‘వినియోగం’ గణనీయంగా తగ్గింది! | power consumption dropped in maharashtra during winter season | Sakshi
Sakshi News home page

‘వినియోగం’ గణనీయంగా తగ్గింది!

Dec 6 2024 4:26 PM | Updated on Dec 6 2024 4:26 PM

power consumption dropped in maharashtra  during  winter season

రాష్ట్రవ్యాప్తంగా అకస్మాత్తుగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు వణికిస్తున్న చలిగాలుల

గత వారం3,000 మెగావాట్ల విద్యుత్‌ వినియోగం.. ఈ వారంలో 2,500కు తగ్గుదల

చలి ఇలాగే కొనసాగితే   1,500 మెగావాట్లను చేరవచ్చని  అధికారుల అంచనా   

దాదర్‌:  ముంబైలో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో విద్యుత్‌ వినియోగం గణనీయంగా తగ్గిపోయింది. గత వారం దాకా ఉక్కపోతతో సతమతమైన ముంబైకర్లకు ఇప్పుడు చలి కారణంగా కొంతమేర ఊరట లభించినట్‌లైంది. పగలు కొంత ఉక్కపోత భరించలేకపోయినప్పటికి రాత్రుల్లో వాతావరణంలో ఆకస్మాత్తుగా మార్పులు జరుగుతున్నాయి. ఫలితంగా ఇళ్లలోని ఫ్యాన్లు, కూలర్లు, ఏసీల వినియోగం చాలా శాతం వరకు తగ్గింది. దీంతో ముంబైలో గత వారం కిందట మూడు వేల మెగావాట్ల విద్యుత్‌ వినియోగం జరగ్గా ఇప్పుడది 2,500 మెగావాట్లకు పడిపోయింది. చలికాలం ప్రారంభంలోనే సుమారు 500 మెగావాట్ల వరకు విద్యుత్‌ వినియోగం తగ్గిపోయింది. మరికొద్ది రోజుల్లో ఇది 1,500 మెగావాట్లకు చేరడం ఖాయమని అధికారులు భావిస్తున్నారు. 

వేసవికాలంలో 4,550 మెగావాట్లపైనే.... 
వేసవి కాలంలో ఎండలు మండిపోవడంతో ఉదయం 10 గంటల తరువాత ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు జనాలు జంకుతారు. ఇళ్లల్లో, కార్యాలయాల్లో, వ్యాపార, వాణిజ్య సంస్ధల్లో పనిచేసే ఉద్యోగులు ఉక్కపోత భరించలేక సతమతమవుతారు. నిరంతరంగా ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు పనిచేసినప్పటికీ వాతావరణం చల్లబడదు. దీంతో వేసవి కాలంలో ముంబైలో విద్యుత్‌ వినియోగం ఏకంగా 4,500 మెగావాట్లకు పైనే చేరుకుంటుంది. ఏటా విద్యుత్‌ వినియోగం రికార్డులను బ్రేక్‌ చేస్తూనే ఉంటుంది. వేసవి కాలం మినహా మిగిలిన సీజన్లలో విద్యుత్‌ వినియోగం ఒక్కసారిగా తగ్గిపోతుంది. ఇళ్లు, షాపులు, కార్యాలయాల్లో విశ్రాంతిలేకుండా ఫ్యాన్లు, ఏసీలు పనిచేయడంతో రెండు రోజుల కిందట విద్యుత్‌ వినియోగం 2,500 మెగావాట్లకు చేరుకుంది. టాటా పవర్‌ నుంచి 382 మెగావాట్లు, అదాణీ డహాణు విద్యుత్‌ కేంద్రం నుంచి 288 మెగావాట్లు, ముంబై ఎక్చేంజ్‌ నుంచి 1,971 మెగావాట్లు విద్యుత్‌ సరఫరా జరిగింది.  

ముంబైలో భిన్నంగా... 
ఇదిలాఉండగా దేశ ఆర్థిక రాజధాని ముంబైలో విద్యుత్‌ వినియోగం గణనీయంగా తగ్గిపోయినప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా డిమాండ్‌ భారీగా పెరిగిపోయింది. ప్రస్తుతం శీతాకాలం ప్రారంభమైనప్పటికీ అనేక జిల్లాల్లో వాతావరణం ఇంకా వేసవి ఎండలు తలపిస్తున్నాయి. రోజు ఏకంగా 31,001 మెగావాట్ల విద్యుత్‌ వినియోగం జరుగుతోంది. పెద్ద మొత్తంలో విద్యుత్‌ వినియోగం పెరిగిపోవడంతో మహానిరి్మతి కంపెనీ నుంచి 6,252 మెగావాట్లు, ప్రైవేటు కంపెనీల నుంచి 8,728 మెగావాట్లు, ఎక్చేంజి నుంచి సుమారు 8 వేల మెగావాట్లు విద్యుత్‌ సేకరించి ఈ డిమాండ్‌ను పూరిస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలోని వివిధ ప్రధాన నగరాలతో పోలిస్తే ముంబైలో విద్యుత్‌ వినియోగం అధికంగా ఉంటుంది. ప్రైవేటు, ప్రభుత్వ కార్యాలయాలు, వ్యాపార, వాణిజ్య సంస్ధలు అధికంగా ఉండడమే ఇందుకు ప్రధాన కారణం. వీటితోపాటు జంక్షన్ల వద్ద, ప్రధాన రహదారులపై, పర్యాటక ప్రాంతాల్లో వాణిజ్య, వ్యాపార ప్రకటనల బోర్డులు, హోర్డింగులు అడుగడుగున ఉంటాయి. వీటిలో కొన్ని ఎల్రక్టానిక్, డిజిటల్‌ బోర్డులుంటాయి. రాత్రుల్లో వాటికి విద్యుత్‌ సరఫరా చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా సాధారణ బోర్డులకు ప్లడ్‌ లైట్లు వెలుగుతాయి. దీంతో రాత్రి వాతావరణం చల్లిబడినప్పటికి విద్యుత్‌ వినియోగం పగలు మాదిరిగానే జరుగుతుంది. 

అయితే కొద్ది నెలల కిందట ఘాట్కోపర్‌లోని చడ్డానగర్‌ జంక్షన్‌ వద్ద భారీ హోర్డింగ్‌ కూలడంతో సుమారు 17 మంది చనిపోగా 30 మంది వరకు గాయపడ్డారు. ఈ ఘటనతో అక్రమంగా ఏర్పాటు చేసిన హోర్డింగులు, బోర్డుల అంశం తెరమీదకు వచి్చంది. వివిధ రంగాల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో కళ్లు తెరచిన ప్రభుత్వం, బీఎంసీ పరిపాలన విభాగం తనిఖీలు ప్రారంభించింది. అక్రమంగా ఏర్పాటుచేసిన హోర్డింగులు, సైన్‌ బోర్డులతోపాటు వాటికి విద్యుత్‌ సరఫరా చేస్తున్న కనెక్షన్లను కూడా తొలగిస్తున్నారు. ఆ ప్రకారం ముంబైలో కొంత శాతం విద్యుత్‌ వినియోగం తగ్గాలి. కానీ ఇవేమీ విద్యుత్‌ వినియోగంపై ఎలాంటి ప్రభావం చూపడం లేదు.  

  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement