కడప అర్బన్: కుటుంబంతో సంతోషంగా గడపాలన్న కలలు... పిల్లలను ఉన్నత చదువులు చదివించి మంచి స్థాయికి తీసుకెళ్లాలన్న ఆశలు...ఎన్నో ఏళ్ల కష్టానికి గుర్తింపుగా వచ్చిన విదేశీ పర్యటన... కానీ ఆ యాత్రే ఆయన జీవితానికి చివరి ప్రయాణంగా మారింది. కడపలోని అరవింద్ నగర్కు చెందిన ప్రముఖ మొబైల్ వ్యాపారి, లావా కంపెనీ డిస్ట్రిబ్యూటర్ ముడియం శ్రీధర్ వియత్నాంలో జరిగిన ఘోర బోటు ప్రమాదంలో మృతి చెందాడు. అతని కుటుంబం, బంధువులు, వ్యాపార వర్గాల్లో విషాదచాయలు అలుముకున్నాయి. గత 20 ఏళ్లుగా లావా మొబైల్ కంపెనీ డిస్ట్రిబ్యూటర్ గా పనిచేస్తున్న శ్రీధర్, కంపెనీ నిర్దేశించిన వ్యాపార లక్ష్యాలను విజయవంతంగా పూర్తి చేశారు. దీనికి గుర్తింపుగా ‘లావా’సెల్ఫోన్ కంపెనీ తమిళనాడు, కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వంద మందికి పైగా డిస్ట్రిబ్యూటర్ కు వియత్నాం పర్యటనను బహుమతిగా ఇచ్చి తీసుకుని వెళ్లారు.
అక్కడి ప్రముఖ పర్యాటక ప్రాంతమైన హలాంగ్ బేలో శనివారం మధ్యాహ్నం పర్యాటకులను రెండు బోట్లలో సముద్ర విహారానికి తీసుకెళ్లారు. ఒక్కో బోటులో సుమారు 30 మంది ప్రయాణిస్తున్నారు. ఈ సమయంలో ఒక్కసారిగా సముద్రంలో అలలు ఉధృతంగా ఎగసిపడటంతో శ్రీధర్ ప్రయాణిస్తున్న బోటు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో శ్రీధర్ అక్కడికక్కడే మృతి చెందాడు.
తీవ్ర విషాదంలో భార్య, కుటుంబసభ్యులు
శ్రీధర్కు భార్య ధనలక్ష్మి, కుమారుడు సత్య కౌశిక్, కుమార్తె కిరణ్మయి ఉన్నారు. సత్య కౌశిక్ బెంగళూరులో బీటెక్ రెండో సంవత్సరం, కిరణ్మయి కోయంబత్తూరులో బీటెక్ నాలుగో సంవత్సరం చదువుతున్నారు. పిల్లల భవిష్యత్తు కోసం రేయింబవళ్లు శ్రమించిన తండ్రి ఇక లేడనే వార్త వారిని తీవ్ర విషాదంలోకి నెట్టింది.
’నక్షత్ర మొబైల్’యజమాని ఇక లేరు...
కడప పాత బస్టాండ్ సమీపంలో ’నక్షత్ర మొబైల్ షాప్’నిర్వహిస్తున్న శ్రీధర్ వ్యాపారంలో నిజాయితీ, సౌమ్య స్వభావంతో ఎంతోమందికి సన్నిహితుడిగా పేరొందారు. ఆయన మృతి వార్త తెలిసి వ్యాపార వర్గాలు, స్నేహితులు, బంధువులు దిగ్భ్రాంతికి గురయ్యారు.
’నా భర్తను ఒక్కసారి తీసుకురండి’
విదేశీ పర్యటనకు ఆనందంగా వెళ్లిన భర్త ఇక శవంగా వస్తున్నాడనే వార్తను జీర్ణించుకోలేక ధనలక్ష్మి కన్నీటిపర్యంతమయ్యారు. తన భర్త మృతదేహాన్ని వీలైనంత త్వరగా స్వస్థలమైన కడపకు తరలించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
శ్రీధర్ కుటుంబాన్ని పరామర్శించిన ఆర్డీవో..!
వియత్నాంలో జరిగిన పడవ ప్రమాదంలో కడపకు చెందిన ముడియం శ్రీధర్ మృతి చెందిన విషయం తెలుసుకున్న వెంటనే జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆదేశాల మేరకు కడప ఆర్డీవో మురళి శనివారం సాయంత్రం బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఈ ఘటన పట్ల జిల్లా యంత్రాంగం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోందని ఆర్డీవో తెలిపారు. శ్రీధర్ మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకురావడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను సమీక్షిస్తున్నామన్నారు. శ్రీధర్ వాణిజ్య భాగస్వామ్య కంపెనీ యాజమాన్య ప్రతినిధితో కూడా మాట్లాడి సమన్వయం చేస్తున్నట్లు చెప్పారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరఫున అన్ని విధాలా సహాయ సహకారాలు అందించి, న్యాయం జరిగేలా కృషిచేస్తామని తెలుపుతూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.


