సాక్షి, ఢిల్లీ: హైడ్రాపై హైకోర్టు ఇచ్చిన తీర్పు సీఎం రేవంత్కు చెంపపెట్టు లాంటిదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. హైడ్రా ను అడ్డుపెట్టుకొని రేవంత్ రెడ్డి దందాలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ రోజు (మంగళవారం) ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించారు.హైడ్రా పేరుతో పేదల ఇళ్లను అన్యాయంగా కూలగొట్టారని కేటీఆర్ ధ్వజమెత్తారు.
రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ను కుప్పకూల్చారన్నారు. హైడ్రా అనేది బ్లాక్ మెయిల్ చేసి దోపిడి చేసే సంస్థని బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే హైడ్రా ను బంగాళాఖాతంలో వేస్తామని స్పష్టం చేశారు. హైడ్రా పేరుతో బిల్డర్లను భయపెట్టి ఒక్కో బిల్డర్ వద్ద ఫీట్ కు 200 రూపాయలు వసూలు చేస్తున్నారన్నారు.కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో రైల్వే పనులన్నీ స్తంభించిపోయాయని కేటీఆర్ ఆరోపించారు.
హైడ్రా అనే సంస్థ తొమ్మిది తలల విషసర్పంలా మారిందని, కేవలం పేదల ఇళ్లపైనే హైడ్రా చర్యలు తీసుకుంటోందని, అధికార పార్టీ నేతలు, మంత్రులు, వారి కుటుంబాలకు చెందిన అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవడం లేదన్నారు.రాష్ట్రంలోని నిషేధిత భూముల విస్తీర్ణం బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయే సమయానికి 16 లక్షల ఎకరాలు ఉండగా, కాంగ్రెస్ హయాంలో అది కోటి ఎకరాలకు చేరిందని తెలిపారు.
భూ వ్యవహారాల్లో అవినీతి, కమిషన్ల కోసం నిషేధిత భూముల జాబితాను పెంచుతున్నారని కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలుచేశారు.హైదరాబాద్లో వేలాది ఇళ్లను కూల్చివేసి, ఒక్క కొత్త ఇల్లు కూడా నిర్మించలేదని దీంతో రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా దెబ్బతిందన్నారు. పెద్ద నిర్మాణాలపై చర్యలు తీసుకోకుండా, సామాన్య ప్రజల ఇళ్లనే లక్ష్యంగా చేసుకుంటున్నారని తెలిపారు.
రేవంత్ రెడ్డిసోదరుడు తిరుపతి రెడ్డి,పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,పట్నం మహేంద్ర రెడ్డి,మంత్రి వివేక్ నివాసాలను ఎందుకు కూల్చడం లేదు.బిల్డర్స్ ను బెదిరించి డబ్బులు వసూల్ చేస్తున్నారని హైడ్రా సంస్థ సీఎం రేవంత్కు వేటకుక్కలా మారిందని కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.


