కోర్టు.. ఆమెకు నెలకు రూ.50 వేలు మధ్యంతర భరణం చెల్లించాలని 2025 నవంబర్‌ 26న ఆదేశించింది. తనకున్న ఆర్థికభారాన్ని, వ్యయాలను పరిగణనలోకి తీసుకోకుండా కింది కోర్టు ఎక్కువ మొత్తాన్ని భరణంగా ఖరారు చేసిందంటూ సాయికార్తీక్‌ ఏపీ హైకోర్టులో రివిజన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై ఈ ఏడాది ఏప్రిల్‌ 2న ఏపీ హైకోర్టు విచారణ జరిపి కింది కోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ప్రధాన కేసును వేగంగా పరిష్కరించాలని కింది కోర్టును ఆదేశిస్తూ రివిజన్‌ పిటిషన్‌ను కొట్టేశారు. దీంతో సాయికార్తీక్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement