
దేశంలోని ప్రజలు దూర ప్రయాణాలు సాగించాలనుకున్నప్పుడు రైలునే ముందుగా ఎంచుకుంటారు. రైల్వేశాఖ కూడా ప్రజల ప్రయాణ అవసరాలను గుర్తించి, ప్రత్యక రైళ్లను కూడా నడుపుతుంటుంది. జూలై ఏడు నుంచి ఒడిశాలో ప్రారంభమయ్యే రథయాత్ర ఉత్సవాలకు దేశం నలుమూలల నుంచి ప్రత్యేక రైళ్లు నడిపేందుకు రైల్వేశాఖ సిద్ధమవుతోంది.
ఒడిశాలోని పూరీలో జరిగే జగన్నాథ రథయాత్రకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ వేడుకలను చూసేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు ఎంతో ఉత్సాహంతో పూరీకి తరలివెళుతుంటారు. అయితే ఈ సమయంలో అందరికీ రైలులో రిజర్వేషన్ దొరికే అవకాశం ఉండదు. దీంతో చాలామంది తమ ప్రయాణాన్ని రద్దు చేసుకోవలసి వస్తుంది. దీనిని గుర్తించిన రైల్వేశాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తూ, భక్తుల అసంతృప్తిని తొలగించే ప్రయత్నం చేస్తోంది.
ఈసారి జగన్నాథ యాత్ర వేడుకలు జూలై 7న ప్రారంభమై జూలై 16న ముగియనున్నాయి. దీనిలో ప్రధానంగా జరిగే రథయాత్ర జూలై 7న జరగనుంది. రథయాత్ర నిర్వహణకు సంబంధించిన సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. రైల్వే శాఖ కూడా పూరీ జగన్నాథ రథయాత్రకు వెళ్లే భక్తులకు శుభవార్త చెప్పింది.
జగన్నాథ యాత్రను దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను నడపనుంది. అలాగే పూరీ వరకు అనేక రైళ్లను పొడిగించనుంది. పూరీ యాత్రకు వెళ్లే ప్రయాణికుల కోసం వివిధ రైల్వే స్టేషన్లలో ప్రత్యేక టికెట్ కౌంటర్లు ఏర్పాటు చేయనున్నారు. అలాగే ఆటోమేటిక్ టిక్కెట్ వెండింగ్ మెషీన్లను కూడా భక్తులకు రైల్వే స్టేషన్లలో అందుబాటులో ఉంచనన్నారు. తద్వారా ప్రయాణికులు టిక్కెట్లను సలభంగా పొందవచ్చని రైల్వే అధికారులు చెబుతున్నారు.