
న్యూఢిల్లీ: ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ‘ఏక్ పేడ్ మా కే నామ్’ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. దేశ రాజధాని ఢిల్లీలోని భగవాన్ మహావీర్ వనస్థలి పార్కులో గురువారం మొక్క నాటారు. ఢిల్లీ నుంచి గుజరాత్లోని ఆరావళి పర్వతాల వరకు 700 కిలోమీటర్ల మేర అడవుల పెంపకం కోసం ఉద్దేశించిన ‘ఆరావళి గ్రీన్వాల్ ప్రాజెక్టు’ను ప్రారంభించారు. మన భూగోళంపై ఆరావళి పర్వతాలు అత్యంత ప్రాచీనమైనవని ‘ఎక్స్’లో పోస్టు చేశారు.
గుజరాత్, రాజస్తాన్, హరియాణా, ఢిల్లీలో ఈ పర్వతాలు విస్తరించి ఉన్నాయని తెలిపారు. కాలుష్యం, వాతావరణ మార్పుల వల్ల ఇక్కడ అడవులు క్రమంగా అంతరించిపోతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. అందుకే అడవుల పునరుజ్జీవన పథకంపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టిందని వెల్లడించారు. ఈ ఉద్యమంలో ప్రజలంతా పాల్గొనాలని, విరివిగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా యువత చొరవ తీసుకోవాలని కోరారు. ఆరావళి గ్రీన్వాల్ ప్రాజెక్టుతో పర్యావరణం మెరుగుపడుతుందని ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తంచేశారు.