ఇద్దర్ని చంపి సంబరాలా? వీడియో వైరల్‌, పెల్లుబుకిన ఆగ్రహం | Pune Porsche Crash Accused Father Throws Lavish Bail Party Dances With Currency Garlands | Sakshi
Sakshi News home page

ఇద్దర్ని చంపి సంబరాలా? వీడియో వైరల్‌, పెల్లుబుకిన ఆగ్రహం

May 27 2026 4:19 PM | Updated on May 27 2026 4:30 PM

Pune Porsche Crash Accused Father Throws Lavish Bail Party Dances With Currency Garlands

పూణే పోర్షే (PunePorsche) కారు ప్రమాదం, ఇద్దరు ఐటీ ఉద్యోగులు దుర్మరణం పాలైన  కేసు గుర్తుందా? ఈ కేసులో నిందితులకు  ఇటీవల సుప్రీంకోర్టులో బెయిల్ లభించింది. ఈ నేపథ్యంలో నిందితుడైన మైనర్ బాలుడి తండ్రి, వ్యాపారవేత్త విశాల్ అగర్వాల్ కుటుంబ సభ్యులు ఓ స్థానిక రెస్టారెంట్‌లో జరుపుకున్న సంబరాలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.దీనిపై బాధిత కుటుంబాలు, నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 


డబ్బుల దండలు, డ్యాన్స్‌లతో సంబరాలు
సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న ఈ వీడియోలో అగర్వాల్ కుటుంబ సభ్యులు, అత్యంత ఆప్తులు కలిసి నవ్వుతూ, డ్యాన్స్ చేస్తూ, కేరింతలు కొడుతూ కనిపించారు. మార్చి 10న సుప్రీంకోర్టు విశాల్ అగర్వాల్‌కు బెయిల్ మంజూరు చేసిన కొద్దిసేపటికే ఈ వేడుక జరిగినట్లు తెలుస్తోంది. బ్యాక్‌గ్రౌండ్‌లో 1977 నాటి ప్రసిద్ధ బాలీవుడ్ పాట “బంబాయి సే ఆయా మేరా దోస్త్, దోస్త్ కో సలామ్ కరో” ప్లే అవుతుండగా కుటుంబం మొత్తం డ్యాన్స్ చేసింది.

విశాల్ అగర్వాల్ మెడలో గులాబీ రంగు పూల దండతో పాటు కరెన్సీ నోట్లతో చేసిన పెద్ద దండ కూడా ఉంది. అతని భార్య కూడా నోట్ల దండ వేసుకుని డ్యాన్స్ చేస్తూ కనిపించింది. వేడుకల సమయంలో విశాల్ అగర్వాల్‌ను అతని కుమారుడు, మరో వ్యక్తి భుజాలపైకి ఎత్తుకోగా, చుట్టూ ఉన్న అతిథులు చప్పట్లు, కేరింతలు కట్టారు. 

నెటిజన్ల ఆగ్రహం
ఈ వీడియో సోషల్ మీడియాలో వ్యాపించడంతో నెటిజన్ల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల ప్రాణాలు తీసిన ఇంతటి తీవ్రమైన కేసులో, జైలు నుండి బెయిల్‌పై వస్తూనే ఇలా బాధ్యతారాహిత్యంగా సంబరాలు చేసుకోవడంపై ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారు.

వీడియో వైరల్ కావడంపై మృతులలో ఒకరైన అశ్విని తండ్రి సురేష్ కోష్టా  ఆగ్రహం  వ్యక్తం చేశారు.  హైకోర్టు ఒకరికి శిక్ష విధిస్తే, సుప్రీంకోర్టు వారిని వదిలేస్తుంది. ఇది నేరాలను ప్రోత్సహిస్తుంది. ముస్లిం దేశాలలో ఉన్నటువంటి 'రక్తానికి రక్తం' అనే చట్టాలు భారతదేశంలోకి తీసుకువచ్చే వరకు పరిస్థితి బాగుపడదు అంటూ మండిపడ్డారు.  ఇద్దరిని చంపి, ఆ తర్వాత సంబరాలు చేసుకోవడం వారికి పారిపాటేమోఅన్నారు.  చట్టాల పట్ల భయలేదని పెదవి విరిచారు.  చట్టం కఠినంగా లేకపోతే ఎలా ప్రశ్నించారు.   నిందితుడి బెయిల్‌ను రద్దు చేసి, అతని తల్లిదండ్రులను జైలుకు పంపాలి. ఒకవేళ ఈ కేసు సుప్రీంకోర్టు ముందుకు వస్తే, వారికి బెయిల్ మంజూరు చేయకూడదని వ్యాఖ్యానించారు.

కేసు నేపథ్యం ఏమిటి?
2024 మే 19న పూణేలోని కళ్యాణి నగర్ ప్రాంతంలో  లగ్జరీ కారు పోర్షే  నడుపుతున్న ఒక మైనర్ బాలుడు మితిమీరిన వేగంగా అనీష్ అవధియా, అశ్విని కోస్టా అనే ఇద్దరు ఐటీ ఉద్యోగులను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వారిద్దరూ అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఆధారాల ట్యాంపరింగ్ ఆరోపణలుతో ప్రమాదానికి తానే కారణమని ఈ అలాగే ఈ నేరం ఒప్పుకోవాలని తమ కుటుంబ డ్రైవర్‌పై విశాల్ అగర్వాల్ ఒత్తిడి తెచ్చినట్లు కూడా దర్యాప్తు సంస్థలు పేర్కొన్నాయి. ఈ కేసులో విశాల్ అగర్వాల్ దాదాపు 22 నెలల పాటు జైలు శిక్ష అనుభవించాడని సుప్రీంకోర్టు ధర్మాసనం (జస్టిస్ బి.వి. నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్) పేర్కొంది. అతనికి బెయిల్ పొందే అర్హత ఉందని భావించిన కోర్టు, కొన్ని షరతులతో బెయిల్ మంజూరు చేసింది. అయితే, ఈ కేసుతో సంబంధం ఉన్న ఏ ఒక్క సాక్షినీ సంప్రదించడానికి లేదా ప్రభావితం చేయడానికి ప్రయత్నించకూడదని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

 

ఇదీ చదవండి: డీకే ప్రమాణ స్వీకారం ఎపుడు? ఉత్కంఠగా బ్రేక్‌ఫాస్ట్ భేటీ
 

Advertisement
 
Advertisement
Advertisement