హిందూ మహా సముద్రంలో అరుదైన వాతావరణ పరిస్థితి
దేశంలో ఎల్ నినో ప్రభావాన్ని అడ్డుకునే అవకాశం
‘ఇండియన్ నినో’గా పిలుస్తున్న శాస్త్రవేత్తలు
రుతుపవన గాలుల్ని మనవైపు బలంగా నెట్టే చాన్స్
సాధారణ వర్షాలు కురుస్తాయనే అంచనాలు
సాక్షి స్పెషల్ డెస్క్ : పసిఫిక్ మహాసముద్రంలో తీవ్రమైన ‘సూపర్ ఎల్ నినో’పరిస్థితులు ఏర్పడినట్లు శాస్త్రవేత్తలు ధ్రువీకరించారు. దీనివల్ల సాధారణంగా భారతదేశంలో నైరుతి రుతుపవనా లు బలహీనపడి, వర్షాలు తగ్గిపోయి తీవ్రమైన కరువు పరిస్థితులు నెలకొనే ప్రమాదం ఉంది. కానీ ప్రస్తుతం ఆ ముప్పు తప్పే అవకాశం ఏర్పడింది. హిందూ మహాసముద్రంలో ఏర్పడుతున్న ఒక అరుదైన వాతావరణ పరిస్థితి మనల్ని కాపాడనున్నట్టు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఆ పరిస్థితినే శాస్త్రవేత్తలు ‘పాజిటివ్ ఇండియన్ ఓషన్ డైపోల్’ (పాజిటివ్ ఐఓడీ) లేదా ‘ఇండియన్ నినో’అని పిలుస్తున్నారు.
ఏమిటీ పాజిటివ్ ఐఓడీ?: హిందూ మహాసముద్రం తూర్పు, పశ్చిమ భాగాల మధ్య ఉష్ణోగ్రతల్లో వచ్చే మార్పునే ‘ఐఓడీ’అంటారు. ఈ పరిస్థితులో పశ్చిమ భాగం (భారత్/ఆఫ్రికా వైపు) సముద్రపు నీరు సాధారణం కంటే బాగా వేడెక్కుతుంది. దీనివల్ల భారీగా తేమతో కూడిన మేఘాలు ఏర్పడతాయి. తూర్పు భాగం (ఇండోనేసియా వైపు)లో నీరు సాధారణం కంటే చల్లబడుతుంది. పసిఫిక్లోని ఎల్ నినో మన దేశానికి వచ్చే రుతుపవన గాలులను వెనక్కి లాగేస్తుంటే.. హిందూ మహాసముద్రంలోని ‘ఇండియన్ నినో’ఆ గాలులను అంతే బలంగా మన దేశం వైపు నెడుతుంది. ఫలితంగా ఎల్ నినో తెచ్చే పొడి గాలులు తటస్థంగా మారి, దేశంలో సాధారణ వర్షాలు కురుస్తాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
1997 నాటి వాతావరణ అద్భుతం!: ఇలాంటి పరిస్థితి 1997లోనూ చోటు చేసుకుంది. ఆ ఏడాది.. శతాబ్దంలోనే అత్యంత బలమైన ఎల్ నినో రావడంతో భారత్లో తీవ్ర కరువు ఖాయమనే అంచనాలు వెలువడ్డాయి. కానీ సరిగ్గా అదే సమయంలో హిందూ మహాసముద్రంలో ఏర్పడిన బలమైన ‘పాజిటివ్ ఐఓడీ’... ఎల్ నినో ప్రభావాన్ని పూర్తిగా తిప్పికొట్టింది. ఆ ఏడాది కరువు రాకపోగా.. దేశంలో సాధారణం కంటే 2 శాతం ఎక్కువే వర్షాలు కురిశాయి. వాస్తవానికి ఎల్ నినో వచ్చిన ప్రతిసారీ దేశంలో కరువు రావాలనేమీ లేదు. అయితే ఈ ఏడాది మనకు ‘ఇండియన్ నినో’రక్షణగా నిలవబోతున్నదన్న అంచనాలు, భారతీయ రైతాంగానికి, సాధారణ ప్రజలకు ఇది పెద్ద ఊరట అనే చెప్పాలి.


