టీఎంసీ రెబల్ నేతల చేరికలకు సంఘ్ ‘సమేమిరా’
బెంగాల్ సీఎం దూకుడుకు నాగ్పూర్ పెద్దల చెక్
సాక్షి, న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో సంచలన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో భవానీపూర్లో మమతా బెనర్జీని ఓడించి, బెంగాల్ పీఠాన్ని దక్కించుకున్న తొలి బీజేపీ సీఎంగా సువేందు అధికారి చరిత్ర సృష్టించారు. ఆ జోష్తోనే టీఎంసీని మరింతగా దెబ్బతీయాలని, ఆ పార్టీకి చెందిన అసంతృప్త ఎంపీలు, ఎమ్మెల్యేలను కమలం గూటికి చేర్చాలని సువేందు స్కెచ్వేశారు. అయితే, సీఎం స్పీడ్కు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) గట్టి బ్రేకులు వేసినట్లు తెలుస్తోంది.
టీఎంసీ నుంచి పెద్ద ఎత్తున వలసలను ప్రోత్సహించే ప్రతిపాదనను సంఘ్ ససేమిరా అనడంతో బెంగాల్ బీజేపీలో కొత్త చర్చ మొదలైంది. టీఎంసీ తిరుగుబాటు నేతలను పార్టీలో చేర్చుకుంటే భవిష్యత్ ఎన్నికల్లో తిరుగుండదని సువేందు భావించారు. ఇప్పటికే పలువురు టీఎంసీ కీలక నేతలతో సువేందు అధికారి చర్చలు జరిపి, చేరికలకు లైన్ క్లియర్ చేసుకున్నారు. సంఘ్ ఆలోచనలు వేరుగా ఉన్నాయి. ‘తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కోసం ఇతర పార్టీల నేతలను చేర్చుకుంటే, పార్టీ సిద్ధాంతాల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుంది.
క్షేత్రస్థాయిలో పార్టీ కోసం రక్తం చిందించిన సొంత క్యాడర్ నైతిక స్థైర్యం దెబ్బతింటుంది. తొందరపాటు రాజకీయ చేరికల కంటే దీర్థ కాలికంగా పార్టీని బలోపేతం చేసుకోవడమే ముఖ్యం’అని ఆర్ఎస్ఎస్ పెద్దలు సువేందుకు స్పష్టం చేసినట్లు సమాచారం. దీంతో, బీజేపీ కేంద్ర నాయకత్వం కూడా ఈ చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఈ మేరకు తాజాగా 20మంది టీఎంసీ ఎంపీలు త్రిపురకు చెందిన నేషనల్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎన్సీపీఐ)లోవిలీనం అవుతున్నట్లు ప్రకటించారు. ఈ పరిణామంపై ముఖ్యమంత్రి సువేందు తీవ్ర దిగ్భ్రాంతికి లోనైనట్లు తెలుస్తోంది.


